Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 Mar 2023 17:10 IST

1. వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌..

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను సీబీఐ తప్పించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీబీఐ ఇచ్చిన ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.  కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌కు సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి కోర్టు అనుమతితో షమీమ్, రమేశ్‌, సురేశ్‌లను సిట్ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కు 126 మార్కులు, రమేశ్‌కు 122, సురేశ్‌కు 100కు పైగా మార్కులొచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపా ఎంపీ గిరీశ్‌ బాపట్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం

భాజపా(BJP) సీనియర్‌ నేత, పుణె ఎంపీ గిరీశ్‌బాపట్‌(Girish Bapat) (73) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. బాపట్‌ కస్బాపేట్‌ నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?

ముంబయి ఇండియన్స్‌.. ఐపీఎల్‌లో ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్‌ మెషీన్‌ అని చెప్పొచ్చు. ప్రిమియర్‌ లీగ్‌లో ఆ జట్టు (Mumbai Indians) ప్రదర్శన అలా ఉంటుంది మరి. అయితే ఇటీవల కాస్త నెమ్మదించింది అనుకోండి. అయితే ఒకసారి కుదరుకుంటే ఈ జట్టును కప్‌ నుంచి దూరం చేయడం కష్టం అంటుంటారు. 16వ ఐపీఎల్‌ (IPL 2023) త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముంబయికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులివి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్రానికి వ్యతిరేకంగా.. మమతా బెనర్జీ నిరసన దీక్ష

రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నేడు స్వయంగా ధర్నాకు దిగారు.  ఈ మధ్యాహ్నం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఆమె నిరసన దీక్షకు కూర్చున్నారు. రెండు రోజుల పాటు దీదీ ఈ ధర్నా కొనసాగించనున్నారు. ఈ దీక్షలో మమతతో పాటు టీఎంసీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రెండు ‘అదానీ’ కంపెనీల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు: ఫిచ్‌

అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన రెండు కంపెనీలపై ప్రముఖ రేటింగ్స్‌ ఏజెన్సీ ఫిచ్‌ (Fitch) కీలక నివేదిక విడుదల చేసింది. గ్రూప్‌లోని కంపెనీలు, అనుబంధ సంస్థల్లో పాలనాపరమైన బలహీనతలు ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల అదానీ ట్రాన్స్‌మిషన్‌ (Adani Transmission), అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (Adani Ports & SEZ)ల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు పొంచి ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వినియోగదారుడిపై UPI ఛార్జీల భారం ఉండదు.. స్పష్టం చేసిన ఎన్‌పీసీఐ

ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని ఎన్‌పీసీఐ సిఫారసు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)’ ప్రతిపాదించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ(Judicial System)లో సంస్కరణల కోసం నెతన్యాహు ప్రతిపాదించిన కొత్త చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ ప్రధాని తిప్పికొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొత్త పన్ను శ్లాబులు, డిపాజిట్‌ పరిమితి పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి మారేవి ఇవే..!

కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు, సీనియర్‌ సిటిజన్లకు డిపాజిట్లపై పరిమితి పెంపు వంటి ఊరటనిచ్చే నిర్ణయాలు 1 నుంచే అమలు కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐపీఎల్‌ 2023.. ప్రారంభోత్సవంలో తమన్నా సందడి!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. పది జట్లు దాదాపు రెండున్నర నెలలపాటు టైటిల్‌ కోసం తలపడతాయి. మరి అలాంటి మెగా టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలు కూడా అట్టహాసంగా ఉండటం సహజమే కదా.. ఈ క్రమంలో టాలీవుడ్‌ భామ తమన్నా భాటియా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని