Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Nov 2022 17:05 IST

1. వైఎస్‌ షర్మిల ‘కమలం’ వదిలిన బాణం: ఎమ్మెల్సీ కవిత

తెరాస ఎమ్మెల్సీ కవిత, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ట్విటర్లో ఒకరిపై ఒకరు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ‘‘పాదయాత్రలు చేసిందీ లేదు.. ప్రజల సమస్యలు చూసిందీ లేదు.. ఇచ్చిన హామీల అమలూ లేదు. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’’ అని షర్మిల ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడుతున్నా: సీఎం జగన్‌

పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని.. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని మాట్లాడారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ.684 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం: చంద్రబాబు

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్‌ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. ఈ అంశంపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చిన్న గదిలో ఏడుగురితో పాటు ఉండేవాడిని..: బిగ్‌బీ

చిత్రపరిశ్రమలో ఒక బెంచ్‌ మార్కును క్రియేట్‌ చేసిన నటుడు అమితాబ్‌ బచ్చన్‌. తన నటనతో ప్రవర్తనతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సీనియర్‌ హీరో. వయసుతో సంబంధం లేకుండా నేటి తరం నటీనటులతో పోటీపడుతూ అందరిలో స్ఫూర్తిని నింపుతుంటారు. తాజాగా బిగ్‌బీ తన పాత రోజులను గుర్తుతెచ్చుకున్నారు. ఆ పాతజ్ఞాపకాల గురించి తన బ్లాగ్‌లో రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేజ్రీవాల్‌ సర్‌.. మీ మఫ్లర్‌ ఏదీ.? ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న!

ఆమ్‌ ఆద్మీ పార్టీ నెలకొల్పిన తొలినాళ్లతో తలపై టోపీ, మెడలో మఫ్లర్‌తో అరవింద్‌ కేజ్రీవాల్ ఎంతో పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం దిల్లీ సీఎంగా ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ఇంటింటికి తిరుగుతూ ఆప్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చిరాగ్‌ దిల్లీ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద మహిళ ‘‘కేజ్రీవాల్ సర్‌ మీరు మఫ్లర్‌ ఎందుకు ధరించలేదు’’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..!

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు చూసి అఫ్తాబ్‌ కొత్త స్నేహితురాలు షాక్‌లోకి వెళ్లింది. శ్రద్ధాను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచిన ఆఫ్తాబ్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా మరో యువతిని పరిచయం చేసుకొని ఇంటికి రప్పించాడు. ఆమె ఒక మానసిక వైద్యురాలు. ఇటీవల ఆమెను పోలీసులు విచారించారు. ఆఫ్తాబ్‌ ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలో అతడి ఫ్రిజ్‌లో మానవ శరీర భాగాలు ఉన్న విషయం తనకు తెలియదని ఆమె పోలీసులకు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మూడో వన్డేలోనూ సంజూకి రాని అవకాశం.. శశి థరూర్‌ ఆగ్రహం

భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 36 పరుగులు చేసిన సంజూను.. రెండో వన్డేలో పక్కనపెట్టేశారు. ఇక మూడో వన్డేలోనూ తుది జట్టులోకి తీసుకోలేదు. దీనిపై హెడ్‌ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్‌ ఎంపీ శశీ థరూర్‌ మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మూడో వన్డే కూడా వర్షార్పణం.. సిరీస్‌ మాత్రం కివీస్‌దే

మూడో వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత్‌పై మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 1-0 తేడాతో కైవసం చేసుకొంది. తొలి వన్డేను కివీస్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. మూడో వన్డే మ్యాచ్‌లో ఇంకో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌ విజయం సాధించేది. కానీ వర్షం రావడంతో మ్యాచ్‌ 18 ఓవర్ల వద్దే నిలిపేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రమోటర్‌ సంస్థకు రాధిక, ప్రణయ్‌ గుడ్‌బై.. కొనసాగుతున్న NDTV షేర్ల ర్యాలీ

న్యూదిల్లీ టీవీ వ్యవస్థాపకులు (NDTV) ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ (RRPR) హోల్డింగ్‌ కంపెనీ నుంచి వైదొలిగారు. గతంలో ఇచ్చిన రుణాన్ని RRPR ద్వారా వాటాలుగా మార్చుకోవడంతో NDTVలో 29.18శాతం వాటా అదానీ గ్రూప్‌ వశమైంది. ఈ క్రమంలో ప్రమోటర్‌ గ్రూప్‌ నుంచి వారు వైదొలిగినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి NDTV సమాచారమిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇప్పుడు జాక్‌ మా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా (Jack Ma) ఒకప్పుడు సమావేశాలు, పర్యటనలు, ప్రసంగాలతో తీరికలేకుండా గడిపేవారు. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచేవారు. కానీ, గత కొంతకాలంగా పూర్తిగా కనుమరుగైపోయారు. ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా బయటకు రావడం లేదు. టెక్‌ వ్యాపారాలు, వాటి యజమానులపై చైనా విరుచుకుపడడం ప్రారంభించినప్పటి నుంచి జాక్‌ మా  జాడ లేకుండా పోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని