Richest Indian womens: వ్యాపారాలను పరుగులు పెట్టించారు..బిలియనీర్లుగా ఎదిగారు..

ఫోర్బ్స్‌ తాజాగా ప్రకటించిన తొలి వంద మంది సంపన్నుల జాబితాలో ఆరుగురు భారతీయ మహిళలూ చోటు దక్కించుకోవడం

Published : 08 Oct 2021 02:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫోర్బ్స్‌ తాజాగా ప్రకటించిన తొలి వంద మంది భారతీయ సంపన్నుల జాబితాలో ఆరుగురు మహిళలూ చోటు దక్కించుకోవడం విశేషం. మగవారితో సమానంగా తమ వ్యాపారాలను పరుగులు పెట్టిస్తూ.. అధికంగా లాభాలు ఆర్జించి ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్‌ గ్రూపు ఛైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ 7వ స్థానంలో నిలిచారు. 13 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆమె నికర సంపద ఒక ఏడాదిలోనే 18 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. గతేడాది ఆమె ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు.

మహిళల్లో రెండో అతిపెద్ద ధనవంతురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త, ‘హావెల్స్‌ ఇండియా’ సంస్థకు చెందిన వినోద్‌ రాయ్‌ గుప్తా నిలిచారు. ఆమె ఫోర్బ్స్‌ జాబితాలో 24వ ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె నికర సంపద 7.6 బిలియన్ల డాలర్లుగా ఉంది.

ముంబయిలోని ఔషధ, బయోటెక్నాలజీ కంపెనీ యూఎస్‌వీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్‌ లీనా తివారీ 43వ స్థానంలో నిలిచారు. ఆమె నికర సంపద 4.4 బిలియన్‌ డాలర్లు.

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ ‘బైజుస్‌’ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్‌ ఫోర్బ్స్‌ జాబితాలో 47వ స్థానాన్ని సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే.  ఈ తరుణంలో బైజుస్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వేగంగా పుంజుకొన్నాయి. దివ్య ప్రస్తుత నికర సంపద విలువ 4.05 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా అత్యంత సంపన్నుల మహిళల్లో ఐదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ వంద మంది సంపన్నుల జాబితాలో 53వ ర్యాంకు దక్కించుకున్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఆమె నికర సంపద విలువ తగ్గింది. 2020లో 4.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆమె సంపద 2021 వచ్చే సరికి 3.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టీఏఎఫ్‌ఈ)కు చెందిన మల్లికా శ్రీనివాసన్‌ ఈ జాబితాలో చోటు సంపాదించారు. వీరి నికర సంపద విలువ 2.89 బిలియన్‌ డాలర్లతో ఫోర్బ్స్‌ వంద మంది సంపన్నుల జాబితాలో 73వ స్థానంలో నిలిచారు.

కాగా.. ఫోర్బ్స్‌ ఇండియాలో తొలి 100 మంది కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వరుసగా 14వ సారి ఈ స్థానంలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు