Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.

Published : 24 Jan 2022 16:59 IST

1.గుడివాడలో క్యాసినో ఆరోపణలు.. చంద్రబాబుకు నిజనిర్ధారణ కమిటీ నివేదిక

గుడివాడలో క్యాసినో ఆరోపణల వ్యవహారంలో తెదేపా నిజ నిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందజేసింది. సంక్రాంతి పండుగ వేళ గుడివాడలో క్యాసినో, జూదం, పేకాట, అసభ్యకర నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని నేతలు నివేదికలో పేర్కొన్నారు. రూ.500 కోట్లు చేతులు మారాయని వెల్లడించారు. మంత్రి కొడాని నానికి చెందిన కె కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ తెదేపా నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పరిశీలనకు వెళ్లింది.

2.సమ్మె షురూ.. నోటీసు అందజేసిన పీఆర్సీ సాధన సమితి
ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. సీఎస్‌ సమీర్‌ శర్మ దిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి నోటీసు అందించారు.

Passenger Trains: పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు పొడిగింపు

3.షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట చేరేది ఆయనే: బుద్దా వెంకన్న

ఏపీలోని సమస్యలను దృష్టి మరల్చేందుకే మంత్రి కొడాలి నాని తెదేపా అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఇకపై చంద్రబాబు గురించి మాట్లాడితే అదే రీతిలో బుద్ధి చెబుతామని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం లేదని గుడివాడలో కొడాలి నాని క్యాసినో పరిశ్రమను తీసుకొచ్చారని విమర్శించారు.

4.అపోహలు తొలగించేందుకే చర్చలకు రమ్మన్నాం: సజ్జల

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కమిటీ ఏర్పాటైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అమరావతిలో మీడియాతో సజ్జల మాట్లాడారు. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని సంఘాలు కోరాయని.. ముందుగా చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు.

5.మేం చేపట్టే ప్రతి కార్యక్రమంలో బాలికల సాధికారతకు ప్రాధాన్యం: మోదీ

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ది కార్యక్రమంలోనూ బాలికల సాధికారతకు తగిన ప్రాధాన్యమిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మోదీ ట్విటర్‌ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయ బాలికల దినోత్సవం అనేది.. మా నిబద్ధతను మరోసారి గుర్తుచేసుకోవడానికి, బాలికల సాధికారత కోసం కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒక సందర్భంగా భావిస్తున్నాం’’అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

6.బేర్‌ స్వైర విహారం.. ఎరుపు రంగు పులుముకున్న మార్కెట్లు!

అవకాశం కోసం కాచుక్కూర్చున్నట్లుగా బేర్‌ మార్కెట్లపై సోమవారం పంజా విసిరింది. ఎరుపు రంగు పులుముకొని స్వైరవిహారం చేసింది. గతకొన్ని రోజులుగా నష్టాలు చవిచూస్తున్న మదుపర్లపై ఏమాత్రం కనికరం లేకుండా వారి సంపదను దోచుకుంది! దీంతో వరుసగా ఐదో సెషన్‌లోనూ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి.

Stock Market: కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించేవారికి ఇది మంచి సమయం

7.ఫిబ్రవరి 15 నాటికి తగ్గుముఖం పట్టనున్న కరోనా కేసులు..!
భారత్‌లో ప్రస్తుతం కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 3 లక్షలపైనే నమోదవుతున్నా.. మూడురోజులుగా వాటిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే మాట చెప్పాయి. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించాయి. అలాగే టీకా కార్యక్రమం మూడోవేవ్ ప్రభావాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి.
ఎయిరిండియా అతి త్వరలోనే పూర్తిగా టాటాల కంపెనీగా మారనుంది. ఈ విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఈ వారాంతం నాటికి టాటా గ్రూప్‌నకు అప్పగించనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. జనవరి 27న ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుందని తెలుస్తోంది.
భాజపాపై ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాలును స్వీకరిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భాజపాతో పొత్తు పెట్టుకుని శివసేన పార్టీ పాతికేళ్లు సమయం వృథా చేసుకుందన్నారు. ఆ పార్టీ మాదిరిగా తాము ఎన్నడూ అధికారం కోసం హిందుత్వను వాడుకోలేదన్నారు.
ఉక్రెయిన్‌ అంశంపై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని అమెరికా దౌత్యవేత్తల కుటుంబాలను వెంటనే స్వదేశానికి వచ్చేయాలని కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌ ఆక్రమణ విషయంలో రష్యా నుంచి నిరంతర ముప్పు పొంచి ఉందని పేర్కొంది. రాయబార కార్యాలయంలోని సిబ్బంది సైతం స్వచ్ఛందంగా వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని