Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్లలో సరికొత్త ఫీచర్లు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains) సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్ల సంఖ్య 34కి చేరింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఒక రైలు కాషాయ రంగులో (కాసర్గోడ్-తిరువనంతపురం రూట్లో ఒకటి), మిగిలిన రైళ్లు నీలం రంగులో నడుపుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2. చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
తెదేపా-జనసేన పొత్తను జనసైనికులు స్వాగతిస్తున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారన్నారు. పవన్ను ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతామని హెచ్చరిచారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్ ప్రకటిస్తారని చెప్పారు. భాజపాతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. రూ.కోట్ల ఆస్తులున్న పెద్ద నేతలు జనసేనకు అక్కర్లేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
3. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) మంచి ఫలితాలు సాధిస్తుందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో పార్టీ విజయం ఖాయమని, రాజస్థాన్లో చాలా దగ్గరి పోటీ ఉందని, అయినప్పటికీ గెలుపొందుతామన్నారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ మేరకు మాట్లాడారు. తెలంగాణలో భాజపా (BJP) క్షీణించిందని.. అక్కడ ఆ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
తెలంగాణలో 9 ఏళ్లుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తారని కిషన్రెడ్డి తెలిపారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. ‘మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నా’: ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి
తెదేపా అధినేత చంద్రబాబుకు మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నానని ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్లలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని రాజమహేంద్రవరం చేరుకున్న వారంతా నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
ఐఫోన్ 15 (iPhone 15) మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి టెక్ వర్గాల్లో చర్చంతా దాని చుట్టే తిరుగుతోంది. సెప్టెంబర్ 22నే ప్రపంచవ్యాప్తంగా దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఐఫోన్ (iPhone 15)ను ఎందుకు కొంటున్నారో కొందరు తమ కారణాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. టెస్లా, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం ఐఫోన్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7. ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు పంజాబ్లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్ఐఏ.. వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల (Khalistani Terrorists) ఆస్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
8. పండగ సీజన్.. ఆపై వరల్డ్ కప్.. కొనుగోళ్లే కొనుగోళ్లు!
ఈ పండగ సీజన్ (Festival season)లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లలో విలువపరంగా 18- 20 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓనంతోనే దక్షిణాది మార్కెట్లలో కొనుగోళ్ల జోరు ప్రారంభమైందని పేర్కొన్నాయి. ఈసారి పండగ సీజన్ (Festival season)లోనే క్రికెట్ ప్రపంచ కప్ (World Cup 2023) కూడా రానుండడం మరో విశేషమని తెలిపాయి. దీనివల్ల కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
9. ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
ప్రపంచ వాణిజ్యానికి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ దశాబ్దాలపాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలో దీన్ని గుర్తుచేసుకుంటారని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మన్ కీ బాత్ (Mann ki Baat) కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ప్రసంగించిన ప్రధాని.. దేశం గొప్ప వాణిజ్య శక్తిగా ఉన్నప్పుడు సిల్క్ రూట్ను ఉపయోగించదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జీ20 సదస్సు సందర్భంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’’ను భారత్ సూచించిందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
భారతీయ రైల్వేలో (Indian Railways) అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్ (Vande Bharat) రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 25 రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో తొమ్మిది రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వీటిని వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో కాచిగూడ- యశ్వంత్పూర్ (KACHEGUDA- YESVANTPUR JN), విజయవాడ-చెన్నై (VIJAYAWADA-CHENNAI) మధ్య సర్వీసులందించే వందే భారత్ రైళ్లు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.