Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 03 Oct 2022 16:56 IST

1.  8 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ ఎలా చక్రం తిప్పుతారు?: కిషన్‌రెడ్డి

మజ్లిస్‌ బలోపేతం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నెగటివ్‌ ఆటిట్యూడ్‌తో వచ్చే ఏ పార్టీకీ మనుగడ లేదని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని.. ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్ర పక్షం మజ్లిస్‌ మాత్రమేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేవంత్‌ పిలిస్తే గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటా: శశిథరూర్‌

అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్‌లో జరుగుతోంది అంతర్గత చర్చేనని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో ఆయన పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టేందుకు పార్టీలోని ముఖ్యనేతలతో శశిథరూర్‌ భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్‌ బహుమతి

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం -2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోకు ఈ బహుమతి దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం దీనిని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరో పరుగు చేస్తే హాఫ్‌ సెంచరీ.. డీకేతో కోహ్లీ ఏమన్నాడంటే..

కింగ్‌ కోహ్లీ పరుగుల దాహం తీరనిది అన్న విషయం మనకు తెలిసినదే. పరుగుల వేటలో ఎన్నో రికార్డులు అతడికి దాసోహం అయ్యాయి. 71 అంతర్జాతీయ సెంచరీలతో దూసుకుపోతున్న ఈ రన్‌ మెషీన్‌.. ఎప్పుడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు. జట్టుకు ఏది ఉత్తమమో.. అదే చేస్తాడు. ఇలాంటి ఘటనే దక్షిణాప్రికాతో జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇంకో పరుగు సాధిస్తే అర్ధ శతకం నమోదు చేసే అవకాశం ఉన్నా.. తన నిస్వార్థతను ప్రదర్శించాడు కోహ్లీ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Jio Book: జియో మరో సంచలనం.. ₹15 వేలకే ల్యాప్‌టాప్‌?

టెలికాం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. జియోఫోన్‌ విడుదలతో అందుకున్న విజయాన్ని మరోసారి మరో కొత్త ప్రోడక్ట్‌తో రుచి చూసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అతి తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జియోబుక్‌ పేరిట తీసుకురానున్న ఈ ల్యాప్‌టాప్‌ 4జీ ఆధారిత సిమ్‌తో పనిచేసేలా రూపొందించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతోద్యోగి తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నకిలీ ఔషధాలకు చెక్‌.. మందులపై ఇక QR కోడ్‌!

దేశంలో నకిలీ మందుల బెడదను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. బహిరంగ మార్కెట్లోకి వస్తున్న మందులపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రణను తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వినియోగదారులు అవి అసలైనవా, నకిలీవా గుర్తించేందుకు వీలు పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాయుసేన అమ్ములపొదిలో.. అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’ (Prachand) భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీటిని లాంఛనంగా భారత వైమానిక దళంలోకి (Indian Air Force) ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశవ్యాప్తంగా 157 మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు: మంత్రి హరీశ్‌

రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌లు ప్రారంభించనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీని ద్వారా తెలంగాణలో 1200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్ననట్లు వెల్లడించారు. బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. RTI: నా భర్త జీతం ఎంతో చెప్పండి.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న మహిళ

ప్రభుత్వం నుంచి సమాచారం పొందేందుకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటాం. కొన్ని పరిమితులతో ఎలాంటి సమాచారాన్నైనా తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని ఓ మహిళ తన భర్తపై ప్రయోగించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Flipkart sale: ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో సేల్‌..

దసరా, దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థలు ఇటీవల పోటాపోటీగా భారీ సేల్స్‌ నిర్వహించాయి. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట అమెజాన్‌, ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌ నిర్వహించాయి. అమెజాన్‌ సేల్‌ ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ సెప్టెంబర్‌ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే మరో సేల్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. ‘బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌’లో పాల్గొనలేకపోయిన వారు ఈ సేల్‌పై లుక్కేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని