Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. AP High Court: నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె.మిశ్రా ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి విచారణ చేపట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. Malla Reddy: మంత్రిపై ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదు: మల్లారెడ్డి
హైదరాబాద్: ఐటీ, ఈడీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇంజినీరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే అని గర్వంగా చెబుతా. ఇంజినీరింగ్ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గుర్తొచ్చేలా తీర్చిదిద్దాం. అక్రమాలు.. దౌర్జన్యం మాకు అలవాటు లేదు. ఇలాంటి దౌర్జన్యాలు నేనెప్పుడూ చూడలేదు’’ అని మంత్రి తేల్చి చెప్పారు. వీడియో కోసం క్లిక్ చేయండి
3. Supreme Court: అంత సూపర్ ఫాస్ట్ నియామకం దేనికీ..? ఈసీగా గోయల్ ఎంపికపై సుప్రీం వ్యాఖ్య
కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ‘మెరుపువేగం’తో ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. China: ఐఫోన్ తయారీ ప్లాంట్లో తీవ్ర ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పిన ఫాక్స్కాన్
యాపిల్ ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్కాన్కు చెందిన ప్లాంట్లలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పలు వీడియోలు వెలుగులో వచ్చాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తమ వసతిగృహాల నుంచి బుధవారం వేకువజామున కార్మికుల ఒక్కసారిగా బయటకు వచ్చి నిరసనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. దీనిపై ఫాక్స్కాన్ క్షమాపణలు తెలియజేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. Shikhar dhawan: ఆ రోజు రాహుల్కి కెప్టెన్సీ ఇవ్వడం నన్ను బాధించలేదు: శిఖర్ ధావన్
జింబాబ్వేతో వన్డే సిరీస్కి కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో బ్యాటర్ శిఖర్ ధావన్ను కెప్టెన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాహుల్ కరోనా నుంచి కోలుకొని తిరిగి రావడంతో ధావన్ను తొలగించి అతడిని తీసుకున్నారు. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని సీనియర్లు, అభిమానులు తప్పుపట్టారు. ఈ బ్యాటర్తోనే సిరీస్ ఆడిస్తే బాగుండేదన్నారు. అయితే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. Akasa Air: విశాఖపట్నం- బెంగళూరు మధ్య 10 నుంచి ఆకాశ ఎయిర్ విమానం
బెంగళూరు- విశాఖపట్నం మధ్య డిసెంబరు 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఈ మార్గంలో రోజూ రెండు విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మొదటి సర్వీసు డిసెంబరు 10న, రెండో సర్వీసు 12 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. Passport: పాస్పోర్టులో పూర్తి పేరు లేకపోతే.. ఆ దేశంలోకి నో ఎంట్రీ..!
అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పాస్పోర్టుపై పూర్తి పేరు లేకుండా కేవలం ఒక పదంతో మాత్రమే పేరు ఉండేవారిని తమ దేశంలోకి అనుమతించబోమని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కొత్త నిబంధన నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చిందట. దీనిపై తాజాగా ఎయిరిండియా, ఇండిగో వంటి భారత ఎయిర్లైన్లు ప్రయాణికులకు సమాచారమిచ్చాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. FIFA: ప్రపంచ పెద్దన్న గుండె బద్దలు కొట్టిన లాస్ట్మినిట్ గోల్..!
1982 నాటికి ప్రపంచంలో ఇద్దరు పెద్దన్నలు మిగిలారు. అమెరికా, సోవియట్ యూనియన్. ఆయుధాల్లోనే కాదు.. ఆటల్లోనూ రారాజులుగా నిలుస్తూ వచ్చారు. క్రీడల్లో సోవియట్ కూడా తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి రుచిచూపిస్తున్న రోజులవి. కానీ, ఆ ఏడాది జరిగిన ఫిఫా ప్రపంచకప్లో మొదట్లోనే సోవియట్కు గర్వభంగం జరిగింది. ప్రపంచకప్లో తలపడిన తొలి మ్యాచ్ కనీసం డ్రా అయినా చేసుకుని పరువు దక్కించుకోవాలని వెంపర్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఓటమి చవిచూసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. Samantha: సమంత ఆరోగ్యంపై కథనాలు.. ఆమె మేనేజర్ ఏమన్నారంటే
అగ్ర కథానాయిక సమంత ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. సామ్ ఆరోగ్యంగానే ఉందని, ఆమె వైద్యశాలలో చేరినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నారు. గత కొన్నిరోజుల నుంచి మయోసైటిస్ అనే అరుదైన రుగ్మతతో ఇబ్బందిపడుతోన్న సామ్.. ఉన్నట్టుండి గురువారం అనారోగ్యానికి గురయ్యారని, దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారని నెట్టింట పలు పోస్టులు దర్శనమిచ్చాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. Railways: రైల్వేలో.. ప్రతి 3 రోజులకో ఉద్యోగిపై వేటు..!
పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై రైల్వే శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021 జులై నుంచి ఇప్పటివరకు 139 మంది ఉద్యోగులకు బలవంతంగా వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు రైల్వే అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.