Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 May 2022 21:07 IST

1. నానక్‌రాంగూడలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

నానక్‌రాంగూడలోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి హోటల్‌లోని జనం, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో హోటల్‌ పరిసరాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని హోటల్‌ సిబ్బంది చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా : జూ.ఎన్టీఆర్‌

‘‘జీవితంలో ఒక్కసారైనా ఎన్టీఆర్‌తో సినిమా చేయగలనా..? అనుకున్నా. కానీ ఆయనతో గొప్ప సినిమాలు తెరకెక్కించే అదృష్టం నాకు దక్కింది’’ అంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం రాఘవేంద్రరావు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియోని షేర్‌ చేశారు. రాఘవేంద్రరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ ఆ విషయం తెలుసుకోవాలి: చంద్రబాబు

తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు నివాళులు అర్పించారు. ‘‘మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు అనుమతి ఇవ్వలేదు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్‌ తెలుసుకోవాలి. బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేవాళ్లకు ఒక్కటే చెబుతున్నా. సాయంత్రం బహిరంగ సభకు ఎంతమంది వస్తారో చూడండి’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Bangalore: కెప్టెన్‌ మారినా.. తలరాత మారలేదు

ఈసారి బెంగళూరు కెప్టెన్‌ మారినా.. తలరాత మారలేదు. 15వ సీజన్‌లోనూ ఆ జట్టు ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది. గత రెండేళ్ల మాదిరే ఈసారి కూడా ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌ చేరేలాగే కనిపించింది. దీంతో అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలై వారి ఆశలను ఆవిరిచేసింది. బెంగళూరు ఈసారి విఫలమవ్వడానికి పలు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో టెస్లా తయారీ.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..?

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడప్పుడే తొలగిపోయేలా కన్పించట్లేదు. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఈ కార్ల విక్రయాలపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించేందుకు అనుమతినిస్తేనే.. దేశంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ మరోసారి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. NBK 107: బాలయ్య 107.. వేట మొదలైంది..!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. మాస్‌ హంగులతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా పవర్‌ఫుల్‌ పోస్టర్‌ విడుదలైంది. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ శనివారం ఉదయం ‘వేట మొదలైంది’ అంటూ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. NTR Jayanthi: వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ: పురందేశ్వరి

రూ.వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు చేరుకున్నారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Yasin Malik: యాసిన్‌ మాలిక్‌ను శిక్షిస్తే.. భారత్‌పై విమర్శలా..?

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించడంపై కొన్ని దేశాలు భారత్‌పై నోరుపారేసుకున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్‌ దేశాలు కోర్టు తీర్పును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడంపై భారత్‌ దీటుగా స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం పోరాడుతోన్న వేళ.. దాన్ని సమర్థించడం సరికాదంటూ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ)కు హితవు పలికింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Investment Tips: ఆర్థిక నిర్ణయాల్లో తోడుగా ఆరు సూత్రాలు

ఒక ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన పని కాదు. అవి దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. పైగా కొన్ని నిర్ధిష్టమైన లక్ష్యాల కోసం భారీ ఎత్తున డబ్బు కేటాయించాల్సి ఉంటుంది. మరి అలాంటి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడే ఆరు సూత్రాలను పరిశీలిద్దాం.. ధనవంతుడిగా మారాలనుకుకోవడం ప్రతిఒక్కరి కల. కానీ, దాన్ని ఎలా సాధిస్తామనేదే అసలైన ప్రశ్న. ఇక్కడే ముక్కలు ముక్కలుగా చేయడం అనే వ్యూహం పనికొస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Balakrishna: ఈ ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగే రకం : బాలకృష్ణ

‘‘ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగేసే రకం’’ అని తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం తెనాలి పెమ్మసాని థియేటర్‌లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించారు. పెమ్మసాని థియేటర్‌లో 365 రోజులపాటు రోజుకొక ఎన్టీఆర్‌ చిత్రం ఉచిత షో ప్రదర్శన చేయనున్నారని, నెలకొకసారి సినీ కార్మికులకు అవార్డులు అందచేయనున్నట్లు బాలయ్య తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని