Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 25 Sep 2022 17:14 IST

1. కన్నెర్ర చేస్తే చాలు.. యాత్రలు ఆగిపోతాయి: బొత్స

కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్నించారు. రూ.10వేల కోట్లు ఖర్చు పెడితే ముంబయిని తలదన్నే నగరంగా విశాఖను మార్చవచ్చన్నారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జహీరాబాద్‌లో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ శివారులోని డిడిగి గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో వివాహితపై సామూహిక అత్యాచార జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 24ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహితను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఇంత పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదు: సత్యకుమార్‌

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారుస్తూ కొత్త నాటకం ఆడుతున్నారు. ఇంత పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదు’’ అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రాజస్థాన్‌లో బలప్రదర్శనకు అశోక్‌ గహ్లోత్‌ ఏర్పాట్లు..!

ఒక వేళ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపడితే.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు నేటి సాయంత్ర సీఎల్‌పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో గహ్లోత్‌ పక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు బలప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది సీఎల్‌పీ సమావేశానికి వచ్చేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా లేరని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాంతి దారివాల్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. 93 ఎపిసోడ్‌లు అయ్యాయి.. మోదీ ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదు: నడ్డా

భాజపా శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరూ కలిసి ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం విన్న తర్వాతే బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత కొన్నేళ్లుగా ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వింటోన్నవారి సంఖ్య ప్రతి నెలా పెరుగుతోందన్నారు. అందరూ కలిసికట్టుగా ‘మన్‌ కీ బాత్‌’ ఆలకించేలా పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు మండల, తాలుకా, ప్రాంతీయ, బూత్‌ స్థాయిల్లోని అధ్యక్షులందరూ కలిసికట్టుగా కృషిచేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రవి భాయ్‌.. నీవు నేర్పిన విద్యయే

నాగ్‌పుర్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ చివరి ఓవర్లో కొట్టిన షాట్లను తక్కువ చేసి చూపించేలా వ్యాఖ్యానించిన మాజీ కోచ్‌ రవిశాస్త్రికి ఊహించని సమాధానం ఎదురైంది. శుక్రవారం నాగ్‌పుర్‌లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ చివరి ఓవర్‌లో డీకే.. సిక్సు, ఫోర్‌ బాది భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పోస్టు మ్యాచ్‌ ఇంటర్వ్యూ సందర్భంగా డీకే వద్దకు రవిశాస్త్రి వచ్చి ‘‘ఈజీ గేమ్‌, డీకే. రెండు బంతులు, చాలా తేలిక (‘పీస్‌ ఆఫ్‌ కేక్‌’ అనే నుడికారం వాడుతూ). సిక్స్‌, ఫోర్‌, ధన్యవాదాలు’’ అని ముగించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. చండీగఢ్‌ విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చండీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. భగత్‌సింగ్‌ జయంతి వేళ ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, భగత్‌సింగ్‌కు మరింత గౌరవం కల్పించే ఉద్దేశంతో పంజాబ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. యువతి మిత్రుడిని తప్పుదోవ పట్టించేందుకు యత్నం..!

ఉత్తరాఖండ్‌లో యువతి హత్యకేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు పుల్కిత్‌ ఆర్య సదరు యువతి మిత్రుడైన పుష్ప్‌ను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు తేలింది. ఈ మేరకు పుల్కిత్‌ కాల్‌ రికార్డింగ్‌లు వెలుగు చూశాయి. వీటిల్లో  ఒక సారి పుష్ప్‌తో మాట్లాడుతూ ‘‘మేము అంకితతో కలిసి రిషికేశ్‌కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి రిసార్ట్‌కు వచ్చాము. అంకితా మాతో కలిసి డిన్నర్‌ కూడా చేసింది. కానీ, మర్నాడు ఉదయం నుంచి ఆమె గది నుంచి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నాం’’ అని పేర్కొన్నాడు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. 5 నెలల్లో 70 లక్షల మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఆస్తుల నిర్వహణ సంస్థల  వద్ద 70 లక్షల కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 13.65 కోట్లకు చేరింది. డిజిటల్‌ సాధనాలు అందుబాటులోకి రావడం, మ్యూచువల్‌ ఫండ్లపై అవగాహన పెరగడమే భారీ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కళ్ల కింద నల్లని వలయాలున్నాయా..? ఎందుకు వస్తాయో తెలుసుకోండి..

నిద్ర సరిగా లేకపోయినా, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. వాటిని చూడగానే మానసిక సంఘర్షణకు లోనైనట్లు తెలిసిపోతుంది. ఆ నల్లని వలయాలను తగ్గించుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కొంతమంది చర్మవ్యాధి నిపుణులను కలుస్తారు. వాస్తవానికి ఈ సమస్య ఇన్‌ఫెక్షన్లు, కంట్లో రక్తకణాలు దెబ్బతినడంతో పాటు వంశపారంపర్యంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని