Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Nov 2022 13:12 IST

1. ‘అన్‌లాక్‌ చైనా’.. చైనాలో ఆందోళనలు ఉద్ధృతం

 కొవిడ్‌-19 కట్టడి నిమిత్తం చైనా విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు ఆ దేశంలో తీవ్రస్థాయి ఆందోళనలకు దారితీస్తున్నాయి. షింజియాంగ్‌ రాష్ట్ర రాజధాని ఉరుమ్‌కీలోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించడంతో నిరసనలు మరింత ఉద్ధృతరూపం దాల్చాయి. వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాల్ని మోహరిస్తోంది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడం, పెప్పర్‌ స్ప్రేను చల్లడం వంటి చర్యలు చేపడుతుండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోక్షజ్ఞ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

తన తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతా దైవేచ్ఛ’’ అని నవ్వి ఊరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మానసిక క్షోభను జయించి.. ప్రపంచకప్‌ విన్నింగ్‌ గోల్‌ కొట్టి..!

 2010 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో స్పెయిన్‌ ఆటగాడు ఆండ్రెస్‌ ఇనెయెస్టా ఓ పెను సంచలనం. ఈ టోర్నీకి దాదాపు ఏడాది ముందు తన సన్నిహిత మిత్రుడు, జట్టులో సెంట్రల్‌ డిఫెండర్‌ డేనియల్‌ జార్క్‌ గుండెపోటుతో మరణించాడు. నాటి నుంచి ఇనెయెస్టా మానసికంగా కుంగిపోయాడు. టోర్నీకి ముందు చాలా సార్లు మానసిక చికిత్స పొందాడు. ట్రైనింగ్‌ సెషన్లను అర్ధాంతరంగా ముగించేవాడు. ఆ పరిస్థితుల్లోనే స్పెయిన్‌ తరఫున  బరిలోకి దిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహేశ్‌ మాట నన్నెంతో బాధ పెట్టింది: సూర్య

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (MaheshBabu) హీరోగా తాను దర్శకత్వం వహించిన ‘నాని’ సినిమా వైఫల్యంపై దర్శకుడు, నటుడు ఎస్‌.జె.సూర్య (Surya) తాజాగా స్పందించాడు. సినిమా పరాజయం తర్వాత మహేశ్‌ అన్న ఓ మాట తననెంతో బాధపెట్టిందని చెప్పాడు. ‘‘నాని’ సినిమా విషయంలో నాకింకా బాధగానే ఉంది. హీరో కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చా. నటుడిగా ఎదగడం కోసం మొదట దర్శకుడిని అయ్యాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండో వన్డే వరుణుడిదే.. 1-0 ఆధిక్యంలో కివీస్

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య హామిల్టన్‌ వేదికగా రెండో వన్డే మ్యాచ్‌లో వరుణుడు విజయం సాధించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే అప్పుడప్పుడు పలకరిస్తూ వచ్చిన వర్షం.. భారత ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్ల వద్ద భారీగా కురవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చేశారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బాలుడి ప్రాణం తీసిన విదేశీ చాక్లెట్‌

ఆ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుతెరువు కోసం వరంగల్‌ వచ్చి డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సత్యేంద్ర జైన్‌కు 10 మందితో సపర్యలు.. అసలు ఏం జరుగుతోంది?’

తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ నేత, దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సేవలు అందించేందుకు దాదాపు 8-10 మందిని కేటాయించినట్లు భాజపా అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఆరోపించారు. ఎనిమిది మంది ఆయన ఉన్న గదిని శుభ్రపరచడం సహా ఇతర అవసరాలు చూసుకుంటున్నారని జైలు వర్గాలను ఉటంకిస్తూ ఓ ప్రముఖ జాతీయ మీడియా సైతం పేర్కొంది. మరో ఇద్దరు ఈ ఎనిమిది మంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు రాసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కిడ్నీ మార్పిడికి సింగపూర్‌ చేరుకొన్న లాలూ..!

కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొనేందుకు బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సింగపూర్‌ చేరుకొన్నారు. డిసెంబర్‌ 5వ తేదీన ఆయనకు అక్కడ కిడ్నీ మార్పిడి చేయనున్నట్లు సమాచారం. కుమార్తె రోహిణీ ఆచార్య ఆయనకు కిడ్నీ దానం చేయనున్నారు. ఆయన సింగపూర్‌ చేరుకోగానే భావోద్వేగంతో రోహిణీ ఓ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘మేం ఆడేది లేదు’ రమీజ్‌ రజా హెచ్చరికలు.. స్పందించిన అనురాగ్ ఠాకూర్‌

వచ్చే ఏడాది పాక్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రజా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ కార్యదర్శి జైషా.. పాక్‌తో తటస్థ వేదికలపైనే ఆడతామని, ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని చెప్పాడు. జైషా వ్యాఖ్యలకు పీసీబీ ఛైర్మన్‌ హోదాలో రమీజ్‌ రజా అధికారికంగా స్పందించాడు.. గతంలోనే ఇదే విషయంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ స్పందించినా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిషేధిత సంస్థ ‘జమాతే’కు చెందిన రూ.90 కోట్ల ఆస్తులు స్వాధీనం

నిషేధిత సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఆస్తులపై స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎస్‌ఐఏ) దృష్టిపెట్టింది. ఆ సంస్థకు జమ్ము-కశ్మీర్‌లో ఉన్న దాదాపు 200 ఆస్తులను ఇప్పటికే గుర్తించింది. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆ సంస్థకు సంబంధించిన 11 ప్రధాన ఆస్తులను సీజ్‌ చేసింది. వీటి విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదాలను జమాతే ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని