Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Mar 2023 09:25 IST

1. ఆరు రుచులూ ఆస్వాదిద్దాం!

ఉగాది అంటే కొత్త సంవత్సరానికి మొదటి రోజు. యుగ అంటే జంట అనే అర్థమూ ఉంది. అది స్త్రీ పురుషుల జంట.. పగలు-రాత్రి.. సుఖం-దుఃఖం.. ఏదైనా కావచ్చు. మొత్తానికి జీవితంలో అన్నీ ఉండాల్సిందే! జీవన ప్రయాణంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వాగతించాలని, ప్రతి దశనూ ఆస్వాదించాలన్నదే ఇందులో ఉన్న అర్థం. మోడుబారిన కొమ్మలు చిగురాకులను తొడుగుతూ.. నిరాశా నిస్పృహలకు చోటివ్వకూడదు.. పోరాటమే లక్ష్యమని సూచిస్తుందీ పండగ. మరి మనమంతా ఆ స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామా మరి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 24, 25 తేదీల్లో మళ్లీ వర్షాలు

ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని పేర్కొంది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత

మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ మంగళవారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె వయసు 89 ఏళ్లు. గత ఐదేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధికి గతంలో ఆమె ఛైర్‌ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్‌ ఆశ్రమంలో గోకనీ బాల్యం గడిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హ్యుందాయ్‌ వెర్నా కొత్త వెర్షన్‌

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ వెర్నాలో కొత్త వెర్షన్‌ను మంగళవారం దేశీయంగా పరిచయం చేసింది. వీటి ధరల శ్రేణి రూ.10.89-17.37 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. 1.5 లీటర్‌ ఇంజిన్‌ కలిగిన 6వ తరం వెర్నా ధరలు రూ.10.89-16.19 లక్షలు కాగా, 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.14.83-17.37 లక్షల (అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉన్నాయి. ఈ కార్లు ఇంజిన్‌ ఆధారంగా, లీటరుకు 18.6-20.6 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయని కంపెనీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ ఏడాది వేతన పెంపు 10.2%!

దేశంలో ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 2022తో పోలిస్తే 10.2 శాతం ఎక్కువగా ఉండొచ్చని ఈవై నివేదిక వెల్లడించింది. ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ పే 2023’ పేరుతో రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఇ-కామర్స్‌, వృత్తి సేవలు, ఐటీ రంగాల్లో వేతనాలు అధికంగా పెరగొచ్చని అభిప్రాయపడింది. గత ఏడాది సరాసరి వేతన పెంపు 2021తో పోలిస్తే 10.4 శాతం అధికంగా ఉండటం గమనార్హం. బ్లూ కాలర్‌ ఉద్యోగాలు కాకుండా మిగతా అన్ని ఉద్యోగ స్థాయుల్లో వేతన పె2ంపు ఈ ఏడాది తక్కువగానే ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నామని.. ఆ ప్రయత్నాలకు దాదాపు ఒక రూపు వచ్చిందని కోచ్‌ భారత్‌ క్రికెట్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఇప్పటికే స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో మూడేసి వన్డేలు ఆడిన భారత్‌.. ఆస్ట్రేలియాతోనూ అన్నే వన్డేల్లో తలపడుతోంది. ‘‘ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిసిన తర్వాత ప్రపంచకప్‌లో భారత్‌ మేళవింపుపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాయిస్‌ స్టేటస్‌ వాడారా?

వాట్సప్‌ నిరంతరం కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇటీవల వాయిస్‌ స్టేటస్‌ను షేర్‌ చేసే సదుపాయమూ కల్పించింది. దీని ద్వారా వాయిస్‌ క్లిప్‌ను స్టేటస్‌ అప్‌డేట్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఇది మన కాంటాక్టు జాబితాలో ఉన్న అందరికీ కనిపిస్తుంది. వాయిస్‌ స్టేటస్‌ షేరింగ్‌ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మన గురించి మరింత స్వేచ్ఛగా, సృజనాత్మకంగా వ్యక్తీకరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరికొత్తగా ఎంగేజ్‌ కావొచ్చు. ఇతరులకు భిన్నంగా, ఆసక్తికరంగా మన ప్రత్యేకతను చాటుకోవచ్చు. మరి వాయిస్‌ స్టేటస్‌ను ఎలా షేర్‌ చేసుకోవాలో తెలుసుకుందామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సంస్కరణల బాటలో టీఎస్‌పీఎస్సీ

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ భారీ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. కమిషన్‌ను పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్తులో లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగుల నియామకాలు, ఉద్యోగుల ప్రవర్తన నియామావళి, పోటీ పరీక్షల నిర్వహణ, సైబర్‌ సెక్యూరిటీ వరకు భారీ మార్పులు జరగనున్నాయి. గత మూడు రోజులుగా కమిషన్‌ ఈ మేరకు చర్చలు నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లబ్ధిదారులకు ఎదురు చూపులే..!

జిల్లాలో నిరుపేద వర్గాలకు జగనన్న కాలనీల్లో గృహాలను ప్రభుత్వం మంజూరు చేయగా నిర్మాణాలు కొలిక్కి రావడం లేదు. ఎప్పటికపుడు గృహ ప్రవేశాల తేదీలను నిర్ణయించడం.. తీరా ఆరోజు వచ్చే నాటికి మరో తేదీకి వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఉగాది పండగ రోజైన మార్చి 22న జిల్లాలో 13,341 గృహాలను నిర్మించి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. నిర్ణీత గడువు నాటికి ఎక్కువ ఇళ్లను నిర్మించ లేకపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. 

మానవుడు పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్‌కు వచ్చింది. దాన్ని ఆచరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది ఆయన విశ్వాసం. జోసెఫ్‌ అలియాస్‌ ‘డాక్టర్‌ డీప్‌ సీ’ 28ఏళ్లపాటు అమెరికా నౌకాదళంలో పనిచేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడాలో చదివారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని