Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 May 2023 13:15 IST

1. భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య

మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పత్తికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌ (60), లలిత భార్యాభర్తలు. వీరిద్దరూ మెడికల్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు  కెనడాలో స్థిరపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గుడ్‌న్యూస్‌.. ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచర్‌ పోస్టులు

ఏపీలో పెద్ద సంఖ్యలో టీచింగ్‌ పోస్టుల (Teaching Jobs)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖలోని సమగ్రశిక్షా సొసైటీ నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మొత్తం 1358 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు మే 30 నుంచి జూన్‌ 4 తేదీ రాత్రి 11.59గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల

కర్ణాటక (Karnataka)లో పూర్తి స్థాయి మంత్రి మండలిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మంత్రులకు శాఖల (portfolios)ను కేటాయించింది. ఊహాగానాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇక పార్టీ ప్రయోజనాల కోసం సీఎం పదవిని త్యాగం చేసి ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు నీటిపారుదలతో పాటు, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నింగిలోని దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12.. ప్రయోగం విజయవంతం

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మరో రాకెట్‌ ప్రయోగం జరిగింది. ఉదయం 10.42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ టిప్స్‌తో క్రెడిట్‌కార్డ్‌ రివార్డు పాయింట్లను పెంచుకోవచ్చు!

క్రెడిట్‌కార్డు లావాదేవీల్లో వచ్చే అయిదేళ్లలో 21% వార్షిక వృద్ధి నమోదవుతుందని ఓ ప్రముఖ నివేదిక ఇటీవల అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్డుల ఆదాయంలో క్రెడిట్‌కార్డుల (Credit Card) వాటాయే 76 శాతమని వెల్లడించింది. ఈ గణాంకాలు పెరుగుతున్న క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని సూచిస్తున్నాయి. చెల్లింపుల్లో ఉన్న సౌకర్యం, రివార్డు పాయింట్లు సహా ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది క్రెడిట్‌ కార్డులను (Credit Card) తీసుకుంటుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్‌!

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ (IPL 2023) నుంచి కొత్తగా ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ రూల్‌ అమల్లోకి వచ్చింది. దీని ద్వారా అదనంగా బౌలర్‌/బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటు జట్లకు లభించింది. ఈ రూల్‌తో కొందరు సీనియర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైన సందర్భాలూ ఉన్నాయి. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు సారథి డుప్లెసిస్ కూడా ఇలాగే ‘ఇంపాక్ట్‌’గా ఆడినవారే. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ మాత్రం ఒక్కసారి కూడా ఇలా బరిలోకి దిగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!

అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపేందుకు చైనా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. టియాంగాంగ్‌ స్పేస్‌స్టేషన్‌ మిషన్‌లో భాగంగా ఈ యాత్ర జరగనున్నట్లు చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ పేర్కొంది. బీజింగ్‌ విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసే పేలోడ్‌ నిపుణుడు గుయ్‌ హైచావ్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి పంపిన వారు మొత్తం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్‌.. మండిపడ్డ సాక్షి మాలిక్‌

పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం రోజునే.. అగ్రశ్రేణి రెజ్లర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్న తీరు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంట్‌ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

అస్సాం (Assam)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో కారు.. వ్యాను ఢీకొన్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఏడుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు (Engineering Students) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆది పురుష్‌’ నుంచి ‘రామ్.. సీతా రామ్’ మెలోడియస్‌ సాంగ్ వచ్చేసింది

ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’ (Adipurush). ప్రభాస్‌ రాఘవగా, జానకి పాత్రలో కృతిసనన్‌, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్‌ (Saif Ali Khan) నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రామ్.. సీతా రామ్’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రాఘవుడు, సీత మధ్య సంభాషణతో ప్రారంభమైన ఈ సుమనోహర గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని