Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..
1. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది.
2. అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్గా ఏపీ: లోకేశ్
సీఎం జగన్ పాలనలో అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్గా ఏపీ మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. బైక్పై వెళ్తున్న జంటపై దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడటం అమానుషమని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్తే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం దారుణమన్నారు.
నారా లోకేశ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
3. వివేకా హత్య కేసులో కీలక సమాచారం సేకరణ!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 95వ రోజు కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో చేపట్టిన విచారణకు ఇవాళ భరత్కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఇతను పులివెందులకు చెందిన సునీల్కుమార్ యాదవ్ బంధువు. భరత్కుమార్తో పాటు సుంకేశులకు చెందిన ఉమాశంకర్రెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.
అన్యాయాలపై కాళోజీ ఆలోచనలతో ఉద్యమించాలి: రేవంత్
4. సైబర్ క్రైం పోలీసుల కస్టడీలోకి తీన్మార్ మల్లన్న
ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్ను సైబర్ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్లన్నను ఒక్కరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా.. ధర్మాసనం ఆ మేరకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రశ్నించనున్నారు.
5. మళ్లీ 40వేలు దాటిన కొత్త కేసులు.. ముంబయిలో పెరుగుతున్న ఉద్ధృతి
కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా 40వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. మళ్లీ ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18.17లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 43,263 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు(37,875)తో పోలిస్తే దాదాపు 6వేల కేసులు పెరగడం గమనార్హం.
6. నాపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తా: నాగబాబు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అంతకంతకు వివాదానికి దారి తీస్తున్నాయి. గతంలో ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు అసోసియేషన్ బిల్డింగ్ కొని అతి తక్కువ ధరకు అమ్మేశారంటూ ఇటీవల మోహన్బాబు చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం అంతా నరేశ్-శివాజీరాజాలకే తెలుసని ఆయన అన్నారు.
7. కొవిడ్ చికిత్సలో ఐవర్మెక్టిన్ వాడొద్దు.. డోసు ఎక్కువైతే తీవ్ర ప్రమాదకరం
మనుషులు, పెంపుడు జంతువుల్లో క్రిములు, పరాన్న జీవుల నివారణకు వాడే ‘ఐవర్మెక్టిన్’ ఔషధాన్ని... కొవిడ్ చికిత్సలో ఉపయోగించవద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్ను ఈ ఔషధం సమర్థంగా అడ్డుకుంటుందని ఇప్పటివరకూ ఆధారాలు లేవన్నారు. ఈ మందును అతిగా వాడితే... వికారం, వాంతులు, మతిమరుపు, మూర్చతో పాటు మరణం కూడా సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ హెచ్చరించింది!
8. జర్నలిస్టులపై తాలిబన్ల దాష్టీకం.. మహిళల ఆందోళనలను కవర్ చేశారని..
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. ఇప్పటికే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను ఎక్కడికక్కడ అణచివేస్తున్న తాలిబన్లు.. ఆ ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా వారిపై దాడులు చేస్తున్నారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
9. ఆ అమెరికా సైనికుడి తప్పే ఈ ‘తాలిబన్ ఫైవ్’..!
అఫ్గానిస్థాన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలను చేర్చుకుంటాము అని తాలిబన్లు చెబితే ప్రపంచం నమ్మింది. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే.. తాలిబన్ల దృష్టిలో ‘అన్ని వర్గాలు’ అనే దానికి అర్థం వేరని తెలుస్తోంది. ఈ ప్రభుత్వంలో ఉగ్రవాదులు, కిడ్నాపర్లు, హత్యలను ప్రోత్సహించిన వారు, భీకరమైన జైళ్లలో ఏళ్లకేళ్లు కాలక్షేపం చేసిన వారందరికి సముచిత స్థానాలు దక్కాయి. వీరిలో ‘తాలిబన్ ఫైవ్’గా పేరున్న ఐదుగురు క్రూరమైన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు.
10. వెలుగును చూస్తానని నమ్మినవాడే బతికుంటాడు!
సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలే తనేంటో నిర్వచిస్తాయని టీమ్ఇండియా సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. నాలుగేళ్ల ఎదురు చూపులు ఫలిస్తూ ఐసీసీ టీ20 ప్రపంచకప్నకు ఎంపికైన తర్వాత అతడు ఇలా ట్వీట్ చేశాడు. ‘ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది. అయితే, వెలుతురు చూడగలమని నమ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బతికుంటారు’ అని రాసిన చిత్రాన్ని అశ్విన్ ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.