Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 01 Dec 2021 20:55 IST

1. సినిమా టికెట్ల ధరల పెంపునకు హైకోర్టు అనుమతి!

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతిచ్చింది. థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అఖండ, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప తదితర బడ్జెట్‌ సినిమాలకు ధరలు పెంచుతామని తెలిపాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. 

2. క్రిస్మస్, సంక్రాంతి స్పెషల్‌.. ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 

3. ఓటీఎస్‌ పథకంపై దుష్ప్రచారం వద్దు : బొత్స 

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్ పథకం (ఓటీఎస్‌) విషయంలో బలవంతం ఏమీ లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటీఎస్‌ ద్వారా ఇళ్లపై సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని సీఎం పాదయాత్రలో హామీ ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ‘‘రాష్ట్రంలో 55 లక్షల మంది పేదలు ఇళ్లు కట్టుకున్నారు. పట్టణాల్లో రూ.15 లక్షల విలువైన ఇంటిని రూ.25వేలకే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ నెల 20వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తాం’’ అని బొత్స వెల్లడించారు.

4. మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్న ప్రజలు: ఈటల

తెలంగాణలో ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ నియంత వైఖరికి తెలంగాణ ప్రజలు మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారన్నారు. హైదరాబాద్ గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య 12వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఈటల నివాళులర్పించారు. అమరవీరులు కోరుకున్న స్వేచ్ఛాయూత, ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదన్నారు

5. యూపీఏనా..? అలాంటిదేమీ లేదు: దీదీ

భాజపాకు ప్రత్యామ్నాయం కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఆమె మహారాష్ట్రలో పర్యటించారు. పలువురు మహారాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి..? యూపీఏ లాంటిదేమీ లేదు’ అని వ్యాఖ్యానించారు.

6. ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అంతర్జాతీయ విమానాలపై డీజీసీఏ కీలక నిర్ణయం!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు డీజీసీఏ వెల్లడించింది. అయితే, కొత్త తేదీలను తర్వాత తెలియజేయనున్నట్టు పేర్కొంది.

వ్యాక్సినేషన్‌కు లక్కీ డ్రా.. ₹60,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్‌!

7. ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనాలనుకునే పాలసీదారులకు గమనిక!

ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ప్రభుత్వం, అందుకోసం తగిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. ఐపీఓ పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించ తలపెట్టిన నేపథ్యంలో బుధవారం కీలక ప్రకటన జారీ చేసింది. ఐపీఓలో పాల్గొనాలనుకునేవారు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌-PAN)ను అప్‌డేట్‌ చేయాలని కోరింది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ కోసం డీమాట్‌ ఖాతాను సైతం కలిగి ఉండాలని గుర్తుచేసింది. అందుకయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాలని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

8. ఆలోగా దేశవ్యాప్తంగా BSNL 4g సేవలు: కేంద్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వెల్లడించింది. 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కంపెనీ తొలి ఏడాది ఆదాయం రూ.900 కోట్ల మేర పెరగనుందని తెలిపింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్‌ సమాధానం ఇచ్చారు.

9. చైనాకు సవాల్‌.. బీఆర్‌ఐకీ పోటీగా ఐరోపా సమాఖ్య ప్లాన్‌..!

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషేయేటీవ్‌కు పోటీగా ఐరోపా సమాఖ్య సరికొత్త పెట్టుబడుల ప్రణాళిక ప్రకటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగా డిజిటల్‌, రవాణా, పర్యావరణ, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. ఆఫ్రికా, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికలో ఇదొక భాగంగా భావిస్తున్నారు.

10. టెస్టు ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చిన శ్రేయస్‌

కివీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్‌ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే శతకం (105),  అర్ధశతకం (65) సాధించిన శ్రేయస్ ఏకంగా బ్యాటర్ల జాబితాలో 74వ స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్‌ ఆరు స్థానాలు పైకి ఎగబాకి 66వ స్థానానికి, వృద్ధిమాన్‌ సాహా తొమ్మిది స్థానాలను మెరుగుపరుచుకుని 99వ స్థానానికి చేరాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని