Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Mar 2023 09:31 IST

1. క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న పేదలు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు గడువు జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 2, 2020కి పొడిగించడంతో వందల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దీంతో నగరంలోని ఫిలింనగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో నివాసముంటున్న వారిలో దాదాపు 90శాతం మంది అర్హులు కానున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికీ ఊరట కలగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏటీఎంల్లో రూ.2,000 నోట్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు లేవు

ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్ల (ఏటీఎంల)లో రూ.2,000 నోట్లను ఉంచడం/ఉంచకపోవడంపై బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆయా బ్యాంకులు వాటి ఎంపిక ప్రకారం మేరకు ఏటీఎంల్లో పెద్ద నోట్లను ఉంచడం లేదా ఉంచకపోవడం జరుగుతోందని సోమవారం ఆమె పార్లమెంటుకు తెలియజేశారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు

విశాఖ మెట్రోరైలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘మెట్రోరైలు వ్యవస్థను ప్రణాళికా బద్ధంగా అమలుచేసి సుస్థిరంగా మార్చేందుకు మెట్రోరైల్‌ పాలసీ-2017ను రూపొందించాం. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్‌ మ్యూజియం

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో భద్రపరిచిన అరుదైన వస్తువులు, చిత్రాలు, నిక్షిప్తంచేసిన చరిత్రను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు. ‘గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌’ ప్రాజెక్టులో భాగంగా వీటిని అంతర్జాలంలో అందుబాటులో ఉంచినట్లు మ్యూజియం డైరెక్టర్‌ ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు. మ్యూజియం సందర్శనకు సమయం లేనివారికి ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వివరించారు. డిజిటల్‌ వెర్షన్‌లో అరుదైన, పురాతన శిల్పాలు, చిత్రాలు, రాజులు ధరించిన వినూత్న దుస్తులు, మను స్క్రిప్ట్‌లు, సిరామిక్స్‌, హస్తకళలను ప్రదర్శిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!

వారిద్దరి పేర్లు ఒకటే. తల్లిదండ్రులు, మండలాల పేర్లు మాత్రం వేరు. బ్యాంకర్లు వీటిని సరిచూసుకోకుండానే ఒకరికి రుణం ఇచ్చేయడం ఓ సామాన్యుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఇది చాలదన్నట్లు పాన్‌, రేషన్‌ కార్డులతో ఎవరో అతని పేరిట 38 బ్యాంకు ఖాతాలు తెరవడంతో బాధితుడు హతాశుడయ్యారు. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం... పెద్దేముల్‌కు చెందిన మంగలి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర

 ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఫస్టియర్‌ విద్యార్థులకు గణితం- 1ఏ, పొలిటికల్‌ సైన్స్‌, బోటనీ పరీక్షలు జరిగాయి. గణితం తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్నలో చతుర్ముఖి బదులు చతుర్ముఖ అని ప్రచురితమైంది. రాజనీతిశాస్త్రం తెలుగు మాధ్యమం పేపర్‌ 17వ ప్రశ్నలో సంబంధం బదులు బేధాలు అని, ఆంగ్ల మాధ్యమంలో రిలేషన్‌షిప్‌ విత్‌ బదులు డిఫరెంట్‌ ఫ్రం అని తప్పుగా ముద్రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఓయూలో పీహెచ్‌డీ ఫీజులు భారీగా పెంపు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక (పీహెచ్‌డీ) విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఫీజును రూ.2,500 నుంచి రూ.25 వేలకు.. ఆర్ట్స్‌, లా కేటగిరీల్లో రూ.20 వేలకు పెంపుదల చేశారు. సంబంధిత రుసుములను ఒకేసారి భారీగా పెంచడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలకు పోటీగా ఓయూ అధికారులు ఫీజులను పెంచారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వాతావరణ మార్పులపై సమయం మించిపోతోంది

పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న కీలక లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు అందుకోలేకపోవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ- ఐపీసీసీ హెచ్చరించింది. అయితే ఈ దశాబ్దంలో శరవేగంగా చేపట్టే ఉపశమన చర్యలతో ఈ పరిస్థితిని నివారించొచ్చని తన తాజా ‘సింథసిస్‌ రిపోర్ట్‌’లో పేర్కొంది.  1.5 డిగ్రీల సెల్సియస్‌ లక్ష్య సాధనకు అన్ని రంగాల్లోనూ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల తగ్గింపు వేగంగా, నిరంతరంగా సాగాలని తేల్చిచెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!

చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి. నోట్ల రద్దు అనంతరం కొన్నేళ్ల పాటు తగ్గినా ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. దందాతో చిరువ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో వెలుగుచూస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆర్‌ఆర్‌ఆర్‌లో జగన్‌ను పెట్టుంటే ఆస్కార్‌ వచ్చేది

‘సొంత బాబాయ్‌ను వారే హత్యచేసి చంద్రబాబు చంపారంటూ నిందలు వేశారు. వాళ్ల కుటుంబ ప్రమేయమే ఉందని సీబీఐ విచారణలో తేలడంతో ఒక కంటిని ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని అసెంబ్లీలో నటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రాజమౌళి జగన్‌మోహన్‌రెడ్డిని పెట్టుంటే ఆ నటనకు కచ్చితంగా ఆస్కార్‌ అవార్డు వచ్చేది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా 48వ రోజు శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని