Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. IND vs SA: గెలుపు ధీమాతో టీమ్ఇండియా.. ఇక సఫారీతో సై..
ఆసియా కప్లో ఫైనల్కు చేరకుండానే వెనుదిరిగిన టీమ్ఇండియా.. ఆపై పుంజుకుంది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై సిరీస్ను సొంతం చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టీ20ల సిరీస్కు సిద్ధమైంది. అయితే ఆసీస్పై సిరీస్ గెలిచినప్పటికీ.. భారత జట్టులోని పలు లోపాలు తేటతెల్లమయ్యాయి. అందుకే ప్రపంచకప్కి ముంగిట సఫారీ జట్టుతో జరగబోయే ఈ పోరు ఎంతో కీలకం కానుంది. ప్రపంచకప్లో పైచేయి సాధించాలంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. అధ్యక్ష పదవి రేసులో గహ్లోత్, థరూర్.! ఎవరి బలమెంత?
రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పటికీ.. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఈనెల 30న నామినేషన్ సమర్పించనున్నారు. మరోవైపు గహ్లోత్ అధ్యక్ష పదవి బరిలో నిలుస్తారా?లేదా? అనేదానిపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఆయన్ను బరిలోకి దించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి బలాబలాలేంటో ఓ సారి చూద్దామా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3. స్వరం మారలేదు.. రాజీనామాపై వెనక్కి తగ్గేదిలేదు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం ఇష్టం లేకే పదవులకు రాజీనామా చేశానని మాజీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడతూ రాజీనామాపై తన స్వరం మారలేదని, వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. పదవులు లేకపోయినా భాషాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం కారణంగానే పేరు మార్పు ఇష్టం లేక రాజీనామా చేశారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. ‘గాడ్ ఫాదర్’ పవర్ఫుల్ సాంగ్ వచ్చేసింది.. !
చిరంజీవి (Chiranjeevi) హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్ ఫాదర్’ (God Father). ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే తొలి పాటను పంచుకోగా ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేసింది. ‘నజభజ’ (Najabhaja) అనే ఈ పాటను యాక్షన్ నేపథ్యంలో చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని వివరించే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. పార్టీ హైకమాండ్ని ఎప్పుడూ ఛాలెంజ్ చేయను.. సోనియాకు గహ్లోత్ ఫోన్!
రాజస్థాన్(Rajasthan)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హైడ్రామా తర్వాత తొలిసారి సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gehlot) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో మాట్లాడారు. ఈ మేరకు ఆమెకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ను తాను ఎప్పుడూ ఛాలెంజ్ చేయనని ఈ సందర్భంగా గహ్లోత్ ఆమెతో చెప్పినట్టు సమాచారం. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్లో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో ఆయన నిలుస్తారా? లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
6. Carl Gustaf M4: భారత్లో కార్ల్ గుస్తాఫ్ ఆయుధ వ్యవస్థల తయారీ..!
ఇంటర్నెట్డెస్క్: స్వీడన్కు చెందిన అత్యున్నత శ్రేణి రక్షణ రంగ సంస్థ ‘సాబ్’ భారత్లో తయారీని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోర్జెన్ జాన్సన్ ధ్రువీకరించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ మరే దేశంలోనూ తయారీ విభాగాలను ఏర్పాటు చేయలేదు. ఈ తయారీ విభాగంలో కార్ల్ గుస్టాఫ్ ఎం4 ఆయుధ వ్యవస్థలను నిర్మించనున్నారు. 2024 నుంచి వీటిని తయారీ ప్రారంభమవుతుందని జాన్సన్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
7. జిన్పింగ్ గృహనిర్బంధం వార్తలకు చెక్.. !
చైనా అధ్యక్షుడు, శక్తిమంతమైన నేతగా పేరుపొందిన జిన్పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల వినిపించిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు వెళ్లి వచ్చిన ఆయన్ను నిర్బంధించారన్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. ఆయన ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరుకావడమే అందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
8. IMEI మోసాలకు కేంద్రం చెక్.. మొబైల్ కంపెనీలకు కీలక ఆదేశాలు!
పోయిన, దొంగిలించిన స్మార్ట్ఫోన్లతో పాల్పడే మోసాలకు చెక్పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ తయారీ కంపెనీలు ప్రతి మొబైల్ IMEIని ప్రత్యేక పోర్టల్లో (https://icdr.ceir.gov.in) నమోదు చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశీయంగా మొబైళ్లు విక్రయించే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఈ పని పూర్తి చేయాలని సూచించింది. మొబైల్ను విక్రయించే ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
9. ఠాక్రేకు సుప్రీం షాక్.. అసలైన ‘శివసేన’పై నిర్ణయం ఈసీదే
శివసేన (Shiv Sena)లో చీలిక జరిగిన తర్వాత నుంచి ఆ పార్టీపై హక్కుల కోసం జరుగుతున్న పోరులో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde) చేసిన వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చింది.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
10. Russia: రష్యా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది..?
ఉక్రెయిన్పై యుద్ధాన్ని (Ukraine Crisis) మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సైనిక సమీకరణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైన్యంలో చేరాలంటూ పౌరులకు ఆదేశాలు వెళ్తున్నాయి. దీంతో భయాందోళనలకు గురవుతోన్న రష్యన్లు సమీప దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలైన జార్జియా, ఫిన్లాండ్తోపాటు వీసా అవసరం లేని ఆర్మేనియా, టర్కీ, అజర్బైజాన్ దేశాలకు క్యూ కడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.