Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Feb 2023 13:22 IST

1. ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గత తీర్పులపై రెండు వారాలు సస్పెన్షన్‌ ఇవ్వాలని సింగిల్‌ జడ్జిని అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని.. దీనిపై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌ను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌.. ఎలా పనిచేస్తుంది?

ఆన్‌లైన్‌ సమాచార శోధనలో ఏళ్లుగా గూగుల్‌ (Google) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా దీనికి చాట్‌జీపీటీ (ChatGPT) రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్‌ పిచాయ్‌ నేతృత్వంలోని గూగుల్‌ సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీ (ChatGPT)తో కృత్రిమ మేధ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్‌ తెరతీసిన యుద్ధానికి గూగుల్‌ (Google) సైతం తన అస్త్రశస్త్రాలతో సన్నాహాలు చేసుకుంటోంది. ‘బార్డ్‌ (Bard)’ పేరిట ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ను సిద్ధం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!

ఆఫ్‌స్పిన్నర్‌ బౌలింగ్‌కి వస్తే లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లకు చిన్న వణుకు వస్తుంది. ఆ కంగారు పీక్స్‌లోకి వెళ్లాలంటే ఆ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అయి ఉండాలి. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్లను అలా కంగారు పెడతాడు మరి. ఇప్పుడు ఆస్ట్రేలియా భయం కూడా అదే. అసలే స్పిన్‌ పిచ్‌ల పై కంగారూలు తడబడతారనే అపవాదు ఉంది. అందులోనూ ఆ జట్టులో కీలకమైన లెఫ్టీలు ముగ్గురు ఉన్నారు. వీటికితోడు గతంలో ఆసీస్‌ మీద అశ్విన్‌ వికెట్ల వేట మామూలుగా సాగలేదు.  ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో అశ్విన్‌ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడి  89 వికెట్లు పడగొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బొమ్మ మీది.. స్ట్రీమింగ్‌ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్‌!

OTT Movies: పెళ్లి చూపుల్లో రెండు కుటుంబాలూ ఓకే అనుకుంటే, అప్పటికప్పుడే అబ్బాయి కుటుంబం అమ్మాయికి చీర పెట్టి ‘పిల్ల మాది’ అనిపించుకుంటారు. ఇప్పుడు ఓటీటీ వేదికలు ఇదే పంథాను అవలంబిస్తున్నాయి. నిర్మాణ దశలో ఉండగానే అందుకు సంబంధించిన డీల్స్‌ పూర్తి చేసి ‘సినిమా మాది’ అనిపించుకోవడమే కాదు, అధికారికంగా ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారతీయులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎందుకింత మక్కువ?

భారత్‌లో అనేక మదుపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్లు, బీమా పథకాలు, బాండ్లు, పోస్టాఫీస్‌ పొదుపు పథకాలు ఇలా చాలా మార్గాల్లో డబ్బును మదుపు చేయొచ్చు. కానీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit- FD)కు ఉన్న ఆదరణ మాత్రం అంతాఇంతా కాదు. ఇప్పటికీ అత్యధిక మంది భారతీయులు దీన్నే తమ మదుపు మార్గంగా ఎంచుకుంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ సర్వే బయటపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తి (Judge)గా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా వేసిన ఈ పిటిషన్‌ను తాము అంగీకరించబోమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఈ ఉదయం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా గౌరీ ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్‌ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్‌ ఘాటు స్పందన!

ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా ఆసియా కప్‌ ఆడకపోతే.. భారత్‌ వేదికగా జరిగే  వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ ఆడేదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ నజామ్ సేథీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఆసియా కప్‌ కౌన్సిల్ సమావేశంలో  జై షాతో నజామ్ సేథీ చెప్పినట్లు కూడా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా పాక్‌ క్రికెట్ బోర్డు తీరుపై టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!

తుర్కియే(Turkey)లో నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం(EarthQuake) సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడంలేదు. రిక్టర్‌ స్కేల్‌పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్‌ సర్వే విభాగం ప్రకటించింది. తొలుత భారీ భూకంపం(EarthQuake) వచ్చిన తర్వాత చిన్నచిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా 5.0-6.0 తీవ్రతతో మరికొంతకాలం పాటు ఈ ప్రకంపనలు రావొచ్చని వారు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బోరుగడ్డ అనిల్‌ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు

రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్‌ (Borugadda Anil) కార్యాలయాన్ని దుండగులు తగులబెట్టారు. సోమవారం అర్ధరాత్రి దాటాక గుంటూరులోని డొంకరోడ్డులో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. మంటల్లో అక్కడి ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయింది. ఇటీవల నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఫోన్‌లో అనిల్‌ బెదిరించిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తానని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ గుడ్‌బై!

ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (Aaron Finch) కీలక నిర్ణయం తీసుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే వన్డే కెరీర్‌కు ముగింపు  పలికిన ఫించ్‌.. ఇప్పుడు కేవలం టీ20లకే  ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను (T20 World Cup 2022) గెలుచుకోవడంలో విఫలం కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని