Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 22 May 2022 20:57 IST

1. పంజాబ్‌ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలు రద్దు చేసే వరకు పంజాబ్‌ రైతులు పోరాడారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్‌లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు దిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌లతో కలిసి కేసీఆర్‌ ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. రైతు ఉద్యమంలో మృతిచెందిన 600 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందజేస్తామని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు.

2. ఇంధన ధరల తగ్గింపు పేరుతో ప్రభుత్వం వంచన

గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. భారీ స్థాయిలో తగ్గించామని పేర్కొంటూ భాజపా వంచనకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం ఆపాలని.. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోన్న ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు నిజమైన ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

3. సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. సీఎంతో గౌతమ్‌ అదానీ వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనకు జ్ఞాపికను అందజేశారు.


Video: డాన్ బాస్‍పై దృష్టి సారించిన రష్యా సేనలు


4. టెస్టుల్లోకి మళ్లీ ఛెతేశ్వర్‌.. టీ20ల్లోకి వచ్చేసిన ఉమ్రాన్‌ మాలిక్

గతేడాది ఇంగ్లాండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టుతోపాటు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమ్ఇండియా జట్లను బీసీసీఐ ప్రకటించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాకు విశ్రాంతినిచ్చింది.  టీ20 లీగ్‌లో హైదరాబాద్‌కు ఆడిన ఉమ్రాన్‌ మాలిక్‌కు టీ20 జట్టులో అవకాశం కల్పించింది. అలానే సీనియర్‌ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా టెస్టు జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే అజింక్య రహానెకు అవకాశం దక్కలేదు.  అలానే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యను కాకుండా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసింది.

5. ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి అభివృద్ధిని చూడండి..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శలు గుప్పించారు. రాహుల్‌ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని ఎద్దేవా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని నమ్సాయి జిల్లాలో రూ.వెయ్యి కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

6. ఆస్ట్రేలియా ఎన్నికలు.. లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది!

ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారిగా ఎన్నికల్లో గెలుపొందింది. కాగా ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా ఆ దేశంలోని 1.70 కోట్ల మంది ఓటర్లలో 48శాతంపైగా ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

7. యాపిల్‌ చూపు భారత్‌వైపు?

కరోనా కట్టడి నిమిత్తం చైనాలో ఇటీవల కఠిన లాక్‌డౌన్‌లు విధించారు. ఫలితంగా యాపిల్‌ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. దీంతో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు కంపెనీ తమ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ విషయంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌, వియత్నాంపై యాపిల్‌ దృష్టి సారించినట్లు సమాచారం.


Video: చైనా అక్రమ వేట..టోక్యోలో క్వాడ్ దేశాల కూటమి సదస్సు


8. లొజొవపై రష్యా భారీ దాడి..!

ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలోని లొజొవ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ శుక్రువారం జరిగిన భీకర దాడిలో దాదాపు 1000 అపార్ట్‌మెంట్లు, 11 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని ఆ నగర మేయర్‌ షెర్హీవ్‌ జెలెన్‌స్కీ వెల్లడించారు.  కూలిన వాటిలో 5 పాఠశాలలు, ఒక ఆసుపత్రి కూడా ఉన్నట్లు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన ఖర్కీవ్‌ ఆటోమొబైల్‌ అండ్‌ రోడ్‌ కాలేజ్‌ భవనం కూడా ఉంది.

9. మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి బీజింగ్‌

చైనా రాజధాని బీజింగ్‌ మరోసారి కఠిన ఆంక్షల పరిధిలోకి వెళ్లింది. జీరో కొవిడ్‌ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి మరోసారి నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. చైనా ఎన్ని ఆంక్షలు విధించినా కొత్త ప్రదేశాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో మరిన్ని నగరాలు లాక్‌డౌన్‌ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్‌, చావోయాంగ్‌,ఫెంతాయ్‌,షన్‌యి, ఫాంగ్‌షాన్‌ జిల్లాలో ఆంక్షలు అమల్లో ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

10. ఇన్ఫోసిస్‌ సీఈఓగా వరుసగా రెండోసారి సలీల్‌ పరేఖ్‌!

ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీగా తిరిగి సలీల్‌ పరేఖ్‌ను నియమిస్తున్నట్లు ఆదివారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వ్యవస్థాపక సభ్యులు కాకుండా వరుసగా రెండోసారి కంపెనీ సీఈఓగా ఎంపికైన తొలి వ్యక్తిగా సలీల్‌ గుర్తింపు పొందారు. ఆయన నియామకానికి ఇంకా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని