Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Jan 2023 21:20 IST

1. బంగారం ధరకు రెక్కలు.. దేశంలో తగ్గిన వినియోగం

వివాహాది శుభకార్యాలు, పండగలకు బంగారం (Gold) కొనుగోలు చేసే అలవాటున్న మన దేశంలో గతేడాది పసిడి వినియోగం తగ్గుముఖం పట్టింది. క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో 3 శాతం మేర వినియోగం తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) వెల్లడించింది. డిసెంబర్‌ త్రైమాసికంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణంగా పేర్కొంది. దేశీయంగా బంగారం వినియోగం తగ్గుముఖం పట్టడం వల్ల వాణిజ్య లోటు తగ్గించడానికి, రూపాయి విలువ పతనం అడ్డుకోవడానికీ ఓ విధంగా దోహదం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2.అందుకే రాజధానిపై మళ్లీ వివాదం రాజేశారు.. సీఎం జగన్‌పై ప్రతిపక్షాల మండిపాటు

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే సీఎం జగన్‌ రాజధానిపై మళ్లీ వివాదం రాజేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొద్ది రోజుల్లో విశాఖ రాజధాని కాబోతోందన్న సీఎం వ్యాఖ్యలపై తెదేపా మండిపడింది. సొంత బాబాయ్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం కావడం, ఎంపీ అవినాశ్‌ రెడ్డిని విచారించడంతో.. సీఎంలో కలవరం మొదలైందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3.  మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్‌

‘పార్టీ పేరు మాత్రమే మారింది కానీ డీఎన్‌ఏ, పార్టీ గుర్తు మారలేదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధుల, భారాస నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. రూ.3వేల పింఛను ఇస్తామన్నారు, హోం మంత్రి అమిత్‌ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తామని ఆరోజు ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఈ 14 నెలల్లో హుజూరాబాద్‌లో ఏం అభివృద్ధి జరిగింది.’’ అని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదు : విపక్షాలు

 బడ్జెట్‌ సమావేశాల (Budget 2023) నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపత్రి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై విపక్ష పార్టీలు పెదవి విరిచాయి. రాష్ట్రపతి (President) చేసిన ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్నాయి. ప్రభుత్వం ఏది చెబితే దాని గురించే రాష్ట్రపతి మాట్లాడారని విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా ధరల నియంత్రణ, మత సామరస్యం, మహిళా సమస్యల ఊసే లేదని పేర్కొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగం పేద ప్రజలు, నిరుద్యోగులను ఏ మాత్రం సంతృప్తి పరచలేదని పేర్కొన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5.కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శాంతి భూషణ్‌(Shanti Bhushan)(97) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7గంటల సమయంలో దిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టులో రాజ్‌నారాయణ్‌ తరఫున న్యాయవాదిగా శాంతిభూషణ్‌ వాదనలు వినిపించారు. అనేక కీలక అంశాలపై దాఖలైన ప్రయోప్రయోజనాల వ్యాజ్యాలపై వాదనలు వినిపించిన ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ప్రఖ్యాతి గాంచారు. పౌర స్వేచ్ఛకు ఆయనను ఛాంపియన్‌గా పేర్కొంటారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. క్రోమ్‌ వాడుతున్నారా.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

వెబ్‌ విహారం అనగానే ఎక్కువ మంది మొదటి ఎంపిక గూగుల్ క్రోమ్‌ (Google  Chrome). భద్రత, ఫీచర్ల పరంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను యూజర్లను అందిస్తుండటంతో బ్రౌజింగ్‌ కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా బ్రౌజింగ్‌ చేసేప్పుడు యూజర్‌ సమాచారం ఇతరులు యాక్సెస్‌ చేయకుండా క్రోమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోమని గూగుల్ (Google) సూచిస్తుంది. కానీ, కొంత మంది యూజర్లు ఇప్పటికీ పాత వెర్షన్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటారు. తాజాగా గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని లోపాలున్నాయని (Vulnerabilities).. దాని వల్ల యూజర్స్‌ కంప్యూటర్లను హ్యాకర్స్‌ సులువుగా యాక్సెస్ చేసే అవకాశం ఉందని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


7.  సింగర్‌ అసహనం.. ఫ్లైట్‌ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!

ఒక రాజకీయ నాయకుడు విమానాశ్రయానికి వచ్చిన కారణంగా తను ఫ్లైట్‌ మిస్సయ్యానని అసహనం వ్యక్తం చేశాడు సింగర్‌ శ్రీరామ చంద్ర(Srirama chandra ). ఆ పొలిటీషియన్‌ కోసం ఫ్లై ఓవర్‌ బ్లాక్‌ చేయడం వల్ల తనకు ఆలస్యం అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.ఒక ఈవెంట్‌ కోసం నేను గోవా వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయానికి బయలుదేరిన నాకు ఫ్లై ఓవర్‌ బ్లాక్‌ చేసినట్లు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక రాజకీయ నాయకుడి కోసం ఇలా ఫ్లై ఓవర్‌ను బ్లాక్‌ చేశారు.అంటూ వీడియోను ట్వీట్‌ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. మహిళల ప్రీమియర్‌ లీగ్‌తో యువ ప్రతిభకు ప్రోత్సాహం..!: హర్మన్‌ ప్రీత్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌ మార్చిలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అన్నారు. మహిళల క్రికెట్‌ మరింత మెరుగుపడటానికి ఇది చక్కటి అవకాశమన్నారు. ‘‘ఐపీఎల్‌ ద్వారా పురుషుల క్రికెట్‌ ఎంతగా మెరుగుపడుతోందో మనం చూస్తూనే ఉన్నాం. మహిళల ఐపీఎల్‌లోనూ కచ్చితంగా అదే జరుగుతుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్‌ ప్రాముఖ్యతను సొంతం చేసుకుంటుంది. దీని వల్ల యువ ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తుంది.అని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. మస్క్‌ మరో ప్లాన్‌.. ట్విటర్‌లో పేమెంట్‌ సదుపాయం!

 ట్విటర్‌ (Twitter)లో మరో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk). ట్విటర్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో పేమెంట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. మస్క్‌ గతేడాది అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మస్క్‌ కొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. నెల్లూరు జిల్లాలో వైకాపా కోటకు బీటలు.. పార్టీకి దూరమవుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

వైకాపాకు కంచుకోటలాంటి నెల్లూరు జిల్లాలో పార్టీ బీటలువారుతోంది. ప్రస్తుతం జిల్లా వైకాపాలో గందరోగళ పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్ఠానం తీరును దుయ్యబడుతున్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపాను వీడనున్నట్టు తెలిసింది. దీంతో కోటంరెడ్డి తీరుపై అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. గత 3 నెలలుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఆనం గన్‌మెన్లను తొలగించడంతో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారిని నియమించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని