Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Mar 2023 09:00 IST

1. ప్రపంచకప్‌ సన్నాహానికి దెబ్బ

వన్డే ప్రపంచకప్‌ దగ్గరపడుతోంది. ఇక నుంచి ఆటగాళ్లు, అభిమానుల దృష్టంతా అటే. పైగా టీమ్‌ఇండియా సొంతగడ్డపై ఆడుతోంది. చివరిసారి (2011) స్వదేశంలో ఆడినప్పుడు ధోని నేతృత్వంలోనే కప్పును అందుకుంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలే ఉన్నాయ్‌! కానీ పరిస్థితులే అంత అనుకూలంగా లేవు. గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి భారత జట్టు సన్నాహాలకు అడ్డంకిగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్‌!

తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు. రెండోది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి విజయవాడ వరకు. ఈ కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో రైలును పరుగులెత్తించాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రశ్నపత్రాల కోసం పక్కా వ్యూహరచన

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును బేగంబజార్‌ ఠాణా నుంచి సీసీఎస్‌కు బుధవారం బదిలీ చేశారు. సిట్‌ అధిపతి ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ దర్యాప్తును వేగవంతం చేశారు. తమ్ముడి పేరుతో ప్రశ్నపత్రాలు సంపాదించేందుకు గురుకుల ఉపాధ్యాయిని ఎల్‌.రేణుక రాథోడ్‌ అలియాస్‌ రేణుక తెరవెనుక పెద్ద తతంగమే నడిపినట్టు.. ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గొడ్డలితో నరికాడు.. సంపులో పడేశాడు

‘మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు. మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని తన కళ్ల ముందే తండ్రి చేసిన హత్యల తీరుపై రెండున్నరేళ్ల చిన్నారి భయపడుతూ చెప్పిన మాటలివి. గొడ్డలి పట్టుకుని రాక్షసుడిగా ప్రవర్తిస్తున్న తండ్రిని చూసి గజగజ వణుకుతూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తిన ఆ బాలిక ప్రాణాలు దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆధార్‌ అప్‌డేషను మూణ్నెల్లు ఉచితం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఏఐ) మార్చి 15 నుంచి జూన్‌ 14 వరకు మూణ్నెల్లపాటు ఆధార్‌ డాక్యుమెంట్ల అప్‌డేషను ఆన్‌లైను ద్వారా ఉచితంగా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఇలా అప్‌డేషను చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకొన్న తాజా నిర్ణయంతో లక్షల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పోలవరం కంకరకు కాళ్లు!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలవరం కుడికాలువకు ఇరువైపులా కంకర, మట్టి తవ్వి తరలించుకుపోవడంపై హైకోర్టు ఇటీవల సీరియస్‌ అయింది. సంబంధిత శాఖ అధికారులందరికీ నోటీసులు జారీచేసింది. అక్రమ మైనింగ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కుడి కాలువే కాదు.. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఎడమ కాలువ పరిస్థితి అలానే ఉంది. పాయకరావుపేట నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు ఉన్న పోలవరం ఎడమ కాలువకు ఇరువైపులా అక్రమంగా రాళ్లు, కంకర, మట్టి తరలించుకుపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉద్యోగం కోల్పోయినా 180 రోజులు ఉండొచ్చు!

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న హెచ్‌-1బి వీసాదారులకు శుభవార్త..! వీరి వీసా గడువును (గ్రేస్‌ పీరియడ్‌) ప్రస్తుత 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాల్సిందిగా బైడెన్‌ అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయులు సహా అమెరికాలో పనిచేస్తున్న వేలాది విదేశీ ఉద్యోగులకు భారీ ఊరటే. ఇటీవల గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ లాంటి సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు తొలగించిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈడీ సమన్లపై సుప్రీంకు కవిత

దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న ఒకసారి విచారించిన ఈడీ.. 16వ తేదీన మరోసారి హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును బుధవారం ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించి.. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వివేకా హత్య కేసులో ఎంతటివారున్నా శిక్ష పడాల్సిందే

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో కొందరు వ్యక్తులు తేలిగ్గా మాట్లాడారని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఈ కేసులో ఎంతటివారైనా బయటకు రావాల్సిందేనని, తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు తప్పు చేసినా మందలిస్తాం కదా.. పెద్దలకు మాత్రం మినహాయింపు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సూర్యుణ్ని కమ్మేద్దామా?

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు... అన్నది ఇన్నాళ్లుగా మనం వింటున్న మాట. కానీ మునుముందు అలా అడ్డుకోవటమే భూతాపానికి మందుగా మారేలా ఉంది. వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించటానికి అత్యంత వివాదాస్పద సౌర జియో ఇంజినీరింగ్‌ ప్రక్రియను ఆశ్రయించాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని