అశ్వారావుపేటలో ఉద్రిక్తత.. రణరంగంగా మారిన గిరిజనల ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు తలపెట్టిన ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. 

Updated : 27 Jun 2022 11:29 IST

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు తలపెట్టిన ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భూసమస్యలు పరిష్కరించాలంటూ ఈ ఉదయం రామన్నగూడెం నుంచి పాదయాత్రగా 200 మంది గూడెం వాసులు తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. భూ సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.

రామన్నగూడెం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరిన వందలాది మంది గిరిజనులను అశ్వారావుపేట శివారులోని వాగొడ్డిగూడెం వద్ద అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్ర కాస్త రణరంగాన్ని తలపించేలా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు మహిళలపై పోలీసుల లాఠీఛార్జి చేశారు.

దశాబ్దాల కాలంగా భూసమస్యలకు పరిష్కారం లభించడం లేదంటూ రామన్నగూడెం సర్పంచ్‌ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే  ప్రగతిభవన్‌కు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి గూడెం వాసులతో చర్చలు జరిపారు. అయినా పాదయాత్ర చేసి తీరుతామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రామన్న గూడెం వెళ్లిన పోలీసులు సర్పంచ్‌ స్వరూపతో పాటు పలువురు గ్రామస్థులను అదుపులోకి తీసుకొని అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిద్రలో ఉన్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని గ్రామస్థులు ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని