Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jun 2023 13:08 IST

1. వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్‌ సెల్ఫీ

ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి దోపిడీకే ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్ర 122వ రోజు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని జంగాలపల్లె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో సిద్దవటం మండలం జంగాలపల్లెకు చేరుకున్న లోకేశ్‌.. పెన్నానదిని తోడేసి వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డుతో సెల్ఫీ దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్‌..! ఉత్తరాఖండ్‌ కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Govt Teachers) సంబంధించి ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ (Retirement) చేయించనుంది. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్‌ సింగ్‌ రావత్‌ ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నెల్లూరులో పాదయాత్ర పూర్తికాగానే తెదేపా సభ్యత్వం తీసుకుంటా: ఆనం రాంనారాయణ రెడ్డి

నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు చంద్రబాబు, ఆనం భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైకాపా నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పోలవరం వెళ్తున్న తెదేపా నేతల అడ్డగింత.. పోలీసులతో వాగ్వాదం

పోలవరం పర్యటనకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన తెదేపా నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, పార్టీ నేతలను పోలీసులు నిలువరించారు. దీంతో తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వచ్చే 24 గంటల్లో మరింత తీవ్రంగా ‘బిపోర్‌జాయ్‌’.. 3 రాష్ట్రాలకు హెచ్చరికలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’(Biparjoy) తుపాను మరో 24 గంటల్లో మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కి.మీ దూరంలో, ముంబయికి పశ్చిమ-నైరుతి దిశలో 640 కి.మీలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  ప్రైవేట్‌ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్‌!

రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump)పై నమోదైన నేరాభియోగాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన తన సొంత నివాసానికి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను తరలించుకుపోయారని అభియోగాల్లో అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..

జపాన్‌ (Japan) రాజధాని టోక్యో (Tokyo)లోని ఓ ప్రధాన విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు కమర్షియల్‌ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకదాన్నొకటి తాకాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు. టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్టు (Haneda airport)లో స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకాక్‌ బయల్దేరిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఇంటర్నేషనల్‌ విమానం.. తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్‌ విమానం రన్‌వేపై ఒకేసారి వచ్చి ఒకదాన్నొకటి తాకాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ ఉచిత టూల్స్‌తో మీ డిజిటల్‌ లైఫ్‌కు భరోసా!

ప్రస్తుతం ఎక్కువ మంది డిజిటల్‌ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోయారు. గుర్తింపు పత్రాల నుంచి బ్యాంక్‌ ఖాతాల వివరాల వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై ఎక్కువ మంది అవగాహన రావడంతో.. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వాలతో పాటు, ప్రయివేటు సంస్థలు ఆన్‌లైన్‌ సేవలను అందిస్తున్నాయి. వాటితోపాటు యూజర్ల డేటా లక్ష్యంగా సైబర్‌ దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో బాట్‌నెట్‌ గురించి ప్రభుత్వాలు, సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు యూజర్లను అప్రమత్తం చేస్తున్నా.. రోజూ కొన్ని వేల సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్‌: కేటీఆర్‌

శరవేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

పశ్చిమగోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైకాపా ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరసనలు తెలుపుతున్న దళితులపై దాడి చేసి గాయపరిచారని మండిపడ్డారు. దళితులపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని సీఎంకు రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని