టాప్‌ 10 న్యూస్‌ -1PM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ  విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై....

Updated : 15 Apr 2021 13:03 IST

1. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ  విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై  స్పందించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌లో కరోనా ఉగ్రరూపం ధరించి కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ప్రాణాలను హరిస్తోంది. బుధవారం రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరగా.. 1,73,123 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి  

3.మాజీ మంత్రి తెదేపా సీనియర్‌నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇవాళ ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

4. నిరుద్యోగుల బలవన్మరణాలపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా ఎవరు మాట్లాడకపోయినా.. వాళ్లకు తాను అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో షర్మిల ఈ ఉదయం ఉద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

5. ఏడేళ్లుగా గుర్తుకు రాని సాగర్‌ నియోజకవర్గంపై.. ఉప ఎన్నిక వేళ సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అన్నింట్లోనూ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టులపై నిపుణులతో చర్చకు రావాలని సీఎంకు సవాల్‌ విసిరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. అధిక మొత్తంలో లావాదేవీల కోసం జరిపే ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం(ఏప్రిల్‌ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే 14 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతోనే ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ లేఖ రాశారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(హెచ్‌ఎండీఏ) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని.. దాని మాస్టర్‌ ప్లాన్‌ను పునఃసమీక్షించాలని అందులో పేర్కొన్నారు. అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయాలని సూచించారు. హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చూడాలని లేఖలో స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కట్టడికి స్థానిక సంస్థలతో కలిసి పని చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 11 నాటికి ఆ దేశం నుంచి తమ బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ఓ టీవీ ప్రసంగంలో వెల్లడించారు. ‘అఫ్గానిస్థాన్‌ సుస్థిర భవిష్యత్తులో భారత్‌, పాకిస్థాన్‌, రష్యా, చైనా, టర్కీ దేశాలకూ భాగస్వామ్యం ఉంది. కాబట్టి, ఆ దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ఆయా దేశాలు కృషి చేయాలి’ అని బైడెన్‌ ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

9. దేశాన్ని కంపెనీల నుంచి కాపాడాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 130వ జయంతి సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టికాయిత్‌ మాట్లాడుతూ.. ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌, సేవ్‌ ఫార్మర్‌’ అనే నినాదాన్ని ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి వణికిస్తోంది. నానాటికీ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మహారాష్ట్ర సహా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో ఖాళీలేక రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబయి కీలక నిర్ణయం తీసుకుంది. ఫైవ్‌స్టార్‌ హోటళ్లను కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని