Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్‌ 10 న్యూస్‌: ఈనాడు. నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 Sep 2022 21:05 IST

1. గీత దాటితే రూ.100 కట్టాల్సిందే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కొత్త నిబంధనలు

భాగ్యనగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు దఫాలుగా ట్రాఫిక్‌ విభాగం అధికారులతో సమావేశమైన సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ‘రోప్‌’ (రిమూవల్‌ ఆప్‌ అబ్‌స్ట్రిక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. డిసెంబర్ నాటికి మరో 432 కొత్త 104 వాహనాలు: సీఎం జగన్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెనూ తయారు చేసి రోగులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తోన్న ఆహారం నాణ్యతపై ఆరా తీశారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. ఆ నలుగురిని మేజర్లుగా పరిగణించిన కోర్టు

జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు: అనురాధ

అంగన్వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌-2) (పదోన్నతి పరీక్ష) నియామకం నోటిఫికేషన్‌ రద్దు చేశామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. నోటిఫికేషన్‌ రద్దు చేసేందుకు సీఎం జగన్‌ కూడా అంగీకరించారని చెప్పారు. న్యాయనిపుణుల సలహా మేరకు నోటిఫికేషన్‌ రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఫలితాలను నిలుపుదల చేశామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సీరియస్‌నెస్‌ లేని వ్యక్తి రాహుల్‌.. రాజకీయాలకు పనికిరారు!

భూస్వామిలా వ్యవహరిస్తారని, సీరియస్‌నెస్‌ లేని వ్యక్తి అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విమర్శలు చేశారు. బాధ్యత లేకుండా అధికారం కావాలని కోరుకుంటారని, రాహుల్‌ రాజకీయాలకు సరిపోరని వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న హిమంత 2015లో భాజపాలో చేరిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. తప్పు జరిగింది.. బేషరతుగా క్షమాపణ చెబుతున్నా: శశిథరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష ఎన్నిక కోసం ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో తీవ్రమైన తప్పిదం చోటుచేసుకుంది. మేనిఫెస్టోలో ప్రచురించిన భారత మ్యాప్‌లో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ లేకపోవడం పెను దుమారానికి కారణమైంది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఖర్గే’నే ఎందుకు..? అధిష్ఠానానికి అంత విధేయుడా..?

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన తర్వాత  శశిథరూర్‌తో  పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీపడతారని అందరూ భావించారు. కానీ, ఇవాళ ఉదయం అనూహ్యంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు మద్దతు తెలుపుతూ అధ్యక్ష రేసు నుంచి వైదొలగుతున్నట్లు దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దృష్టంతా ఖర్గేపై పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తర్వాతి అరెస్టు ఎంపీ రాఘవ్‌ చద్దాదే.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఆమ్‌ ఆద్మీ మధ్య పోరు గట్టిగానే నడుస్తోంది. గుజరాత్‌లో ఆప్‌కు వస్తోన్న ఆదరణ చూసి భాజపా భయపడుతోందని, అందుకే తమ పార్టీ నేతలను అరెస్టు చేయిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే పలుమార్లు కాషాయ పార్టీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ అరెస్టులపై స్పందిస్తూ కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఉక్రెయిన్‌లో 15% భూభాగం రష్యాలో విలీనం.. పుతిన్‌ అధికారిక ప్రకటన

దాదాపు ఎనిమిది నెలల నుంచి జరుగుతోన్న ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలు రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఉక్రెయిన్‌లోని ఈ నాలుగు ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. షావోమికి ఈడీ షాక్‌.. రూ.5,500 కోట్ల నిధులు సీజ్‌!

చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షావోమికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాకిచ్చింది. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ నిబంధనల ఉల్లంఘిన కింద ఆ కంపెనీకి చెందిన రూ.5,551 కోట్ల నిధులను సీజ్‌ చేసింది. ఈడీ చరిత్రలో ఇంత మొత్తంలో నగదును సీజ్‌ చేయడం ఇదే తొలిసారి. ఫెమా చట్టం కింద ఈ మొత్తాన్ని ఏప్రిల్‌ 29నే ఈడీ జప్తుచేసి కాంపిటెంట్‌ అథారిటీకి ఆమోదం కోసం పంపగా.. తాజాగా అథారిటీ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని