Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jun 2021 13:15 IST

1. AP News: ఏపీలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్(EAPCET) నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు. ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్టుగా ఈఏపీ సెట్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. నోటిఫికేష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేస్తామ‌ని.. 26 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌ని వివ‌రించారు. జులై 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. WTC Final: వరుణుడు ఆడనిచ్చేనా? 

ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో విశ్లేషణలు.. అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ హోరాహోరీగా జరుగుతుందని ఎంతోమంది భావించారు. సమవుజ్జీలైన భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రసవత్తరమైన పోరును వీక్షించొచ్చని ఆశించారు. అందుకు భిన్నంగా అభిమానుల ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. కనీసం టాస్‌ పడకుండానే తొలిరోజు ఆట ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో వరుణుడు టెస్టు మ్యాచ్‌ ఆడటమే ఇందుకు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Virat Kohli: విరాట్‌తో మైండ్‌గేమ్స్‌ తప్పవు

3. Biden: డెల్టా డేంజరస్‌.. టీకా వేసుకోండి!

తొలుత భారత్‌లో వెలుగుచూసిన కరోనా డెల్టా వేరియంట్‌ ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళనకర రకంగా గుర్తించింది. బ్రిటన్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో మెజారిటీ కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో సైతం డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధ్యక్షుడు బైడెన్ ఈ కొత్త రకం పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Raghurama: అశోక్‌పై వ్యాఖ్య‌లను అదుపు చేయాలి: ర‌ఘురామ‌

కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్ర‌స్టు ఛైర్మ‌న్‌ అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై అనుచిత వ్యాఖ్య‌లు స‌రికాద‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. మాన్సాస్ ట్ర‌స్టుపై హైకోర్టు ఇటీవ‌ల‌ ఉత్త‌ర్వులిచ్చింద‌న్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశార‌ని పేర్కొన్నారు. అశోక్‌పై విజయ‌సాయిరెడ్డి సహా అనేక మంది అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: ధాన్యం కొంటున్నా విమ‌ర్శిస్తున్నారు: కొడాలి నాని

5. మారుతీ కారును.. లంబోర్గినిలా మార్చేశాడు!

కారు డ్రైవింగ్‌ వచ్చిన వారిలో చాలా మంది స్పోర్ట్స్‌ కార్లను ఇష్టపడతారు. కానీ, వాటి ఖరీదు రూ.కోట్లలో ఉంటుంది. సంపన్నులు మాత్రమే సొంతం చేసుకోగల ఈ కార్లను సామాన్యులు నడిపించడం గగనమే. అందుకే తానే సొంతగా సాధారణ కారును లంబోర్గిని కారుగా మార్చేశాడు అసోం రాష్ట్రానికి చెందిన ఓ మెకానిక్‌. కరీంగంజ్‌ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన నురుల్‌ హక్‌ స్థానికంగా కారు మెకానిక్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అతడికి విలాసవంతమైన స్పోర్ట్స్‌ కార్లు.. ముఖ్యంగా లంబోర్గిని కారంటే ఎంతో ఇష్టమట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Rajinikanth: యూఎస్‌కి పయనమైన తలైవా

అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శనివారం అమెరికా బయలుదేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆయన యూఎస్‌ వెళ్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సతీమణి లతతో కలిసి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కొన్ని రోజులు రజనీకాంత్‌ అమెరికాలోనే ఉండనున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తలైవా.. ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Cinema News: కాటుక కళ్లు దానం చేసింది

7. Trucaller: ట్రూ కాలర్‌ కొత్త ఫీచర్స్‌ తెలుసా..?

ట్రూకాలర్‌.. ప్రస్తుతం చాలా ఫోన్‌లో ఉండే యాప్‌. తాజాగా ఈ యాప్‌ యూజర్స్‌ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్, స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌ ఫిల్టర్‌, ఇన్‌బాక్స్‌ క్లీనర్‌ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యూజర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్స్‌ను పరిచయం చేసినట్లు ట్రూకాలర్‌ తెలిపింది. మరి ఈ ఫీచర్స్‌ ఎలా పనిచేస్తాయో చూద్దాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TS News: ఘ‌ట్‌కేస‌ర్‌లో బాలిక‌ అనుమానాస్ప‌ద మృతి

మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ వద్ద బాలిక‌(17) అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందింది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌క్కన‌ ప‌డి ఉన్న బాలిక‌ మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దుండ‌గులు హ‌త్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన బాలిక‌ ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన‌ట్లు చెబుతున్నారు. బాలిక‌ను పోచారం రాజీవ్ గృహక‌ల్ప కాల‌నీ వాసిగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* TS News: వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం

9. UN:మయన్మార్‌పై తీర్మానం.. ఓటింగ్‌కు భారత్‌ దూరం

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించి, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించింది. కానీ దీనికి భారత్‌ దూరంగా ఉంది. మయన్మార్‌  రాజకీయ సంక్షోభానికి ఓ పరిష్కారం కనుగొనేందుకు ఇప్పటికే ప్రాంతీయ కూటమి అయిన ‘ఆసియాన్‌’ ప్రక్రియ ప్రారంభించిందని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Corona: ఆ వైఖరే రెండోదశకు కారణమైంది

ఒకవైపు కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండగా.. మరోవైపు ప్రజలు నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే వైరస్ రెండోదశకు దారితీసిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఆరోగ్యశాఖలో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌ సంస్థలు, వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి.. విస్తృతం చేయాలని కోరారు. దీనిద్వారా కొవిడ్‌ను కట్టడి చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 96శాతానికి పైగా రికవరీ రేటు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని