Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jul 2021 13:42 IST

1. Rajanikanth: రాజకీయాల్లోకి రావట్లేదు..

తాను రాజకీయాల్లోకి రావట్లేదని అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎంతో కాలంగా కొనసాగిన చర్చలకు గతేడాది డిసెంబర్‌లో ఆయన చెక్‌పెట్టిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకుంటున్నట్టు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virat kohli: వామికతో కోహ్లీ ఆటవిడుపు

తమ గారాల పట్టి వామికతో విలువైన సమయం ఆస్వాదిస్తున్నారు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ. ఆమె విసిరే ఓ నవ్వు తమ ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తోందని అంటున్నారు. ఆమెకు ఆరు నెలలు నిండటంతో కేక్‌ కోసి వేడుక చేసుకున్నారు. ప్రస్తుతం విరాట్‌, అనుష్క ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టెస్టు సిరీసుకు ఇంకా సమయం ఉండటంతో బీసీసీఐ వారికి విరామం ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అతనో అద్భుతం

3. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ నాదే: కౌశిక్‌రెడ్డి

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ బయటకొచ్చింది. మాదన్నపేటకు చెందిన విజేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని..  ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Petrol Prices: పెట్రోల్‌ పెరిగింది.. డీజిల్‌ తగ్గింది!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్‌ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారి డీజిల్‌ ధరను తగ్గించడం విశేషం. లీటర్‌ పెట్రోల్‌పై సోమవారం గరిష్ఠంగా 30 పైసలు పెంచగా.. లీటర్‌ డీజిల్‌పై 16 పైసల వరకు తగ్గించారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.19, డీజిల్‌  ధర రూ.89.72గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ బైక్‌లపై త్రివర్ణ పతాకం.. సైన్యం చిహ్నం!

5. PM Modi: అసాధారణం.. హర్లీన్‌కు మోదీ ప్రశంస

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో ఆమె అందుకున్న క్యాచ్‌ అద్భుతమని పొగిడారు. మున్మందు ఇలాగే ఆడాలని ఆకాంక్షించారు. ‘మైగవ్‌ ఇండియా’ పంచుకున్న ఈ వీడియోను మోదీ ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘అసాధారణం.. వెల్‌డన్‌ హర్లీన్‌ డియోల్‌’ అని వ్యాఖ్య పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. HYD: ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేపట్టారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఎడ్లబండి మీద ఇందిరాపార్క్‌కు వచ్చారు. పెరిగిన పెట్రోల్‌ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య పరామర్శ

7. ఉత్తరభారతంలో పిడుగుల బీభత్సం

ఉత్తరభారతంలో మెరుపులతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో పిడుగుపాటుకు 68 మంది మృతి చెందినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. నిన్న ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona: 3 కోట్ల మంది మహమ్మారిని జయించారు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,32,343 పరీక్షలు నిర్వహించగా.. 37,154 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు రోజు కంటే 10 శాతం మేర కేసులు తగ్గాయి. నిన్న 39,649 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. గతేడాది జనవరి 30న దేశంలో మొదటి వైరస్‌ కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి నిన్నటివరకు 3.08 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. కోలుకున్నవారి సంఖ్య 3 కోట్ల మార్కును దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Kerala: కేరళకు దెబ్బ మీద దెబ్బ!

9. Drones: ఫ్యూజ్‌ లాగితే కదులుతున్న పాక్‌ డొంక! 

జమ్మూ వైమానిక దళ స్థావరంపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ హస్తాన్ని సూచించే కీలక ఆధారాన్ని భారత భద్రతా దళాలు గుర్తించాయి. నాటి దాడిలో డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ‘ప్రెజర్‌ ఫ్యూజ్‌’లు ఉన్నాయి. దీన్నిబట్టి ఈ బాంబుల తయారీలో పొరుగు దేశపు సైన్యం.. లష్కరే తొయిబా ఉగ్రవాద ముఠాకు సాయపడి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. జూన్‌ 27న సదరు డ్రోన్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. నాడు రెండు డ్రోన్లు బాంబులను జారవిడిచాయి. ఇందులో ఒకటి.. వైమానిక స్థావరంలో పైకప్పును పేల్చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. RAshwin: కౌంటీ క్రికెట్లో తొలిరోజే యాష్‌  రికార్డు

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో జీతన్‌ పటేల్‌ ఆరంభ ఓవర్‌ వేయగా మళ్లీ ఇన్నాళ్లకు యాష్‌ వేశాడు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిశాక జట్టు సభ్యులకు మూడు వారాల విరామం ప్రకటించారు. కొన్నిరోజులు కుటుంబంతో కలిసి బ్రిటన్‌ చుట్టొచ్చిన అశ్విన్‌కు సర్రే నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దొరుకుతుందని అతడూ అంగీకరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని