Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 15 Nov 2021 13:06 IST

1.రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయినట్లు అనిపిస్తోంది : ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కక్షిదారులతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం తెలిపింది.

2.ఎన్నికలు వైకాపా నేతలు నిర్వహిస్తున్నారు: తెదేపా ఆరోపణ
రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. వైకాపా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ పేర్కొన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. అడ్డుకోవాలని తెదేపా నేతలు అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్‌ ఎస్‌ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు.

3.సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధం: దిల్లీ ప్రభుత్వం

దిల్లీలో అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమని అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. దిల్లీలో వాయు కాలుష్యంపై నేడు సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై. చంద్ర చూడ్‌, జస్టిస్‌ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. 

4.ట్రంప్‌కు నష్టం.. హోటళ్ల విక్రయం..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన భారీ హోటళ్లను విక్రయించేస్తున్నారు. తాజాగా వాషింగ్టన్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ను విక్రయించేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో ఈ హోటల్‌ పేరు వాలడ్రోఫ్‌ ఆస్టోరిగా మారనుంది. దీనిని హిల్టన్‌ గ్రూప్‌ నిర్వహించనుంది. 263 గదులున్న ఈ భవనాన్ని ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 60 ఏళ్ల లీజుకు తీసుకొంది.

5.ఓటమి తప్పదనే అడ్డదారులు తొక్కుతున్నారు: లోకేశ్‌

కుప్పంలో మున్సిపాలిటీ పోలింగ్‌ సందర్భంగా ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తూ అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. తెదేపా నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

6.అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. రూ.2కోట్ల గంజాయి సీజ్‌! 

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా నగరంలో పట్టుబడింది. ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో ముఠాలోని సభ్యులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. 1,240 కిలోల గంజాయిని విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
7.హోంలోన్‌ తీసుకోవడానికి 3/20/30/40 రూల్‌!

సామాన్యులు రుణం లేకుండా సొంత ఇల్లు కట్టుకోవడం అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే. ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక నిపుణులు సూచించిన 3/20/30/40 రూల్‌ని పాటిస్తే గృహరుణం తీసుకొనేటప్పుడు సహాయంగా ఉంటుంది. ఇంతకీ ఈ రూల్‌ ఏం చెబుతుందో చూద్దాం..!

8.గని టీజర్‌: ఆట గెలిస్తేనే చరిత్రలో ఉంటాం..!

‘‘ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం’’ అని అంటున్నారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఆయన వాయిస్‌ ఓవర్‌తో విడుదలైన టీజర్‌ ‘గని’. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గని’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

9.యాపిల్‌ తొలి కంప్యూటర్‌.. ఎంత ధర పలికిందంటే?
యాపిల్‌ (Apple) పేరు వింటే చాలు.. ఆ సంస్థ తయారు చేసిన ఐఫోన్లు, యాపిల్ టీవీలు, మ్యాక్‌ బుక్‌లు, ఐపాడ్‌లు, యాపిల్‌ వాచ్‌లు గుర్తొస్తుంటాయి. ధర ఎక్కువని ఆలోచిస్తారు కానీ.. ఆ సంస్థ నుంచి విడుదలయ్యే ఉత్పత్తుల్లో ఒక్కటైనా, ఒక్కసారైనా వాడాలనుకుంటారు. ఎందుకంటే యాపిల్‌కు ఉన్న క్రేజ్‌ అటువంటిది. అలాంటిది 1976లో సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌, సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ మొదట తయారు చేశారు.

10.ఆస్ట్రేలియా చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు: విలియమ్సన్‌

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఆదివారం రాత్రి జరిగిన తుదిపోరులో కంగారూలు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ‘మేం గెలవడానికి ప్రయత్నాలు చేసినా పిచ్‌ సహకరించలేదు. ఈ దుబాయ్‌ పిచ్‌ కాస్త కఠినంగా ఉంది’అని చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని