Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jan 2023 17:07 IST

1.ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు (TSLPRB)కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్‌ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్ఆనరు. ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్‌ టికెట్ నంబర్లతో లాగన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు

ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తితిదే (TTD) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) అన్నారు. తిరుమల (Tirumala)లో అధికారుల తీరుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.‘‘ సొంత ప్రణాళిక ప్రకారం తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారు. ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారు.’’ అని రమణ దీక్షితులు ట్విటర్‌లో పేర్కొన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. బడ్జెట్‌ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ

 కేంద్ర బడ్జెట్‌ (Budget 2023) వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు మొదలైన ఈ సమావేశం.. సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కీలక శాఖలకు సంబంధించిన కేటాయింపులు.. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో (2023లో) కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.తారకరత్నకు తాతగారి ఆశీర్వాదం ఉంది.. వైద్యానికి స్పందిస్తున్నారు: ఎన్టీఆర్‌

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న కుటుంబసభ్యులతో ఎన్టీఆర్‌ మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.కర్ణాటక సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు: మంత్రి సుధాకర్‌

తారకరత్న ఆరోగ్యం విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి సుధాకర్‌ తెలిపారు. కుప్పం నుంచి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్నను తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రి వద్ద ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘తారకరత్నకు నిన్నటి నుంచి నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న నిమ్హాన్స్‌ నుంచి బ్రెయిన్‌కు సంబంధించిన ప్రత్యేక వైద్యుల్ని రప్పించాం.’’అని సుధాకర్‌ తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6.అత్యవసర ద్వారం కవర్‌ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!

గాలిలో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం(Emergency Exit) కవర్‌ను తొలగించేందుకు యత్నించడం కలకలం రేపింది. నాగ్‌పూర్‌- ముంబయి ఇండిగో(IndiGo) విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అతన్ని తగిన విధంగా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ అతనిపై కేసు కూడా నమోదు చేయించినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వాహన తయారీకి ఇంకా ‘చిప్‌’ల సమస్య: మారుతీ సుజుకీ

వాహన తయారీకి సెమీకండక్టర్ల సరఫరా ఇంకా సవాల్‌గానే ఉందని మారుతీ సుజుకీ (Maruti Suzuki) సీఎఫ్‌ఓ అజయ్‌ సేథ్‌ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై తమ కంపెనీ దృష్టి సారించిందని తెలిపారు. అందుబాటులో ఉన్న సరఫరాదారుల నుంచే అధిక మొత్తంలో సెమీకండక్టర్లను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్‌

ప్రముఖ నటుడు రజనీకాంత్‌(Rajinikanth) తన ఫొటోలను, మాటలను అనుమతిలేకుండా వినియోగించకూడదంటూ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది పబ్లిక్‌ నోటీస్‌ విడుదల చేశారు. ‘‘రజనీకాంత్‌ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. వ్యాపారపరంగా రజనీకాంత్ పేరు, ఆయన ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుంది. కొందరు వ్యక్తులు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను నటనకు సంబంధించిన చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ.. వారి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ

2023 సంవత్సరాన్ని ‘పీపుల్స్‌ పద్మ’ ఏడాదిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన 2023లో తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు. ‘‘ఆదివాసీ వర్గాలకు లేదా ఆదివాసుల అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ సారి చెప్పుకోదగ్గ స్థాయిలో పద్మా అవార్డులు లభించాయి. సాధారణ నగర జీవితాలకు ఆదివాసీల జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. వారికి భిన్నమైన సవాళ్లు ఎదురవుతాయి. కానీ, వారి సంస్కృతిని కాపాడుకొంటారు. చాలా మంది గొప్ప వ్యక్తులు ఆదివాసుల భాషలపై పరిశోధనలు చేసి పద్మా సత్కారాన్ని అందుకొన్నారు. ఇది మనందరికీ గర్వకారణం.’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.భారత్‌ జోడో యాత్ర రేపు ముగింపు..!

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తుది అంకానికి చేరింది. చివరి రోజు యాత్ర నేడు శ్రీనగర్‌లోని పఠాన్‌ చౌక్‌ నుంచి ఉదయం 10.45కు ప్రారంభమైంది. రాహుల్‌ తన ట్రేడ్‌మార్క్‌ తెల్ల టీషర్ట్‌ వేసుకొని యాత్రలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆయనతోపాటు నడిచారు. నేడు యాత్ర ఏడు కిలోమీటర్లు సాగి సోన్‌వార్‌కు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు ఆగి లాల్‌చౌక్‌కు బయల్దేరుతుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని