
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1.పీఆర్సీపై ఉద్యోగులకు సీఎం జగన్ క్లారిటీ..
రాష్ట్రంలో ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. రానున్న 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. తమ సమస్యలను వారు సీఎంకు వివరించారు.
2.పర్యాటకంపై ఒమిక్రాన్ ప్రభావం.. బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న సందర్శకులు
గతేడాదంతా కరోనా.. లాక్డౌన్తో పర్యాటక రంగం కుంటుపడింది. ప్రయాణాలపై ఆంక్షలు, సందర్శక ప్రాంతాలు, హోటల్స్ మూసివేతతో ఆర్థికంగా చితికిపోయింది. పరిస్థితులు మెరుగై ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి తేరుకుంటున్న పర్యాటక రంగంపై కరోనా కొత్త వేరియంట్ రూపంలో మరోసారి తీవ్ర ప్రభావం పడుతోంది.
3.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్తో మరికాసేపట్లో టీమ్ఇండియా రెండో టెస్టు ఆడనుంది. గతరెండు రోజులుగా ముంబయిలో వర్షం కురిసిన కారణంగా వాంఖడే మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దీంతో నేటి ఉదయం 9 గంటలకు వేయాల్సిన టాస్ను అంపైర్లు రెండున్నర గంటలు ఆలస్యం చేశారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి పరిస్థితులు అదుపులోకి రావడంతో టాస్ వేశారు.
లైవ్బ్లాగ్ కోసం క్లిక్ చేయండి
4.ఐఎంఎఫ్లో కీలక పదవికి గీతా గోపీనాథ్
అంతర్జాతీయంగా రోజురోజుకీ భారతీయుల ప్రతిభ ఇనుమడిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే పలు పెద్ద కంపెనీల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇండియన్స్ సత్తా చాటుతున్నారు. ఇటీవలే ఈ జాబితాలో ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ చేరి అందరినీ గర్వపడేలా చేశారు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లోనూ కీలక పదవిలో ఓ భారత సంతతి ఆడపడుచు ఆసీనురాలు కాబోతోంది.
5.ప్రమాదకర స్థాయికి ఒమిక్రాన్ ఆర్నాట్ విలువ..!
ఒమిక్రాన్ మెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది..! ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370కిపైగా కేసులు తేలాయి. ఇక తొలుత ఒమిక్రాన్ను కనుగొన్న దక్షిణాఫ్రికాలో కీలకమైన సార్స్కోవ్-2 ఆర్నాట్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. భారత్లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించారు. వీరిలో ఒకరు డాక్టర్ కాగా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఐదురుగు కూడా తాజాగా కొవిడ్ పాజిటివ్గా తేలారు.
6.కరోనా గణాంకాలు సానుకూలమే..ఒమిక్రాన్తోనే ఆందోళన..!
దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొంతకాలంగా పదివేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.29 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
7.సినీ పరిశ్రమను వేధించడం ఆపండి: సిద్ధార్థ్
సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంపై నటుడు సిద్ధార్థ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని.. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్మీడియా వేదికగా #SaveCinema అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.
8.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 650 కి.మీ.. ఒడిశాలోని గోపాల్పూర్కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపాను (జవాద్గా పిలుస్తున్నారు)గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది.
9.ఒమిక్రాన్నూ ఎదుర్కొనే కొత్త చికిత్స
కొవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్లోని వైద్య నియంత్రణ సంస్థ ‘ద మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’ (ఎంహెచ్ఆర్ఏ) ఆమోదించింది. ఇది ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తుండొచ్చని భావిస్తున్నారు. సోత్రోవిమాబ్ అనే ఈ ఔషధాన్ని సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీలతో తయారుచేశారు. కరోనా వైరస్పైన ఉండే కొమ్ము ప్రొటీన్కు అంటుకుంటుంది.
10.అమెరికాలో బూస్టర్ డోసులు.. బైడెన్ ప్రభుత్వ యోచన
అమెరికాలో కరోనా నివారణకు శీతాకాల ప్రణాళికలో భాగంగా టీకాల బూస్టర్ డోసులు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. దీనిపై అత్యవసరంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మాస్కులు ధరించడం తదితరాలు తప్ప కొత్త ఆంక్షలు ఏవీ లేకుండానే ఒమిక్రాన్ వంటి నూతన ఉత్పరివర్తనాలను ఎదుర్కోవాలని ప్రతిపాదించారు.