Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News At 1 PM: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Dec 2022 13:08 IST

1. నా కుమార్తె విషయంలో నవీన్ రెడ్డి సైకోలా వ్యవహరించాడు..: యువతి తండ్రి ఫిర్యాదు

ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో శుక్రవారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్‌రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్‌ రెడ్డి, అతని అనుచరులపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, అపహరణ, దాడితో పాటు పలు కేసులు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హిమాచల్ సీఎం ఎంపిక.. ప్రియాంక గాంధీ చేతికి బాధ్యతలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఎంపిక విషయం ఎటూ తేలట్లేదు. ఈ పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో కాంగ్రెస్‌ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎంను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ప్రియాంక నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ తల్లి రోదనకు కరుణించని విధి.. 70 గంటలు శ్రమించినా దక్కని చిన్నారి ప్రాణం..!

మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన ఎనిమిదేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. బాలుడిని రక్షించేందుకు 70 గంటలకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం తెల్లవారుజామున చిన్నారి మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. బెతుల్‌ జిల్లాలోని మాండవి గ్రామానికి చెందిన 8 ఏళ్ల తన్మయ్ మూడో తరగతి చదువుతున్నాడు. గత మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తీవ్ర వాయుగుండంగా మారిన ‘మాండౌస్‌’.. చెన్నై అల్లకల్లోలం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండౌస్‌ (Cyclone Mandous) మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశలో పయనిస్తున్న మాండౌస్‌.. శనివారం మధ్యాహ్నానికి మరింతగా బలహీనపడి వాయుగుండగా మారనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇషాన్‌ కిషన్ హాఫ్ సెంచరీ.. భారత్‌ స్కోరు 85/1 (15)

టీమ్‌ఇండియా ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (60*) దూకుడు కొనసాగుతోంది. ఈ  క్రమంలో వన్డే కెరీర్‌లో నాలుగో అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు సీనియర్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (16*) నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అర్ధశతక (70) భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్‌ నష్టానికి 85 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నెలకు ₹12 వేలతో ₹2లక్షల వరకు పెన్షన్‌..!

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) ప్రభుత్వ మద్దతు గల సామాజిక భద్రతా పథకం. మదుపర్లు ఈ పథకం ద్వారా ఒకేసారి ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాదారుడు 75% వరకు పెట్టుబడులను ఈక్విటీల్లో పెట్టబడి పెట్టే వీలుంది. మిగిలిన 25% శాతం మాత్రం డెట్‌లో ఉంచాలి. అయితే ఈక్విటీ, డెట్‌ పెట్టుబడులను 60:40 నిష్పత్తిలో, 50:50 నిష్పత్తిలో గానీ దీర్ఘకాలంలో ఉంచడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందొచ్చనేది నిపుణుల అభిప్రాయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మాండౌస్‌ ప్రభావం : ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది తీవ్ర వాయుగుండంగా బలహీన పడినట్టు ఐఎండీ తెలిపింది. క్రమంగా ఇది మరింతగా బలహీన పడి సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్రోమ్‌ కొత్త మోడ్స్‌.. ఇకపై పవర్‌, మెమొరీ రెండు ఆదా!

వెబ్‌ విహారానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది గూగుల్ క్రోమ్‌ (Google Chrome) బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం, బగ్‌ఫిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ వంటివి బ్రౌజర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. కానీ, సిస్టమ్‌ ర్యామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుందనేది చాలా మంది యూజర్ల అభిప్రాయం. అంటే, పీసీ లేదా కంప్యూటర్‌లో 8 జీబీ నుంచి 64 జీబీ ఎంతటి సామర్థ్యం ర్యామ్‌ ఉన్నా.. అందులో అధిక మొత్తాన్ని క్రోమ్‌ వాడేస్తుందని యూజర్లు అసహనం వ్యక్తం చేస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బాసర ఆర్జీయూకేటీలో టీ-హబ్‌ ఏర్పాటు.. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

ఉన్నత విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవానికి హాజరైన కేటీఆర్.. విద్యార్థులనుద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు. సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదవలేదని.. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడే సత్తా సంతరించుకోగలిగితే అపగలిగేవారు ఎవరూ ఉండరన్నారు. పుస్తకాల్లో చదివిన చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేజీయఫ్‌ నటుడితో హీరోయిన్‌ నిశ్చితార్థం

‘పిల్ల జమీందార్‌’తో (Pilla Zamindar) హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి హరిప్రియ (Haripriya) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియుడు, ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ వశిష్ఠ సింహాతో (Vasishta N.Simha) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.  ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో నివాసంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వశిష్ఠ ఇన్‌స్టా వేదికగా తాజాగా షేర్‌ చేశారు. ‘‘మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు