Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 26 Jul 2021 21:16 IST

1. పోలవరం డిజైన్లు మార్చినా... అంత డబ్బు ఇవ్వలేం: కేంద్రం

పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. హెడ్‌వర్క్స్‌, డిజైన్ల మార్పుతో పోలవరం ఖర్చు రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ చెప్పినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

2. SC Railways: ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధరల తగ్గింపు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ  స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు టికెట్‌ ధరను రూ.50గా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధర రూ.10, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ ధర మాత్రం రూ.20 ఉంటుందని రైల్వే శాఖ  అధికారులు తెలిపారు.

3. హింసాత్మకంగా అస్సాం, మిజోరం సరిహద్దు.. ఆరుగురు పోలీసుల మృతి

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఇవాళ మధ్యాహ్నం స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. భద్రతాసిబ్బందిపై కొందరు కర్రలతో దాడి చేయడంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు మృతిచెందారు.

4. సంక్షోభం వేళ.. కరెన్సీ నోట్లను ముద్రిస్తారా?

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రించే యోచనలో ప్రభుత్వం ఉందా అని పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానం ఇచ్చారు. 

5. Pegasus: పెగాసస్‌పై దర్యాప్తునకు మమతా సర్కార్‌ ఆదేశం!
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెగాసస్‌ స్పైవేర్‌ సహాయంతో పలువురి ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ జ్యోతిర్మయి భట్టాఛార్యల ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

6. China: మేము అమెరికాను ఒక్కటే కోరుతున్నాము...!

చైనాను బూచిగా చూపించి దుష్ప్రచారం చేయడం ఆపాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్‌ అమెరికాను కోరారు. నేడు అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వాన్డీ షెర్మన్‌ చైనాలోని టిన్జెన్‌ నగరానికి వెళ్లారు.  ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టారు.

7. Rains: ‘మహా’ విషాదం.. ఇంకా దొరకని 100మంది ఆచూకీ!

మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పెను విషాదం నింపాయి. కొండచరియలు విరిగిపడటం, అతి భారీ వర్షాలతో సంభవించిన వరదలు తీవ్ర ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. రాయగఢ్‌, వార్ధా, అకోలాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో సోమవారం మరో 11 మృతదేహాలను వెలికితీశారు. వర్షాల కారణంగా చోటుచేసుకున్న దుర్ఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 164కి పెరిగింది. ఇంకా 100మంది ఆచూకీ లభ్యంకాలేదని అధికారులు వెల్లడించారు.

8. Passport: ఇకపై.. పోస్టాఫీస్‌ నుంచి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేయవచ్చు..

విదేశాలకు వెళ్లాలంటే  పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. ఇదుంటే చాలు.. ప్రపంచంలోనే ఏ దేశానికైనా వెళ్లిరావొచ్చు. ఇన్నేళ్లు పాస్‌పోర్ట్‌ కావాలంటే పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల చుట్టూ బారులు తీరాల్సివచ్చేది. కానీ ఇప్పుడా సమస్య తప్పింది. మీ ఇంటి దగ్గరలోని తపాలా కార్యాలయం (పోస్ట్‌ ఆఫీస్‌)లోనే పాస్‌పోర్ట్‌ అప్లై చేసుకునే వెసులుబాటును ఇండియన్‌పోస్ట్‌ మీకు కల్పించనుంది. తాజాగా ఇదే విషయాన్ని ఇండియా పోస్ట్‌ ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

9. Rajkundra: అశ్లీల చిత్రాల కేసు.. నటి షెర్లిన్‌ చోప్రాకు సమన్లు

మోడల్‌, నటి షెర్లి చోప్రాకు సమన్లు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రాను కూడా విచారించనున్నారు. 

10. Tokyo Olympics: నేటి భారతం.. ఎవరెలా ఆడారంటే?

టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారుల ప్రదర్శన మోస్తరుగానే ఉంది. పతకాలు గెలిచే క్రీడల్లోనూ నిరాశ పరుస్తున్నారు. విలువిద్యలో భారత పురుషుల జట్టు కొరియా గండాన్ని దాటలేకపోయింది. పేరున్న షూటింగ్‌లోనూ ఆశావహ ఫలితాలు రాలేదు. టోక్యోలో నేటి భారత ప్రదర్శనను ఒకసారి చూద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని