Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jun 2021 09:05 IST

1. క్రికెట్‌ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌

 బిహార్‌ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఐజీఐఎంఎస్‌)లో 60 ఏళ్ల వ్యక్తి మెదడు నుంచి క్రికెట్‌ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్‌ఫంగస్‌ (మ్యూకర్‌మైకోసిస్‌)ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. జుమాయికి చెందిన అనిల్‌కుమార్‌కు డాక్టర్‌ బ్రజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్యబృందం గత శుక్రవారం మూడు గంటలపాటు ఈ శస్త్రచికిత్స చేసింది. బాధితుడి పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: కొంపముంచిన ‘కొవిడ్‌’ ఉత్తీర్ణత!

2. అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వండి: రఘురామ

ఏపీలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం విడుదల చేయాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు సీఎంకు వరుసగా ఐదో లేఖ రాశారు. ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జగన్‌కు రఘురామ లేఖలు రాస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితుల‌కు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. T Cell: వైరస్‌ ‘టి’క్క కుదిర్చే కణాలు!

వైరస్‌ సోకడం లేదా టీకా పొందడం వల్ల మన శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. అయినా వైరస్‌లు తెలివిగా వీటి కళ్లుగప్పుతుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మన రోగనిరోధక వ్యవస్థలోని టి కణాలు.. ఇలాంటి ఎత్తులను చిత్తు చేస్తాయని తెలిపారు. మానవ కణంలోకి ప్రవేశించిన వైరస్‌.. దాన్ని ఒక కర్మాగారంలా ఉపయోగించుకుంటూ స్వీయ ప్రతులను తయారు చేసుకుంటుంది. ఆ తర్వాత కణాన్ని నాశనం చేసి, కొత్త కణాల్లోకి చేరి.. అక్కడా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: కల్యాణ సంక్షోభమే!

4. ఆ ఫొటోకు నాలుగు గంటలు పట్టింది...

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆమె చేతుల్లోకి తీసుకుంటే చాలు...  కెమెరా లెన్స్‌కు ఫోజులిచ్చేస్తారు. తను కూడా ఆ బోసినవ్వులను ఫ్రేంలో బంధించడానికి గంటల తరబడి ఎదురుచూసి మరీ తాననుకున్నది సాధిస్తుంది. పసిపిల్లల కేరింతలను ఫ్రేంలో బిగించి అందమైన జ్ఞాపకంగా అందిస్తుంది. ఆ సృజనాత్మకతకే ఇటీవల మెల్‌బోర్న్‌కు చెందిన ఓ సంస్థ నుంచి అవార్డుని అందుకుంది. ఆమే హైదరాబాద్‌కు చెందిన ముప్పైఏళ్ల మధు వెనిగెళ్ల. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా పాపం చైనాదేనా?

గురి తప్పని అస్త్రంలా దేశదేశాల్నీ చుట్టేసిన మహమ్మారి కరోనా వైరస్‌ విశ్వవ్యాప్తంగా 17.65 కోట్లమందికి సోకి సుమారు 38 లక్షల 12వేల నిండుప్రాణాల్ని కబళించేసింది. ఇంతగా మృత్యుపాశాలు విసరుతూ రెచ్చిపోయిన వైరస్‌ మానవ ప్రేరేపితమేనన్న కథనాలు, వుహాన్‌ ప్రయోగశాలే దాని పురిటిగడ్డ అన్న విశ్లేషణలు కొన్నాళ్లుగా ప్రపంచాన్ని కలవరపరుస్తూనే ఉన్నాయి. విధ్వంసక వైరస్‌ మూలాల గుట్టుమట్లు రట్టు కావాల్సిందేనంటూ నిరుడు గళమెత్తిన ఆస్ట్రేలియా మీద చైనా ఒంటికాలిపై విరుచుకుపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: ఎక్కడున్నాడు... ఎందుకు వచ్చాడు?

6. యువ తారకలతో కలిసి.. అనుభవం మెరిసి

‘‘చిన్నదో వైపు.. పెద్దదో వైపు’’ అంటూ కథానాయకులు ఇద్దరు భామలతో చిందేస్తుంటే.. చూసే సినీప్రియులకూ భలే ముచ్చటగా అనిపిస్తుంటుంది. అందుకే అవకాశమున్న ప్రతిసారీ సినిమాలో ఇద్దరేసి నాయికలకు చోటిచ్చే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇలా ఆడిపాడే భామలంతా సమవుజ్జీలే ఉంటారు. ఈ మధ్య కొత్త ఒరవడి కనిపిస్తోంది. సీనియర్‌ నాయికలు..యువతరం నాయికలు కలిసి సందడి చేస్తున్నారు. ఇప్పుడా కలయికలు ప్రేక్షకులకు కొత్త అనుభూతులు పంచుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. French Open: జకోనా మజాకా

తొలి రెండు సెట్లు పోయాయ్‌ ఇంకేం గెలుస్తాడులే అనే ఆలోచనలు! సిట్సిపాస్‌దే టైటిల్‌ అనే అంచనాలు! తర్వాత సెట్లోనే మ్యాచ్‌ అయిపోతుందేమో అన్ తలపులు! కానీ బరిలో ఉంది జకోవిచ్‌! ఎన్ని చూసుంటాడు.. ఎన్ని ఆడుంటాడు! ఒక్క అవకాశం...! అన్నట్లుగా కనిపించిన ఈ సెర్బియా యోధుడు ఆ ఛాన్స్‌ దొరకగానే చెలరేగిపోయాడు.. పాయింట్‌ పాయింట్‌కు బలాన్ని పెంచుకుంటూ.. ప్రత్యర్థిని బలహీనుడిగా మారుస్తూ కప్‌  ఎగరేసుకుపోయాడు! ఫ్రెంచ్‌ కోటలో మరోసారి తన జెండాను పాతేశాడు! టైటిల్‌ నం.19 సాధించేశాడు! కెరీర్‌లో అతడికిది రెండో ఫ్రెంచ్‌ ఓపెన్‌. 2016లో అతడు తొలిసారి ఈ టైటిల్‌ గెలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టీమ్‌ఇండియా చాలా ముందుకెళ్లిపోయింది

8. రూ.55,000 కోట్ల ఐపీఓలు

రానున్న కొన్ని నెలల్లో డజనుకు పైగా ఆర్థిక సేవల సంస్థలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే అవకాశం కన్పిస్తోంది. వీటిల్లో బీమా, మ్యూచువల్‌ ఫండ్‌, వాణిజ్య బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహ రుణాల సంస్థలు, చెల్లింపు బ్యాంకులు ఉండటం గమనార్హం. పబ్లిక్‌ ఇష్యూ కోసం  దరఖాస్తు పత్రాలను సెబీకి ఈ సంస్థలు సమర్పించాయి. అనుమతులు రావడమే తరువాయి. ఈ సంస్థలన్నీ కలిపి తొలి పబ్లిక్‌ ఆఫర్‌ల (ఐపీఓ) ద్వారా రూ.55,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం కన్పిస్తోందని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇంటర్‌తోనే అద్భుత భవిత!

తక్కువ విద్యార్హతతో అత్యుత్తమ భవిష్యత్తు అందించే పరీక్షలు కొన్నే ఉంటాయి. వాటిలో యూపీఎస్‌సీ  నిర్వహించే ఎన్‌డీఏ & ఎన్‌ఏ ముఖ్యమైంది. ఇంటర్‌  అర్హతతో నిర్వహించే ఈ పరీక్షలో నెగ్గితే ఉచితంగా బీటెక్‌, బీఎస్‌సీ, బీఏ కోర్సులు చదువుకుంటూ, ఉద్యోగ శిక్షణ తీసుకోవచ్చు. అనంతరం నేరుగా లెవెల్‌-10 పేస్కేల్‌తో ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లో ఉన్నత హోదాతో విధుల్లో చేరిపోవచ్చు. తాజాగా వెలువడిన ఎన్‌డీఏ & ఎన్‌ఏ 2021(2) ప్రకటన వివరాలు చూద్దాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కూడిక చకచకా!

10. రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన జనం

హారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఓ పెట్రోల్‌ బంకులో ఈ అవకాశం కల్పించింది. విషయం తెలియగానే వాహనదారులు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్‌ వింకో నకాలోని ఓ పెట్రోల్‌బంక్‌లో లీటరు పెట్రోల్‌ రూ.50కే అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని