Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Sep 2023 16:59 IST

1. రెండ్రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి  ఇవ్వాలని సీఐడీ కోరగా... న్యాయమూర్తి రెండ్రోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. శరద్‌ పవార్‌ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్‌ మద్దతుదారులు

మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ వర్గీయులు అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అయితే అందులో శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన నవాబ్‌ మాలిక్ సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను మినహాయించడం గమనార్హం. అజిత్ పవార్‌ (Ajit Pawar) వర్గానికి మద్దతుగా ఉన్న దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలోనే శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గం కోరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు

 తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జార్ఖండ్‌ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం చత్తీస్‌గఢ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.  భారత్‌-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్‌-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి టొరంటో విమాన టికెట్‌ బుకింగ్స్‌కు చివరి నిమిషంలో డిమాండ్ పెరిగిందని వెల్లడించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఉండవల్లి తన వ్యక్తిత్వాన్ని తానే చంపుకొన్నారు: పట్టాభి

కోర్టులకు హాజరుకాకుండా పారిపోయిన వ్యక్తి జగన్‌ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. రాజమహేంద్రవరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ‘‘చంద్రబాబు అరెస్ట్‌తో జగన్‌ తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారు. ఆయన బయటకు వచ్చాక యుద్ధమే.’’ అని పట్టాభి వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అరుణాచల్‌ అథ్లెట్లపై ‘చైనా’ వివక్ష.. దీటుగా స్పందించిన భారత్

చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు (Asian Games) సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లకు వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ను నిరాకరించినట్లు తెలిసింది. దీనిపై తాజాగా భారత్‌ ప్రతిస్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేందుకు చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు దిగిందని పేర్కొంటూ అధికారికంగా నిరసన తెలియజేసింది. అంతేకాకుండా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చైనా పర్యటన కూడా రద్దు చేసుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ‘మహిళా రిజర్వేషన్ల’ను తక్షణమే అమలు చేయొచ్చు..! రాహుల్‌ గాంధీ

 చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women reservation bill)ను ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, జనగణన (Census), డీలిమిటేషన్‌ (Delimitation) తర్వాతే దీనిని అమల్లోకి తెస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు మంచిదే.. కానీ, జనగణన, డీలిమిటేషన్‌కు ఏళ్ల సమయం పడుతుందన్నారు. ఈ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్... 24న ప్రారంభం

మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (కాచిగూడ - బెంగళూరు) రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. చైనాను అడ్డుకోవాలంటే.. భారత్‌తో సంబంధాలను బలపర్చుకోవాలి: వివేక్‌ రామస్వామి

రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే భారత్‌, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్‌ రామస్వామి చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్‌ ఓ కథనంలో పేర్కొంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఆయన నాలుగు అంశాలతో ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని