Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 02 Feb 2023 21:02 IST

1. ఫోన్‌ ట్యాపింగ్‌.. ప్రాణభయంతో వైకాపా ఎమ్మెల్యేలు: పవన్‌ కల్యాణ్‌

నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు. శాసనసభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ మేరకు గురువారం ట్విటర్‌లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 24 గంటల ఫ్రీ కరెంట్‌.. నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: ఈటల రాజేందర్‌

దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని హుజూరాబాద్  భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను మొత్తం అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ..శాఖలపై ఒక్కసారైనా సమీక్ష చేశారో లేదో ఆయా శాఖల మంత్రులు గ్రహించాలన్నారు. తెలంగాణలో ఎక్కడైనా 24 గంటలు కరెంట్ ఇస్తే  నిరూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు

ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్‌, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌ రెడ్డి నియామకాలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్ధతను తేలుస్తామని పునరుద్ఘాటించింది. ఇలా నియమించుకుంటూ పోతే వీరి సంఖ్యకు పరిమితి ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైఎస్‌ వివేకా హత్య.. జగన్‌ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ఇప్పుడు తప్పించుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపు చూపుతున్నాయన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫెడ్‌ ఎఫెక్ట్‌.. పెరిగిన బంగారం ధర

బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పసిడి (Gold) ధరలు గురువారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర (Gold rate) ఏకంగా రూ.770 మేర పెరిగి రూ.58,680కి చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.57,910గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఇక కుదరదు.. ఇంతకీ నెట్‌ఫ్లిక్స్‌ ఎలా తెలుసుకుంటుంది?

కరోనా తగ్గుముఖం పట్టింది.. థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి.. కానీ ప్రజలకు ఓటీటీలపై అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు. వివిధ రకాల ఓటీటీలను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటూ ఇంటిల్లిపాదీ వినోదం ఆస్వాదిస్తున్నారు. అయితే, ఒక అకౌంట్‌ను తీసుకొని వివిధ డివైజ్‌ల్లో లాగిన్‌ అవుతున్నారు. దీంతో సబ్‌స్క్రైబర్లు సంఖ్య తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నామని నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ సంస్థలు వాపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే!

కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని పలు మంత్రిత్వశాఖలు, విభాగాల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. వీటిలో రైల్వేలో అత్యధికంగా 2.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా.. రక్షణ శాఖలో 2.64లక్షలు, హోంశాఖలో 1.43లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాలుగేళ్లలో మోదీ 21 విదేశీ పర్యటనలు.. ఖర్చెంతో తెలుసా?

నాలుగేళ్ల క్రితం 2019లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ (Modi) 21 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. మరి ఈ పర్యటనలకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. అక్షరాలా రూ.22.76కోట్లు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కు వెల్లడించింది. 2019 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం రూ.22.76కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!‌’

ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా సైనిక చర్యను ప్రారంభించి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలోనే రష్యా(Russia) భారీ దాడులకు సిద్ధమవుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఓలెక్‌సీ రెజ్నికోవ్‌(Oleksii Reznikov) తెలిపారు. ఫిబ్రవరి 24 నాటికి అవి ప్రారంభమవుతాయని హెచ్చరించారు. ఈ దిశగా మాస్కో ఇప్పటికే లక్షలాది మంది సైనికులను సమీకరించిందని, సైనిక చర్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా దాడులకు దిగొచ్చని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ధోనీ పోషించిన బాధ్యత నాపై ఉంది.. ఒక్కోసారి కాస్త నిదానం తప్పదు: హార్దిక్‌

జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తెలిపారు. కివీస్‌ టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హార్దిక్‌ మాట్లాడాడు. కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో గిల్‌ శతకం సాధించడంతో భారత్‌ తొలుత  నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్ హార్దిక్‌తో (4/16) సహా టీమ్‌ఇండియా బౌలర్లు రాణించడంతో కివీస్‌ 66 పరుగులకే చేతులెత్తేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని