Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jun 2022 13:11 IST

1. Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గొప్పవాళ్లందరు చదువరులు కాదు..

2. రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్‌ రౌత్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కన్పించట్లేదు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో శిందే వర్గం మరికొద్ది రోజులు గువాహటి హోటల్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అసమ్మతి ఎమ్మెల్యేలపై ఇటీవల తీవ్రంగా విరుచుకుపడ్డ సంజయ్‌ రౌత్‌.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెబల్స్‌తో సగం మంది తమతో టచ్‌లోనే ఉన్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జూన్‌లో మిస్‌ అయిన స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే.. జులైలో పక్కా విడుదల!

గాడ్జెట్‌ ప్రియులకు జూన్‌ నెల కొంత నిరాశ కలిగించిందనే చెప్పుకోవాలి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ విడుదల వాయిదా పడటం ఇందుకు ప్రధాన కారణం. దీంతో జులైలో విడుదలయ్యే మోడల్స్‌ గురించి యూజర్లు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం..జులై నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ల జాబితాపై మీరు ఓ లుక్కేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ఛైర్మన్‌ పల్లోంజీ మిస్త్రీ (93) నిన్న అర్ధ రాత్రి ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు  కంపెనీ అధికారులు వెల్లడించారు. మిస్త్రీకి మొత్తం నలుగురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు షాపూర్జీ ప్రస్తుతం గ్రూపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు సైరస్‌ మిస్త్రీ గతంలో టాటాసన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక కుమార్తెలు లీలా, ఆలూ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!

అమెరికాలో వలసలు ప్రాణంతకంగా మారుతున్నాయి. తాజాగా టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోలో ఒక కంటైనర్‌ ట్రాలీలో ప్రయాణిస్తున్న 46 మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మంది ఆసుపత్రిపాలయ్యారు. వీరంతా వలసదారులని నగర కౌన్సిల్‌ వుమెన్‌ అడ్రియాన రోకా గార్సియా పేర్కొన్నారు. ఈ ఘటన నుంచి బయటపడిన వారి శరీర ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు

ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు(Mohan babu) నేడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం మోహన్‌ బాబు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌ కూడా కోర్టుకు వచ్చారు. 2019 మార్చి 22వ తేదీన అప్పటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించలేదని మోహన్‌ బాబు కుటుంబం తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. china: బీజింగ్‌, షాంఘైల్లో జీరో కోవిడ్‌ లక్ష్యం సాధించిన చైనా

చైనాలోని అతిపెద్ద నగరాలైన బీజింగ్‌, షాంఘైల్లో ఎట్టకేలకు సోమవారం ఎలాంటి కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. జీరో కోవిడ్‌ లక్ష్యంగా అక్కడి అధికారులు.. ఫిబ్రవరి 19 నుంచి నాలుగు నెలల పాటు కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలు చేశారు. ఇక చైనాలో దేశ వ్యాప్తంగా కూడా కొవిడ్‌ కేసులు తగ్గి కేవలం 22 మాత్రమే నమోదైనట్లు అక్కడి జాతీయ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. చైనా ఈ ఘనత సాధించేందుకు భారీ మూల్యమే చెల్లించింది. చివరిసారిగా షాంఘైలో ఫిబ్రవరి 23న ఎలాంటి సామాజిక వ్యాప్తి కనిపించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధర్మవరంలో ఉద్రిక్తత.. భాజపా నేతలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భాజపా నేతలపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భాజపా నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తం కళ్లజూశారు. మూడు వాహనాల్లో వచ్చిన వైకాపా శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ధర్మవరం పట్టణ భాజపా అధ్యక్షుడు రాజు, ఆ పార్టీ కార్యదర్శి రాము సహా మరికొందరికి గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా మార్చారు.. నంబి నారాయణన్‌ కథ ఇదీ!

ఆయన జీవనం అతి సామాన్యం.. ఆయన ప్రతిభ అసామాన్యం.. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం.. గూఢచర్యం ఆరోపణలతో ఆ ఆదర్శ శిఖరం ఒక్కసారిగా నేలకొరిగింది. ఆయన్ను కీర్తించిన నోళ్లే దూషించాయి. చప్పట్లు కొట్టిన చేతులే రాళ్లు రువ్వేందుకు సిద్ధమయ్యాయి. దేశం గర్వించదగ్గ ఇస్రో శాస్త్రవేత్త అని అ‌భివర్ణించిన మీడియానే ఆయన్ను దేశ ద్రోహిగా చూపించింది. చివరకు న్యాయమే గెలిచింది. ఆ పడిలేచిన కెరటమే నంబి నారాయణన్. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కెప్టెన్సీకి పంత్‌ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్‌ మాజీ క్రికెటర్‌

ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తిగా మారింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవల కరోనాబారిన పడటంతో మ్యాచ్‌ సమయానికల్లా కోలుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించడానికి పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో రిషభ్‌ పంత్‌, జస్ప్రిత్‌ బుమ్రా పేర్లు ముందున్నాయి. అయితే, ఇదే విషయంపై స్పందించిన పాక్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రోహిత్‌ ఆరోగ్యంపై సమైరా‌ అప్‌డేట్‌.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని