Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 03 Dec 2022 17:14 IST

1. రాష్ట్రం నుంచి కంపెనీలను వైకాపా తరిమేస్తోంది: చంద్రబాబు

రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ చంపేసి వైకాపా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్విటర్‌లో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌లన్నీ.. స్కామ్‌లుగా మారాయి: ఎంపీ లక్మణ్ 

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా.. ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారన్నారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు. పేదవాడు వంద గజాల భూమి కొనకుండా విపరీతంగా ధరలు పెంచారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికల విధుల నుంచి తప్పించమని ఉపాధ్యాయులే అడిగారు: మంత్రి బొత్స

ఉపాధ్యాయుల కోరిక మేరకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పరాజు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఈవో ధర్మారెడ్డి

వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అయితే, టోకెన్లు లేనివారు తిరుమలకు రావొచ్చని, కానీ శ్రీవారి దర్శనానికి అనుమతించమని ఈవో చెప్పారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపా వేధిస్తే చంద్రబాబు హెరిటేజ్‌ ఎలా నడుపుతున్నారు?: అమర్నాథ్‌

అమరరాజా గ్రూప్‌ ఏపీలో కాకుండా ఇంకెక్కడా పెట్టుబడులు పెట్టకూడదా? అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు. తెలంగాణలో పెట్టుబడి పెడితే ఏపీ నుంచి వెళ్లగొట్టినట్టా అని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే అమరరాజా సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలు ఉండకూడదని చూస్తే చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థ నడిచేదా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 5G కంటే మాతాజీ, పితాజీనే గొప్ప: ముకేశ్‌ అంబానీ

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. అమ్మానాన్నల ప్రాముఖ్యాన్ని యువతకు అర్థమయ్యేలా వినూత్నంగా చెప్పారు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ. ఈ ప్రపంచంలో మాతాజీ, పితాజీ కంటే ఏ జీ (5G) ముఖ్యమైనది కాదన్నారు. ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ విద్యార్థులకు అంబానీ ఈ గొప్ప సందేశమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హత్య తర్వాత.. శ్రద్ధా ఫోన్‌తోనే ముంబయి విచారణకు ఆఫ్తాబ్‌..!

సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. శ్రద్ధాను చంపేసిన తర్వాత నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమె ఫోన్‌ను కొన్ని నెలల పాటు తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. ముంబయిలో పోలీసు విచారణకు వెళ్లినప్పుడు కూడా ఆ ఫోన్‌ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాలో జీరో కొవిడ్‌ ఎత్తేస్తే 20 లక్షల మరణాలు!?

కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలన్నీ దాదాపు బయటపడగా.. వైరస్‌ వెలుగు చూసిన చైనాను మాత్రం పట్టిపీడిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆ దేశం జీరో కొవిడ్‌ విధానాన్ని అనుసరిస్తోంది. కఠిన లాక్‌డౌన్లను విధిస్తోంది. దీనిపై ఆ దేశ పౌరుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. దీంతో జీరో కొవిడ్‌ విధానాన్ని సడలించేందుకు చైనా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నౌకాదళంలో అగ్నివీరులు.. చరిత్రలో తొలిసారి మహిళా నావికులు

త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కింద భారత నౌకాదళంలోకి అగ్నివీరులను నియమించారు. వీరిలో మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌ తెలిపారు. తొలిసారిగా మహిళలను నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విమానంలో ఫుడ్‌ పెట్టలేదు.. లగేజ్‌ ఇంకా ఇవ్వలేదు: ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డ క్రికెటర్‌

మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌లో భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో దారుణమైన అనుభవాన్ని చవి చూశామని ఈ మేరకు బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ట్వీట్‌ చేశాడు. తమ లగేజీని ఇంకా ఇవ్వలేదని..  బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించిన తమకు ఎలాంటి ఆహారం కూడా అందించలేదని అతడు ఆరోపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని