Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Dec 2022 13:12 IST

1. ప్రగతిభవన్‌కు ఎమ్మెల్సీ కవిత..

తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దిల్లీలో నమోదుచేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్‌ కుమార్‌ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోకానీ, దిల్లీలో కానీ కవిత నివాసంలో విచారించాలని అనుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వన్డే సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు షాక్‌.. 

బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ షమీ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు జట్టులో చోటు కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎక్కడికెళ్లినా.. భారత్‌ నాలో భాగమే: సుందర్‌ పిచాయ్‌

‘‘భారత్ నాలో భాగం. నేను ఎక్కడికెళ్లినా ఆ వారసత్వాన్ని తీసుకెళ్తాను’’ అంటున్నారు గూగుల్‌, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌. భారత ప్రభుత్వం అందించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మభూషణ్‌ అవార్డును పిచాయ్ తాజాగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ అపారమైన గౌరవం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత్‌ నాలో భాగమే. నేను ఎక్కడికివెళ్లినా ఆ వారసత్వాన్ని నా వెంట తీసుకెళ్తా’’ అని పిచాయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దేశాధ్యక్షుడి అక్రమాలనే పట్టించిన దొంగతనం..!

‘డబ్బుపోయే శనిపట్టే’ అన్నట్లుంది దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా పరిస్థితి. అక్రమంగా ఫామ్‌హౌస్‌లో దాచుకొన్న డబ్బు పోయింది.. ‘తేలుకుట్టిన దొంగలా’ ఉందామని ఆయన యత్నించినా.. ఆ విషయం బయటకు వచ్చి పదవి కూడా ఊడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రాజకీయాలను ఫలాఫలా ‘ఫామ్‌గేట్’ కుంభకోణం కుదిపేస్తోంది. అవినీతిని నిర్మూలిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రామ ఫోసా అక్రమ సొమ్ము కూడబెట్టారనే అపవాదును మోస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఓరి దేవుడా..!’లో వెంకటేష్‌ కాకుండా మరొకరైతే బాగుండేది..!

విశ్వక్‌సేన్‌ హీరోగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఓరి దేవుడా..!’. వెంకటేష్‌ అతిథి పాత్రలో అలరించిన ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘ఓ మై క‌డ‌వులే’కి తెలుగు రీమేక్‌గా ‘ఓరి దేవుడా’ తెర‌కెక్కిన విషయం తెలిసిందే. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ చేశారు. సినిమాలకు ఇలాంటి టైటిల్‌ పెట్టడం సాహసమని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నన్ను అక్రమంగా ఇరికించారు.. హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి కేరళకు చెందిన జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన 41-ఎ సీఆర్‌పీసీ నోటీసులు, లుకౌట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా ఈ కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తృణమూల్‌ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి

పశ్చిమ బెంగాల్‌లో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేపట్టనున్న ర్యాలీ వేదికకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తూర్పు మేదినీపూర్‌ జిల్లాలోని భూపతినగర్‌ ప్రాంతంలో టీఎంసీ నేత ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ పేలుడు సంభవించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. HCUలో థాయ్‌లాండ్‌ విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారయత్నం.. 

నగరంలోని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకొని పారిపోయింది. ఈ మేరకు బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌పై పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశాక మరిన్ని సెక్షన్లు నమోదు చేయనున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రొఫెసర్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు (RRR) మరో ఘనత దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సామాన్య ప్రజలకు ఆంక్షలు.. జూదం ఆడేవాళ్లకు ప్రత్యేక పడవలా?: జగన్‌కు అనగాని లేఖ

 వైకాపా నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యథేచ్చగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. ఈ మేరకు అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని