Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Aug 2021 14:08 IST

1. TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్.. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి  సబిత మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌లో 82.08 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virat Kohli: అహాన్ని జేబులో పెట్టుకోవాలి.. అశ్విన్‌కు ఛాన్స్‌ ఉంది!

బలహీనమైన ప్రత్యర్థితో ఆడాలని తాము కోరుకోమని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. పూర్తి సామర్థ్యంతో కూడిన ఇంగ్లాండ్‌ జట్టును తాము ఓడించగలమని ధీమా వ్యక్తం చేశాడు. మూడో టెస్టుకు సిద్ధం చేసిన పిచ్‌ ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. పూర్తిగా పచ్చికతో కూడిన పిచ్‌ను రూపొందిస్తారని భావించామన్నాడు. కానీ పిచ్‌పై తక్కువ పచ్చిక కనిపిస్తోందని వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Bumrah vs Anderson: బుమ్రాలో ఔట్‌ చేసే ఉద్దేశమే కనిపించలేదు.. అందుకే అలా: అండర్సన్‌

3. Panjshir: పంజ్‌షేర్‌ కోటకు బీటలు!..తాలిబన్లకు లొంగిపోయే యోచనలో అహ్మద్‌ మసూద్‌? 

 ఇన్నాళ్లూ శత్రు దుర్భేద్యంగా ఉన్న పంజ్‌షేర్‌ కోటకు బీటలు వారుతున్నాయా? ఆ ప్రాంత అధినేత అహ్మద్‌ మసూద్‌ ముందు ప్రస్తుతం రాజీ తప్ప మరో మార్గం లేదా? అఫ్గానిస్థాన్‌ యావత్తూ తాలిబన్ల వశం కానుందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేక, అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం అందక.. తాలిబన్లకు లొంగిపోయే దిశగా మసూద్‌ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Narayan Rane: కేంద్రమంత్రి నారాయణ రాణే అరెస్టు సరైందే.. కానీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్‌ రాణె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ కేసులో పోలీసులు అయనను అరెస్టు చేయగా.. కొద్ది గంటల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనను అరెస్టు చేయడం సమర్థనీయమే అని బెయిల్‌ విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Insurance: ప్రతివారం ఇంటి ఖర్చులకు డబ్బు అందేలా బీమా పథకం!

అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు పాలసీదారులతో పాటు వారి కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేలా ‘నివ బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్’‌ (గతంలో మ్యాక్స్‌ బూపాగా పిలిచేవారు) ఓ సరికొత్త వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చింది. పాలసీదారులు మరణించినా, లేదా శాశ్వత లేక పాక్షిక అంగవైకల్యానికి గురైనా ఈ పాలసీ వర్తిస్తుంది. ఎలాంటి భయం లేకుండా పాలసీదారులు తమ జీవితాన్ని గడిపేందుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చినట్లు నివ బూపా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌ స‌మ‌యంలో స‌రైన ప్ర‌యాణ బీమాను ఎలా ఎంచుకోవాలి?

6. Afghanistan crisis: ఉగ్రవాదులకు అఫ్గాన్‌ ఆశ్రయం ఇవ్వకూడదు

అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులు పొరుగు దేశాలకు సవాలుగా మారకూడదని భారత్‌ పేర్కొంది. లష్కర్‌-ఎ-తొయిబా, జైష్‌-ఎ-మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు అఫ్గానిస్థాన్‌ తన భూభాగంలో ఆశ్రయం ఇవ్వకూడదని ఉద్ఘాటించింది. అన్ని జాతుల ప్రాతినిధ్యంతో కూడిన సమ్మిళిత, విస్తృత పరిపాలన అక్కడ అంకురించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. అఫ్గాన్‌ సంక్షోభం నేపథ్యంలో జెనీవాలోని ఐరాస మానవహక్కుల మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Love with chimpanzee: చింపాంజితో మహిళ ప్రేమాయణం..

కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది. నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియానికి చెందిన ఆది టిమ్మర్‌మన్స్‌ జంతు ప్రేమికురాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Petrol Prices: త్వరలో పెట్రో ధరల ఉపశమనం

పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందన్నారు.  అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయని మంగళవారం దిల్లీలో విలేకరుల సమావేశం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి తెలిపారు. పెట్రో ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైనదిగా భావిస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Road Accident: లారీని ఢీకొన్న కారు.. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి!

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Corona: కొత్త కేసులు 37వేలు.. ఒక్క కేరళలోనే 24 వేలకుపైగా..

కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. ఇటీవల అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే కన్పించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వెలుగుచూసిన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు 65శాతం ఒక్క ఆ రాష్ట్రంలోనే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Delta Variant: ‘డెల్టా’తో 300 రెట్లు వైరల్‌ లోడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని