Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jun 2021 13:19 IST

1. China: లద్దాఖ్‌ వద్దకు హెచ్‌-20 బాంబర్లు..!

లద్దాఖ్‌ వద్దకు అత్యాధునిక ఆయుధాల తరలింపును చైనా ఏ మాత్రం ఆపలేదు. తాజాగా స్టెల్త్‌ యుద్ధవిమానం షియాన్‌ హెచ్‌-20 స్ట్రాటజిక్‌ బాంబర్లను సరిహద్దుల్లోని హోటన్‌ విమానాశ్రయం వద్దకు తరలించింది. ఇది లద్దాఖ్‌కు అత్యంత సమీపంలో ఉంది. భారత్‌ రఫేల్‌ జెట్‌ విమానాలను లద్దాఖ్‌ వద్ద వినియోగిస్తుండటంతో.. వ్యూహాత్మక ఆధిపత్యం కోసం చైనా షియాన్‌ హెచ్‌-20 ఫైటర్‌ జెట్‌లను మోహరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TS News: భాజపాలో చేరిన ఈటల 

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, పలువురు ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Ventilator: జేబులో పట్టే వెంటిలేటర్‌

కోల్‌కతాకు చెందిన రామేంద్ర లాల్‌ ముఖర్జీ అనే ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్‌.. కరోనాతో శ్వాస సమస్యలు ఎదుర్కొనే రోగుల కోసం ‘పాకెట్‌ వెంటిలేటర్‌’ తయారు చేశారు. దీని సాయంతో పూర్తిస్థాయి వైద్యం అందేలోపు రోగి ప్రాణాలను నిలబెట్టుకోవచ్చని చెబుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు కోలుకున్నారు. తాను అనుభవించిన బాధలు మరెవరికీ కలగకూడదని నిర్ణయించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Covid: వాసన చూసి.. కరోనాను పసిగడుతుంది 

4. TS News: రుద్రంగిలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం

బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో 13.7 సెం.మీ, జ‌గిత్యాల జిల్లా జ‌గ్గాసాగ‌ర్‌లో 12.8 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో పాటు హైదరాబాద్ న‌గ‌రంలోనూ ఈ తెల్ల‌వారుజాము నుంచి చాలా ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం కావడంతో ప‌లు చోట్ల వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఎల్‌.రమణ

రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయని తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. పార్టీలు ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటాయని.. ఈ నేపథ్యంలో తెరాస, భాజపాలు తనను ఆహ్వానించాయని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీనవర్గాల బిడ్డగా తొలినాళ్ల నుంచే తెదేపా అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు తనను ప్రోత్సహించారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సంచయిత నియామక జీవో కొట్టేసిన హైకోర్టు

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. సంచ‌యిత నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఎక్క‌డో భూములు చూపించి ఆరోపణలు: పల్లా 

7. Petrol: హైదరాబాద్‌లో పెట్రోల్‌ @ రూ.100

చమురు ధరల మంట ఇప్పట్లో ఆగేలా కన్పించట్లేదు. దేశీయ ఇంధన తయారీ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ ధరలను సోమవారం మరోసారి పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌ ధర.. తాజాగా హైదరాబాద్‌లోనూ రూ.100 దాటేసింది. తాజా పెంపుతో నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.20కి చేరింది. ఇక డీజిల్‌ ధర కూడా రూ.95 దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Raghurama: ‘కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు’

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జగన్‌ కౌంటర్‌పై రఘురామ రిజాయిండర్‌ దాఖలు చేశారు. రిజాయిండర్‌లో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘‘కౌంటర్‌లో జగన్‌ అసత్య ఆరోపణలు చేశారు. నాకు పిటిషన్‌ వేసే అర్హత లేదనడం అసంబద్ధం. పిటిషన్‌ విచారణార్హతపై ఇప్పటికే కోర్టులు స్పష్టత ఇచ్చాయి’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 74 రోజుల తర్వాత 70 వేలకు కేసులు

9. Cinema News: నెట్టింట్లో సన్నీలియోనీ పిక్‌ వైరల్‌..

ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ.. మరోసారి తన కెమెరాతో నెటిజన్లను ఫిదా చేశారు. ‘డబూ రత్నానీ క్యాలెండర్‌’ పేరుతో ఆయన ప్రతి ఏటా సెలబ్రిటీ ఫొటోలతో స్పెషల్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న విషయం విదితమే. బాలీవుడ్‌కు చెందిన విద్యాబాలన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, సన్నీలియోనీ, ఆలియాభట్‌, శ్రద్ధాకపూర్‌, హృతిక్‌రోషన్‌ వంటి స్టార్ల స్టన్నింగ్‌ లుక్స్‌తో ఈ ఏడాది క్యాలెండర్‌ సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. WTC Final: కివీస్‌కు ఉపయోగమేనన్న పుజారా

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు రెండు మ్యాచులు ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరమని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. తమకు లభించిన 10-12 రోజుల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నాడు. నిజానికి ఇంగ్లాండ్‌ వాతావరణానికి అలవాటు పడటమే సిసలైన సవాలని వెల్లడించాడు. మానసికంగా ఇందుకు అలవాటు పడాలని సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పిచ్‌ ఎవరికి అనుకూలంగా చేస్తున్నారంటే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు