Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 25 Mar 2023 14:14 IST

1. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకి గట్టి షాక్‌ తగిలింది. తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెదేపా మరోసారి తన సత్తా చాటినట్లయింది. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా..  శాసనసభలో తనకున్న బలాన్నిబట్టి తెదేపా ఒక అభ్యర్థిని మాత్రమే పోటీకి నిలబెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతో తనను లాగుతున్నారని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుజేసే విధంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. విజయం సాధించిన అనురాధను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. సీఎం జగన్‌పై విరుచుకు పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TSRTC ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’!

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ను అమలు చేయాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డితో కలిసి ఎండీ సజ్జనార్‌ సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ముగిసింది. ఇక, ఐపీఎల్‌ (IPL) సందడి షురూ కానుంది. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 (IPL-16) సీజన్‌ దాదాపు రెండు నెలలపాటు అలరించనుంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో తమ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోనున్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఐపీఎల్‌లో 22.73 సగటుతో 341 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేస్తాడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌కు కొత్త అప్‌డేట్‌.. ఫీచర్లు ఇవే..

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను (Whatsapp) మొబైల్‌లో వాడే వారే అధికం. అయితే, నిత్య జీవితంలో భాగమయ్యాక ఆఫీసు సమయాల్లోనూ దీన్ని వాడడం అనివార్యంగా మారింది. దీంతో డెస్క్‌టాప్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ తన డెస్క్‌టాప్‌ యాప్‌ను (Whatsapp desktop) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా కొత్త విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?

‘మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు’ అంటూ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం.. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30రోజుల గడువిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనపై లోక్‌సభ ఎంపీగా (MP) అనర్హత వేటు పడుతుందా? అనే అంశం చర్చనీయాంశమయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన

కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలో అధికారంలో ఉన్నవారు పావులుగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ముఖ్యంగా సీబీఐని రాజకీయ కక్ష్య సాధింపుల కోసం కేంద్రంలో సర్కారు వాడుకుంటోందని ఆరోపిస్తుంటాయి. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) విచారణలను కొన్ని రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. ఇందుకోసం సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికా నౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేశాం..!

అమెరికా(USA)కు చెందిన గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ మిలియూస్‌ను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేసినట్లు గురువారం బీజింగ్‌ ప్రకటించింది. తమ ప్రాదేశిక జలాల్లోకి  ఇది అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ప్రశాంతంగా ఉన్న వాణిజ్య మార్గంలో శాంతి, స్థిరత్వానికి భంగం వాటిల్లేలా అమెరికా యుద్ధనౌకలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. దీంతో అమెరికా నౌకను తమ జలాలకు దూరంగా పంపించామని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బిజినెస్‌, పర్యాటక వీసాపైనా ఇంటర్వ్యూలకు హాజరవ్వొచ్చు

అమెరికాకు పర్యాటక, బిజినెస్‌ వీసాపైనా దేశంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు సైతం హాజరవ్వొచ్చని ఇక్కడి ఫెడరల్‌ ఏజెన్సీ వెల్లడించింది. బి-1, బి-2 వీసాదారులకు ఈ అవకాశం ఉందని స్పష్టంచేసింది. అయితే, ఉద్యోగాల్లో చేరే ముందు మాత్రం వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. బి-1, బి-2 వీసాలను ‘బి వీసాలు’గా పేర్కొంటారు. అమెరికాలో పర్యటన కోసం ఈ వీసాలు జారీ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని