Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jul 2021 13:26 IST

1. Modi: టీకాతో మీరంతా బాహుబలులుగా మారారు

కొవిడ్ నిబంధనల మధ్య.. సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీకా ప్రాముఖ్యతను వివరించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ‘మీరంతా కనీసం ఒక్కడోసు టీకా అయినా తీసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. దీంతో 40 కోట్లకుపైగా ప్రజలు బాహుబలులుగా మారారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అభ్యర్థిస్తున్నాను. అలాగే కొవిడ్-19 కట్టడి చర్యలపై ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడుతున్నాను’ అని ప్రధాని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Parliament: కొత్త మంత్రులను పరిచయం చేసిన మోదీ

2. Tokyo Olympics: యాంటీ సెక్స్‌ బెడ్స్‌.. అవాస్తవం!

శృంగారం కట్టడి కోసం ఒలింపిక్స్‌ ఆటగాళ్ల గదుల్లో తక్కువ సామర్థ్యమున్న మంచాలను ఏర్పాటు చేశారంటూ వస్తున్న వార్తల్ని ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఖండించారు. అట్టలతో చేసినప్పటికీ.. అవి దృఢంగానే ఉంటాయని స్పష్టం చేశారు. 200 కిలోల వరకు బరువును మోయగలవని తెలిపారు. ఆ మేరకు ముందే అన్ని రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. AP News: జగన్‌ నివాస పరిసరాల్లో ఉద్రిక్తత

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ వివిధ యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ జాతీయ రహదారి నుంచి సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి తెదేపా అనుబంధ విభాగాలు తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ యువజన, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ ఐకాస ర్యాలీగా బయల్దేరాయి. దీంతో సీఎం నివాస పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొత్త వివాదానికి తెరలేపారు: బుద్ధ ప్రసాద్‌

4. ‘బెంగాల్‌లో భాజపా ఓటమికి కారణం వారే’

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజాపా ఓటమిపై ఆ పార్టీ కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకుల అతితెలివి, అతివిశ్వాసం వల్లే పార్టీ ఓటమిపాలైందని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వ మేదినీపూర్‌ జిల్లాలోని చందీపూర్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. లోక్‌సభకు రాకుండా అడ్డుకుంటున్నారు: రేవంత్‌ 

తనను గృహనిర్బంధం చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు రాకుండా అడ్డుకుంటున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఆయన లేఖ రాశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ ఉదయం రేవంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మరోవైపు తాను పార్లమెంట్ సమావేశాలకు వెళుతుంటే అడ్డుకున్నారని రేవంత్‌ ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

6. OTT: ఈ వారంలో రాబోతున్న చిత్రాలివే!

కరోనా కేసులు తగ్గినా, పరిస్థితులు ఇంకా పూర్తిగా కుదటపడని నేపథ్యంలో పలు చిత్రాలు ఓటీటీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు తెరిచినా ఏ మేరకు ప్రేక్షకులు వస్తారన్నది ప్రశ్నార్థకమే. దీంతో దర్శక-నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. గతవారంలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి చిత్రాలేంటో చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  Afghan: ఏం జరిగినా భారత్‌పై నెట్టేయడమే..! 

మా ఇంట్లో  పొయ్యిపై కూర ఉడకలేదా..? భారతే కారణం.. మా ఇంటి కుళాయిలో నీళ్లు రాలేదా.. భారతే కారణం.. పాక్‌ వైఖరి అచ్చం ఇలానే ఉంటోంది. పాకిస్థాన్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడికి పొరుగు దేశాన్నే దోషిగా చూపించాలని భావిస్తోంది. వీటికి ఆధారాలు మాత్రం ఎప్పుడూ చూపించదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆ దేశంలో జరిగే కిడ్నాపులు కూడా భారత్‌ చేయిస్తోందని ఆరోపించే స్థాయికి చేరింది. తాజాగా పాకిస్థాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌  ఆరోపణలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

8. అనుష్క కౌగిలించుకోగానే కన్నీళ్లాగలేదు : ప్రశాంత్‌వర్మ

ఏ డైరెక్టర్‌ అయినా హీరోనో ప్రొడ్యూసర్‌నో వెతుక్కుంటారు. కానీ.. ఈ డైరెక్టర్‌ మాత్రం హీరోలోనే ప్రొడ్యూసర్‌ని వెతుక్కుంటారు. మనం మాట్లాడుకుంటున్నది ‘అ!’ అనే అద్భుతమైన సినిమా తీసిన ప్రశాంత్‌వర్మ గురించి. ‘ఈటీవీ’లో తరుణ్‌భాస్కర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘మీకు మాత్రమే చెప్తా’ కార్యక్రమంలో ప్రశాంత్‌వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తరుణ్‌భాస్కర్‌ అడిగిన పలు ప్రశ్నలకు ప్రశాంత్‌ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Pegasus: ‘పెగాసస్‌’ వల పెద్దదే..

దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో వినిపించిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌ ఇప్పుడు దేశాన్ని మరోసారి కుదిపేస్తోంది. ఈ స్పైవేర్‌ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు తాజాగా సంచలన కథనం వెలువడింది. ఇంతకీ ఏంటీ ‘పెగాసస్‌’..? ఫోన్లను ఎలా హ్యాక్‌ చేస్తుంది..?చూద్దాం.ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* PAK: భారత్‌ ఆస్తులే లక్ష్యంగా..

10. Corona: 500 దిగువకు మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా..స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 38,164 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇక మరణాల సంఖ్య 500 దిగువకు చేరడం కాస్త ఊరట కలిగించే విషయం. ఏప్రిల్ 5 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఇక క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.2 శాతం తగ్గుదల కనిపించింది. 499 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని