Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 17 Sep 2021 21:12 IST

1. కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు: రేవంత్‌రెడ్డి

గజ్వేల్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో తెరాస పాలనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇవాళ తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. కానీ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛలేదు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాది. కానీ, రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న దళితులకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా’’ అని ప్రశ్నించారు.

ఎస్సీలు, గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాటం: ఖర్గే

2. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌.. ఇది సమయం కాదు: నిర్మల

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చి చర్చించామని వివరించారు.

3. 32 జిల్లాలకు నిధులు విడుదల చేయండి: హరీశ్‌

తెలంగాణకి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు జీఎస్టీ సమావేశంలో కేంద్ర మంత్రికి లేఖ అందించారు. 2018-19కి ఐజీఎస్టీ పరిహారంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.210 కోట్లు ఇవ్వాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను హైదరాబాద్‌ మినహా 32 జిల్లాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

4. ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఆందోళన ఉద్రిక్తం

పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మంగళగిరి డీజీపీ కార్యాలయంలో  ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు, పోలీసు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

చంద్రబాబు ఇంటిపై దాడి.. వైకాపా కుట్రలో భాగమే: కనకమేడల

5. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు‌.. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్

ఏపీలో ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

6. ‘అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తా’

జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు 10 రోజుల్లోగా ఇవ్వాలని కేఆర్‌ఎంబీ ఉపసంఘం రెండు రాష్ట్రాలను కోరింది. రూ.కోటికిపైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని కోరింది. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ బోర్డు పరిధిలోకి రాదని ఏపీ అధికారులు తెలపగా.. అందుకు తెలంగాణ నిరాకరించింది. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు విన్న కన్వీనర్‌ ఆర్‌.కె.పిళ్లై స్పందించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని వెల్లడించారు.
7.
టీకా రికార్డు.. సాయంత్రానికి 2 కోట్లు పంపిణీ

టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని భాజపా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి పెద్ద ఎత్తున డోసులను పంపిణీ చేస్తుండగా.. ఇప్పటికే 2 కోట్ల మార్క్‌ను దాటేసింది. 

8. ప్రపంచశాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట వేస్తోంది

పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాల్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతి భద్రతలతో దేశాల మధ్య నమ్మకాన్ని నెలకొల్పే విషయంలో తీవ్రవాదం పెద్ద సమస్యగా నిలిచిందన్నారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిణామాలు తీవ్రవాదాన్ని బలపరిచేలా స్పష్టంగా ఉన్నాయన్నారు. 

9. అఫ్గానిస్థాన్‌పై బయటి నుంచి నియంత్రణ ఉండబోదు

అఫ్గానిస్థాన్‌ విషయంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంపై బయటి నుంచి నియంత్రణ ఉండబోదని పేర్కొన్నారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో నిర్వహిస్తున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ శిఖరాగ్ర సమావేశంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. తాలిబన్లు.. ప్రజలకు, ప్రపంచ దేశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.

10. జట్టులో చోటు దక్కకపోవడం నిరాశే: సిరాజ్‌

టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో కొంచెం నిరాశకు గురయ్యానని హైదరబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అయితే, జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనేది నా కల. అయితే, జట్టు ఎంపిక మన చేతిలో లేదు. జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదు. ఫార్మాట్‌ ఏదైనా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషిస్తాను’ అని సిరాజ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని