Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం..

Published : 17 May 2022 16:58 IST

1. Mystery Hepatitis: చిన్నారుల్లో ఆ మిస్టరీ వ్యాధికి కరోనానే కారణమా..?

కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటోన్న పలు దేశాలను ఇటీవల ఓ అంతుచిక్కని కాలేయ వ్యాధి కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఐరోపా, అమెరికా చిన్నారుల్లో వెలుగు చూస్తోన్న కాలేయ వ్యాధిపై కారణాలను విశ్లేషిస్తున్నప్పటికీ అది ఒక మిస్టరీగానే మారింది. అయితే, దీనిపై ఇప్పటికే ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుర్తించని కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల సంభవించే దుష్ప్రభావాలు పిల్లల్లో తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.

2. బీపీపై సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: హరీశ్‌రావు

కొవిడ్‌ తర్వాత బీపీ బాధితులు పెరుగుతుండటంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రపంచ అధిక రక్తపోటు దినం సందర్భంగా హైదరాబాద్‌లో గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీపీ బాధితుల సంఖ్యపై గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌, కార్డియోలజికల్ సొసైటీ సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.

రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

3. తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌!

ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గువాహటి రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియమించనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది.

4. ఈ ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒకే యూనిట్‌లో సౌర, పవన, హైడల్‌ విద్యుదుత్పాదన జరుగుతుందని.. ఈ ప్రాజెక్టు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని తగ్గించే ఈ ప్రాజెక్ట్‌ దేశానికి సరికొత్త మార్గం చూపుతుందన్నారు. 

5. వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్‌ రెడ్డి, బీద మస్తాన్‌రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. 

జగన్‌తో భేటీ రాజ్యసభ సీటు కోసం కాదు : ఆర్‌.కృష్ణయ్య

6. కోల్‌కతాలో అభిషేక్‌ బెనర్జీ విచారణ.. ఆటంకం కలిగిస్తే ఊరుకోం: సుప్రీం

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో వీరిని అరెస్టు చేయకుండా సర్వోన్నత న్యాయస్థానం రక్షణ కల్పించింది. అంతేగాక, వీరిద్దరినీ కోల్‌కతాలోనే ప్రశ్నించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఈ విచారణకు బెంగాల్‌ ప్రభుత్వం ఆటంకం కలిగించాలని చూస్తే మాత్రం సహించేది లేదని న్యాయస్థానం హెచ్చరించింది.

7. నాటో సభ్యత్వంపై ఎర్డగాన్‌ బేరం..?

ఐరోపా ఖండంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. స్వీడన్‌, ఫిన్లాండ్‌ దశాబ్దాల తరబడి తటస్థంగా ఉన్నా.. ప్రస్తుత రష్యా చర్యలతో భయపడి నాటోలో చేరేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. ఇప్పుడు టర్కీ వాటి చేరికను అడ్డుకొనేందుకు యత్నాలు మొదలుపెట్టింది. నాటో కూటమిలో చేరాలంటే ప్రతిఒక్క సభ్యదేశం ఆమోదముద్ర వేయాల్సిందే. దీంతో టర్కీ ఓటు కూడా అత్యంత కీలకం

8. మార్కెట్లకు లాభాల జోష్‌..!

లోహ, ఇంధన, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లు రాణించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1344.63 పాయింట్ల భారీ లాభంతో 54,318.47 వద్ద ముగిసింది. నిఫ్టీ చివరకు 438.15 పాయింట్లు లాభపడి 16,280.45  వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.47 వద్ద ట్రేడవుతోంది.

9. వాటిని గమనించే జగన్‌ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చినా.. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం సీఎం జగన్‌కు అర్థమవుతోందని చెప్పారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

వాస్తవం చెబితే దాడి చేస్తారా..?: లోకేశ్‌

10. వీగిన అవిశ్వాస తీర్మానం.. అధ్యక్షుడు గొటబాయకు ఊరట

తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శ్రీలంక పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి కారణంగా పేర్కొంటూ గొటబాయ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతోన్న వేళ తాజా పరిణామం అధ్యక్షుడికి ఉపశమనం కలిగించినట్లయ్యింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని