Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Mar 2023 21:11 IST

1. పోడు భూములకు పట్టాలు.. శబరిమల, కాశీలో వసతి భవనాలు.. కేబినెట్‌ నిర్ణయాలివే!

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత స్థలం ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల చొప్పున సాయం అందించాలని, రెండో విడత గొర్రెల పంపిణీకి, పోడు భూముల పట్టాల పంపిణీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్‌ నిర్ణయాలను ఆర్థికమంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. యథాతథంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం రేపు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారాస ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్ష యథాతథంగా కొనసాగనుంది. ఈ దీక్షకు ఇవాళ మధ్యాహ్నం దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించగా.. వారితో భారాస జాగృతి సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం దిల్లీ వెస్ట్‌జోన్‌ డీసీపీ మౌఖికంగా దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో రేపటి దీక్షకు జాగృతి నేతలు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాహుల్‌ ‘పప్పూ’ అని వాళ్లకు తెలియదుగా.. కిరణ్‌ రిజిజు వ్యంగ్యాస్త్రాలు

బ్రిటన్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)..  భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ విదేశీ గడ్డపై ఆయన చేసిన వ్యాఖ్యలను భాజపా (BJP) నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) స్పందిస్తూ.. రాహుల్‌పై ఘాటు విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మేం భాజపాతోనే.. 2024లో కలిసే బరిలోకి..!

భాజపా(BJP)తో తమ పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే(AIADMK) వెల్లడించింది. 2024 ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని తెలిపింది. ‘తమిళనాడులో ఎన్డీఏ కూటమిని ఏఐఏడీఎంకే నడిపిస్తుంది’ అని ఆ పార్టీ సీనియర్ నేత డీ జయకుమార్ వెల్లడించారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో ఇరు పార్టీల మధ్య బంధం బీటలు వారేలా కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రిలయన్స్‌ నుంచి సాఫ్ట్‌ డ్రింక్స్‌.. మూడు రుచుల్లో మార్కెట్లోకి

ఒకప్పటి సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపాను (campa) రిలయన్స్‌ సంస్థ రీలాంచ్‌ చేసింది. ప్యూర్‌ డ్రింక్‌ గ్రూప్‌ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) గురువారం సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కాంపా కోలా, కాంపా లెమన్‌, కాంపా ఆరెంజ్‌ ఫ్లేవర్లలో ఈ డ్రింక్‌ లభించనుందని రిలయన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసిన ఈడీ

మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam)లో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ (CBI) అరెస్టు చేసిన తర్వాత బెయిల్ మంజూరు కాకముందే మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఆయన్ను అరెస్టు చేసింది. సిసోదియా ప్రస్తుతం తీహాడ్‌ జైలులో ఉంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భాజపాలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం చెప్పారంటే..?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కర్ణాటకలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల పార్టీ మార్పులు, చేరికలతో కన్నడ నాట రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే.. ప్రముఖ నటి, మాండ్య లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీశ్  భాజపాలో చేరనున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందిస్తూ.. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మళ్లీ అతడికే పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలి: బ్రాడ్‌ హాగ్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) వరుసగా రెండు ఓటములతో కుంగిపోయిన ఆస్ట్రేలియాను (IND vs AUS) స్టీవ్‌ స్మిత్  విజయపథంలో నడిపించాడు. మూడో టెస్టులో రెగ్యులర్‌ సారథి ప్యాట్ కమిన్స్‌ అత్యవసరంగా స్వదేశం వెళ్లడంతో వైస్‌ కెప్టెన్‌ స్మిత్  సారథ్యం వహించాడు. ప్రస్తుతం నాలుగో టెస్టుకు కూడా అతడే నాయకత్వం వహిస్తున్నాడు. మూడోటెస్టులో జట్టును అద్భుతంగా నడిపి గెలిపించిన స్మిత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇన్నాళ్లు ఇంటిపని చేశారుగా.. దానికీ చెల్లించాల్సిందే!: కోర్టు కీలక తీర్పు

కొందరు మహిళలు(women) కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ.. తమకు నచ్చినట్టుగా జీవితాన్ని డిజైన్ చేసుకుంటారు. వారి ఆర్థిక స్థిరత్వానికి ఢోకా ఉండదు. మరికొందరు కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేస్తారు. అనుక్షణం భర్తకు అండగా ఉంటూ..పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంటారు. కుటుంబమే లోకంగా జీవిస్తున్న వీరి  వివాహ బంధం ముక్కలైతే..! ఇన్నేళ్ల దాంపత్యంలో ఆర్థిక వివరాలు తెలిసుండకపోతే..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 81 క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. అణువిద్యుత్తు కేంద్రానికి పవర్‌ కట్‌..!

ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) క్షిపణుల వర్షం కురిపించింది. ఒక్క రోజులో వివిధ నగరాలపై 81క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ రక్షణశాఖ ధ్రువీకరించింది. తాము 34 క్షిపణులను, షాహిద్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. రష్యా ల్వీవ్‌పై చేసిన రాకెట్‌ దాడిలో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు డెనిప్రోపెట్రోవస్క్‌ పై జరిగిన క్షిపణి దాడిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని