Andhra University: ఏయూలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పేరు మార్పు చేస్తూ వెలసిన బోర్డు

గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ నైపుణాభివృద్ధి సంస్థ సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పేరును ఏయూ అధికారులు మార్చేశారు.

Published : 03 Oct 2023 20:49 IST

ఎంవీపీ కాలనీ: గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ నైపుణాభివృద్ధి సంస్థ సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పేరును ఏయూ అధికారులు మార్చేశారు. ఈ మేరకు ఆ స్థానంలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పేరిట కొత్తబోర్డు వెలసింది.  బోర్డుపై ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ ఎంబ్లమ్‌ పేరు మాయమైంది. గత నెలలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుని నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరిట ఈ కేంద్రం కొనసాగింది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ కేంద్రానికి తాళం వేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గత నెల 13న ఈ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో తాళం వేసి ఉండటాన్ని గమనించి నిరసన తెలిపారు. వెంటనే ఈ కేంద్రాన్ని తెరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనికి యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ అనుమతి ఉండాలని సిబ్బంది నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేశారు. అయితే తాజాగా ఈ కేంద్రం పేరు మార్చి.. యథావిధిగా శిక్షణలు కొనసాగించటం విశేషం. అప్పట్లో కేటాయించిన పలు రకాల యంత్ర సామాగ్రి ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని పేరిట పెట్టిన బోర్డుకు తాము వ్యతిరేకం కాదని తాజాగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 600 మంది వరకు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు తనకుందని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని