Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Sep 2021 13:47 IST

1. Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద సందడి.. గవర్నర్లు తొలిపూజ

 తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి అక్కడ 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు. మహాగణపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తొలి పూజ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Jio Phone Next: చౌక స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్ నెక్ట్స్‌.. విడుదల ఇప్పుడే కాదు

వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జియో ఫోన్ నెక్ట్స్‌’ రాక మరింత ఆలస్యం కానుంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినాయక చవితిని పురస్కరించుకుని నేటి నుంచి మార్కెట్లోకి తీసుకొస్తామని గతంలో రిలయన్స్‌ జియో ప్రకటించింది. అయితే ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. దీపావళి పండగ సీజన్‌ నాటికి ఫోన్‌ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ శుక్రవారం రాత్రి వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. New CS For AP: ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సమీర్‌ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలంలో ఈనెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Taliban: తాలిబన్ల మారణహోమం మొదలు.. పంజ్‌షేర్‌లో ఇంటింటి తనిఖీలు

రెండు దశాబ్దాల క్రితం అఫ్గానిస్థాన్‌లో మజారే షెరీఫ్‌ ప్రాంతంలో తాలిబన్లు నరమేధం సృష్టించారు. 1998లో ఈ పట్టణంలోకి చొరబడ్డ తాలిబన్లు వీధులన్నీ కలియతిరిగి కన్పించినవారిని కాల్చి చంపేశారు. మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా కాల్పులు జరిపారు. ఆఖరికీ రోడ్డుపై తిరిగిన పశువులను కూడా వదల్లేదు. ఆ తర్వాత తమకు వ్యతిరేకంగా పనిచేసిన మైనార్టీలైన హజారాల ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యుల ముందే ఆ ఇంటిపెద్దల గొంతుకోసి చంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Afghanistan Cricket: ప్రపంచకప్‌ ముందు అఫ్గాన్‌కు గట్టి షాక్‌.. కెప్టెన్‌గా తప్పుకొన్న రషీద్‌ఖాన్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ముందు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న ప్రముఖ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. గతరాత్రి అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు తనని సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Dhoni: ధోనీని ఎంపిక చేయడం సరైందే కానీ.. సమస్యంతా అక్కడే: గావస్కర్‌

6. Srilanka Food Crisis: రావణా.. కాస్త అన్నం పెట్టవయ్యా..!

ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరి అవస్థలు పడుతున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల జాతీయ ఆహార అత్యయిక పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు శ్రీలంకకు ఏమైంది? ఈ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులపై ప్రత్యేక కథనం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona: కొత్త కేసులు 34వేలు.. రికవరీలు 37వేలు

కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. క్రితం రోజున 40వేలు దాటిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 17.87లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 34,973 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు(43,263)తో పోలిస్తే దాదాపు 8వేల కేసులు తక్కువ.  దీంతో దేశంలో మొత్తం కేసుల 3.31కోట్లు దాటింది. ఇక మరణాలు కూడా మరోసారి 300 దిగువన నమోదవడం కాస్త ఊరటనిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Annaatthe: సూపర్‌స్టార్‌ అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌..!

సూపర్‌స్టార్‌ అభిమానులకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం శుక్రవారం ఉదయం అభిమానులతో పంచుకుంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ పోస్టర్‌లో రజనీ సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు. దీపావళి కానుకగా నవంబర్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. West Bengal: భవానీపూర్‌ ఉపఎన్నిక.. దీదీ × ప్రియాంక

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్‌ నియోజకవర్గం కీలకంగా మారింది. ఇక్కడ దీదీని ఎదుర్కొనేందుకు భారీ వ్యూహరచన చేసిన భాజపా.. నేడు అభ్యర్థిని ఖరారు చేసింది. భవానీపూర్‌ నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IND Vs ENG: భారత్‌ x ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు రద్దు

భారత్‌ x ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయ్యింది. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత జట్టు శిక్షణ బృందంలోని సభ్యులకు కరోనా సోకడంతో ఐదో టెస్టు రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ తన తుదిజట్టుని దింపలేకపోయిందని ఈసీబీ పేర్కొంది. ఇప్పటి వరకు 2-1 తేడాతో  ఈసిరీస్‌లో కోహ్లీసేన ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని