Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Feb 2023 13:04 IST

1. మా జోలికొస్తే ఏం చేస్తామో చూపించాం.. చైనాకు బైడెన్‌ గట్టి వార్నింగ్‌

నిఘా బెలూన్‌ ఘటనతో అమెరికా (US), చైనా (China) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden).. డ్రాగన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘స్టేట్‌ ఆఫ్ ది యూనియన్‌’ ప్రసంగంలో బైడెన్‌ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy) తెలిపారు. అపాయింట్‌మెంట్‌ దొరకగానే నేరుగా వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నెల్లూరు(Nellore)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తే మంత్రులు, వైకాపా (YSRCP) నేతలు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు

పదుల అంతస్తుల భవనాలు శవాల దిబ్బలుగా మారిపోయాయి.. ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహాలే కన్పిస్తున్నాయి.. ప్రకృతి సృష్టించిన భూప్రళయం అనంతరం తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ఇప్పుడు కన్పిస్తున్న హృదయవిదారక దృశ్యాలివే. సోమవారం చోటుచేసుకున్న భూకంపం (Earthquake) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్తు జరిగి రెండు రోజులు దాటడంతో శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మళ్లీ వడ్డీరేట్లు పెరిగాయ్‌.. రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ..!

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అంచనాలకు తగినట్లే మరోసారి వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.  దీంతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకొన్నాయి. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను నేడు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు సమర్థించినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 6వ తేదీన ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షా సమావేశం మొదలైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ హీరోలు వీరే!

భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఎన్ని సిరీస్‌లు జరిగినా బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ  (Border-Gavaskar Trophy) ప్రత్యేకతే వేరు. మిగతా సిరీస్‌ల్లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్‌లో గెలవడాన్ని మాత్రం ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. స్పిన్నర్లు తమ మాయాజాలంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తే.. పేసర్లు బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఇక, కవ్వింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరో అరగంటలో మీ ఇన్‌బాక్స్‌లోకి మెయిల్ వస్తుంది.. 1,300 ఉద్యోగాలకు కోతవేసిన జూమ్

కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ (Zoom) భారీగా ఉద్యోగాల(lay-offs) కోతను ప్రకటించింది. మొత్తం 1,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది  ఆ సంస్థలోని ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం. అమెరికాలో లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులకు మరో అర గంటలో ఈమెయిల్‌ వస్తుందని జూమ్‌ సంస్థ సీఈవో ఎరిక్‌ యువాన్‌ కంపెనీ అధికారిక బ్లాగ్‌లో ప్రకటించారు. లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులు ప్రతిభావంతులు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులుగా ఆయన అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎమ్మెల్యేలకు ఎర కేసు..‘స్టేటస్‌-కో’కు సుప్రీంకోర్టు నిరాకరణ

భారాస ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case)లో తెలంగాణ హైకోర్టు (TS High Court) ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు గురించి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వులపై ‘స్టే’ విధించాలని.. లేదా ‘స్టేటస్‌ కో’ (యథాతథ స్థితి) ఇవ్వాలని ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కియారాకు సారీ చెప్పిన ఉపాసన

బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ (Kiara Advani)కి రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) క్షమాపణలు చెప్పారు. వీలు కుదరకపోవడం వల్లే పెళ్లికి హాజరు కాలేకపోయామని అన్నారు. ఈ మేరకు కియారా తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. ‘‘కంగ్రాట్స్‌ కియారా. మీ జోడీ చూడచక్కగా ఉంది. పెళ్లికి మేము హాజరు కాలేకపోయినందుకు సారీ. మీ ఇద్దరికీ మరోసారి నా అభినందనలు’’ అని ఉపాసన కామెంట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌

దిల్లీ మద్యం కేసు (Delhi liquor case) వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. భారాస ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా మంగళవారం రాత్రి దిల్లీలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నాపై కోడిగుడ్లూ విసిరారు: చిరంజీవి

 నటుడిగా తాను ప్రశంసలే కాదు.. విమర్శలను సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). గతంలో తాను జగిత్యాలకు వెళ్లగా.. అక్కడ అభిమానులు తనపై పూలవర్షం కురిపించారని.. అదే సమయంలో కొంతమంది కోడిగుడ్లు కూడా విసిరారని ఆయన తెలిపారు. స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్‌ స్మిత’ (Nijam With Smita) కార్యక్రమంలో పాల్గొన్న చిరుని.. ‘‘స్టార్‌డమ్‌ను సొంతం చేసుకునే క్రమంలో మీకు ఎదురైన అవమానాలు, అనుమానాలు ఏమిటి?’’ అని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని