Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Aug 2022 21:05 IST

1. భారత్‌కు పతకాల పంట..

కామన్వెల్త్‌ క్రీడల్లో చివరి రోజు భారత్‌ అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో అటు పీవీ సింధు, ఇటు లక్ష్యసేన్‌ బంగారు పతకాలు సాధించిన అనంతరం మరో నాలుగు పతకాలు సొంతమయ్యాయి. అందులో బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లైన బెన్‌ లేన్‌, సీన్‌ వెండీల జోడీపై వరుసగా..

2. కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీ మార్పు

తెలంగాణలో కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 28న నిర్వహించాలని తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించింది. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్టు పేర్కొంది. తెలంగాణలో ఆగస్టు 7న (ఆదివారం) ఎస్సై  రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

3. ఆ కక్షతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం

హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ప్రసాద్ భార్య సర్పంచి పదవి పోవడం, పెండింగ్‌లో ఉన్న రూ.20లక్షలు మంజూరు కాకపోవడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని భావించిన ప్రసాద్‌ కక్ష పెంచుకొని హత్యకు కుట్ర పన్నాడని డీసీపీ వెల్లడించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ మీడియాకు వివరించారు.

4. కాలి నొప్పి ఉందని భయపడ్డాం..

ఇంటర్నెట్‌డెస్క్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూ విశ్వవేదికపై మరోసారి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లీ లీపై జయభేరి మోగించి స్వర్ణం సాధించడం పట్ల దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో సింధూ పసిడిని ముద్దాడటంతో ఆమె తల్లిదండ్రులు తమ ఆనందాన్ని ‘ఈటీవీ’తో పంచుకున్నారు.

5. రేపే మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ..!

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే తన మంత్రిమండలిని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఆగస్టు 9 (మంగళవారం)న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భాజపాకు చెందిన ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. అయితే మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. మహారాష్ట్ర మంత్రిమండలిపై ఇప్పటికే కసరత్తు పూర్తికాగా..

6. చైనాకు భారత్‌ మరో షాక్‌.. ఆ మొబైళ్లపై నిషేధం...?

చైనాకు చెందిన యాప్స్‌పై ఉక్కుపాదం మోపిన కేంద్రం.. మరో ఝలక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల (Chinese mobiles) దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ₹12వేల రూపాయల్లోపు ధరలో మొబైళ్లను విక్రయించకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

7. ఆ రోజు నా కళ్లలో నీళ్లు తిరిగాయి: వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు. ‘‘సభ్యులు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. సభా కార్యకలాపాల్ని ప్రజలందరూ గమనిస్తుంటారు.

8. రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ సమాధానమేంటంటే..?

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ నేడు తమిళనాడు గవర్నర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. రజనీ మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. తనకు అలాంటి ఆలోచనేదీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

9. సూర్యుడి ఉగ్రరూపం! అసలేం జరుగుతోంది..?

సూర్యుడిపై ఏం జరుగుతోంది! సమస్త జీవరాశికి మూలమైన ఈ నక్షత్రంపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు, 14 సన్‌స్పాట్‌లు‌, ఆరు సౌర జ్వాలలు సంభవించాయి. వాటిలో కొన్ని నేరుగా భూమినీ తాకాయి! అయితే.. ‘సౌర చక్రం(Solar Cycle)’ గరిష్ఠ స్థాయికి సమీపిస్తుండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

10. మంత్రులకు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. సామాన్యులకు ఇస్తే తప్పేంటి..?

ఉచిత పథకాలపై భాజపాకు, ఆమ్ఆద్మీ పార్టీకి మధ్య వార్‌ మొదలైనట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని