Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 06 Feb 2023 21:13 IST

1. తెలంగాణ బడ్జెట్‌.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్‌

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌  అంతా డొల్ల బడ్జెట్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఇది ఎలక్షన్‌ స్టంట్‌ను తలపిస్తోందని విమర్శించారు. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలేనని పేర్కొంటూ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దమ్ముంటే నన్ను భారాస నుంచి సస్పెండ్‌ చేయండి: పొంగులేటి

దమ్ముంటే తనను భారాస నుంచి సస్పెండ్‌ చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేటలో అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన భారాస సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ ప్రారంభించిన ఈ మెుబిలిటీ వీక్‌లో భాగంగా జరిగిన ఈవీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు రంగారెడ్డిలోని మోమిన్‌పేట్‌ మండలం ఎంకతాలలో మెుబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? వివరాలివ్వండి: భారతీ సిమెంట్స్‌కు సుప్రీం ఆదేశం

భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీమ్‌ ఇండియా 36కి ఆలౌట్‌.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!

బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) భారత్‌ - ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరిగే కీలక సిరీస్‌. అందులో విజయం దక్కితే.. ఆ ఆనందమే వేరు. అంతటి ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో భారత్‌ ఓ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దాంతో ఆ మ్యాచ్‌లో దారుణ పరాజయం పాలైంది. భారత క్రికెట్‌ ప్రేమికులు ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోరు. అందుకే ఇప్పుడు బదులు తీర్చుకునే టైమ్‌ వచ్చింది అని నాటి విషయాల్ని గుర్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 600 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్!

ప్రముఖ ఐటీ కంపెనీ (IT Company) ఇన్ఫోసిస్‌ (Infosys) కొత్త ఉద్యోగుల (Fresher Employees)పై వేటు వేసింది. శిక్షణ అనంతరం ఉద్యోగంలో సరైన పనితీరు కనబరచని కారణంగా వీరిని తొలగించినట్లు తెలిపింది. కంపెనీ ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించే ఇంటర్నల్‌ ఫ్రెషర్‌ అసెస్‌మెంట్‌ (FA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించని 600 మంది ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘పరీక్షా పే చర్చ’.. గత ఐదేళ్లలో చేసిన ఖర్చెంతంటే?

పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తోన్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018 నుంచి ఇప్పటివరకు ఆరు ఈవెంట్లు జరగ్గా.. ఐదు ఎడిషన్లకు రూ.28 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!

భారీ భూకంపంతో (Earthquake) తుర్కియే, సిరియాల్లో కనీవినీ ఎరుగని ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. అయితే, ఇంతటి విపత్తును ముందే అంచనా వేయలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ.. దక్షిణ మధ్య తుర్కియే (Turkey), జొర్డాన్‌, సిరియా (Syria), లెబనాన్‌లలో భారీ భూకంపం సంభవించవచ్చని మూడు రోజుల ముందే నిపుణులు హెచ్చరించినట్లు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆసీస్‌ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్

ఆస్ట్రేలియాతో ఆడటమంటే విరాట్‌ కోహ్లీ (Virat Kohli)కి ఎంతో ఇష్టమని భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్ బంగర్‌ అన్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ వన్డేలతోపాటు టీ20ల్లో శతకం సాధించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అతి తీవ్రమైన ఐదు భూకంపాలివే..!

తుర్కియే(Turkey), సిరియా(Syria)లో నిమిషాల వ్యవధిలోనే వరుస భూకంపాలు చోటు చేసుకొన్నాయి. అమెరికా జియోలాజికల్‌ సర్వే అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 1,000-10,000 మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత భూకంపాల తీవ్రత, అక్కడ నివసించే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ అంచనాలను తయారు చేసింది. ఓ పక్క గడ్డకట్టుకుపోయే చలిలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు