Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Oct 2022 13:07 IST

1. చివరకు తోటలో శవాలై తేలారు.. భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌ విషాదాంతం

అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నాప్‌నకు గురైన భారత సంతతి కుటుంబం ఘటన చివరకు విషాదాంతమైంది. అపహరణకు గురైన ఎనిమిది నెలల పాప, ఆమె తల్లిదండ్రులు, సమీప బంధువు.. విగతజీవులై కనిపించినట్లు అక్కడి పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని మెర్సిడెస్‌ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్దీప్‌ సింగ్‌ కుటుంబం ట్రక్కుల రవాణ వ్యాపారం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ ఇద్దరు మంత్రులకు మూడేసి ఆఫీసులు.. ప్రజాధనం దుబారా..

ప్రజాధనాన్ని వృథా చేయటంలో కొందరు ఏపీ మంత్రులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో కార్యాలయాలు ఉన్నా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇద్దరు మంత్రులకు మాత్రం ఏకంగా మూడేసి కార్యాలయాలు ఉన్నాయి.  మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్‌కు సచివాలయంలోనే కాకుండా క్యాంపు ఆఫీసులో ఒకటి, ఏపీఐఐసీ భవనంలో ఇంకోటి.. ఇలా మొత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సిరప్‌ల వాడకంతో 66 మంది చిన్నారుల మృతి.. 

ఆఫ్రికా దేశమైన గాంబియాలో విషాదం చోటు చేసుకొంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పలువురిలో కిడ్నీలు దెబ్బతినడానికి ఈ సిరప్‌లు కారణమయ్యాయని పేర్కొంది. ఈ మందులపై ఇతర దేశాలకూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4కవ్వింపులు ఆపని కిమ్‌.. రెండు వారాల్లో ఆరు క్షిపణి పరీక్షలు

ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఏమాత్రం ఆపడంలేదు. గురువారం ఉదయం మరో రెండు స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించింది. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు విషయం వెలుగులోకి రాగానే దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. కవ్వింపు చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని ప్యాంగ్యాంగ్‌ను హెచ్చరించింది. ఇప్పటికే మంగళవారం నాడు జపాన్‌ నగరంపై నుంచి క్షిపణిని ప్రయోగించిన విషయం విదితమే. దీంతో ఐరాస భద్రతా మండలిలో అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘గాడ్‌ఫాదర్‌’.. అందుకే దూరంగా ఉన్నా: అనసూయ

అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యాంకర్‌ అనసూయ ఓ కీలక పాత్ర పోషించారు. న్యూస్‌ ఛానెల్‌ రిపోర్టర్‌గా ఆమె స్క్రీన్‌పై కనిపించిన కొన్ని క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో అనసూయ యాక్టింగ్‌ని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌ జోడో యాత్రలో కదం కలిపిన సోనియా.. రాహుల్‌తో కలిసి నడక..!

 కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని జకన్నహళ్లికి చేరుకొన్నారు. పాండవపుర తాలుకాలో ఉదయం 6.30కు మొదలైన యాత్ర అక్కడకు చేరుకోగానే.. ఆమె కూడా వారితో కలిసి నడిచారు. ఈ యాత్ర సాయంత్రం 7 గంటలకు నాగమంగళ తాలుకాలో నేడు విరామం తీసుకోనుంది. సోనియాతోపాటు ఈ యాత్రలో స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలీ నంబాల్కర్‌, రూపకళా, లక్ష్మీ హెబ్బాల్కర్‌లు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈపీఎఫ్‌ ఖాతాలో వడ్డీ సొమ్ము కనిపించడం లేదా? కారణమిదే..

పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీ ఎప్పుడూ సమస్యగానే ఉంటోంది. ఫలానా ఆర్థిక సంవత్సరానికి ఇంత వడ్డీ అని నిర్ణయించాక కూడా కొన్ని నెలలకు గానీ ఆ మొత్తం జమ కాని పరిస్థితి. తాజాగా చాలా మంది తమ ఈపీఎఫ్‌ స్టేట్‌మెంట్‌లో వడ్డీ మొత్తం కనిపించడం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాత వస్తువులను పడేస్తున్నారా? ఇలా ఉపయోగించండి!

పండగల వేళ ఇంటిని శుభ్రం చేయడం, రంగులు వేయడం, ఆకర్షణీయంగా అలంకరించడం ఒక కళ. ఈ క్రమంలో పాత వస్తువులను ఏం చేయాలి?  అనే ఆలోచన వస్తుంది. అయితే కొత్తగా ఆలోచిస్తే ప్రతి వస్తువును ఆకర్షణీయంగా మార్చవచ్చు. విభిన్న ఆలోచనలతో పాత వాటిని పడేయకుండా ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకోండి. ఇంట్లో మిగిలిన పాత గాజు సీసాలను పూల కుండీలుగా మార్చేయడం చాలా సులువు. మీ అభిరుచిని బట్టి వాటికి రంగులేసి, మరింత సమర్థంగా ఉపయోగించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీనియర్‌ సిటిజన్ల స్పెషల్‌ ఎఫ్‌డీ గడువు పొడిగించిన HDFC బ్యాంక్‌

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) సీనియర్‌ సిటిజన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ గడువు పొడిగించింది. కొవిడ్‌ -19 కారణంగా వడ్డీ రేట్లు తగ్గినందున.. వాటి ప్రభావం సీనియర్‌ సిటిజన్లపై పడకూడదనే ఉద్దేశంతో పలు బ్యాంకులు సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీని 2020లో ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ కూడా 2020 మే 15న ‘సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ పేరుతో ప్రత్యేక ఎఫ్‌డీని తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
10. బరువు తగ్గాలంటే కంటి నిండా నిద్ర ఉండాల్సిందేనా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదు. దీంతో రకరకాల ఆనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వాటిలో ‘అధిక బరువు’ ప్రధానమైనది. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే, కంటి నిండా నిద్రపోయినప్పుడే బరువు తగ్గేందుకు అవకాశముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే, రాత్రిపూట కచ్చితంగా పడుకోవాల్సిందే. ఉద్యోగ రీత్యా కొందరు రాత్రిపూట పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని